భారతీయ బాలిస్టిక్ క్షిపణి రక్షణ కార్యక్రమం
శత్రు క్షిపణి దాడుల నుండి రక్షణ కల్పించే వ్యవస్థ / From Wikipedia, the free encyclopedia
భారతీయ బాలిస్టిక్ క్షిపణి రక్షణ కార్యక్రమం, క్షిపణి దాడుల నుండి దేశాన్ని రక్షించే బహుళ అంచెల రక్షణ వ్యవస్థ.[1][2] పాకిస్తాన్ నుండి ఎదురౌతున్న క్షిపణి ముప్పును ఎదుర్కొనేందుకు ప్రవేశపెట్టిన[3] ఈ వ్యవస్థలో రెండు నిరోధక క్షిపణులు ఉన్నాయి. అవి, అధిక ఎత్తులలో అడ్డుకునేందుకు పనిచేసే పృథ్వి ఎయిర్ డిఫెన్స్ (PAD) క్షిపణి, తక్కువ ఎత్తులలో అడ్డుకునే అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ (AAD) క్షిపణి. 5,000 కి.మీ. దూరం నుండి ప్రయోగించిన ఏ క్షిపణినైనా నిలువరించగల సామర్థ్యం ఈ రెండంచెల వ్యవస్థకు ఉంది.[4]
2006 నవంబరులో PAD ని పరీక్షించారు. 2007 డిసెంబరులో AAD ని పరీక్షించారు. PAD ని పరీక్షించడంతో, బాలిస్టిక్ క్షిపణి వ్యతిరేక వ్యవస్థలను అభివృద్ధి చేసుకున్న నాలుగో దేశంగా భారత్ అవతరించింది. అమెరికా, రష్యా, ఇజ్రాయిల్ మిగిలిన మూడు దేశాలు.[5] ఈ వ్యవస్థ చాలా పరీక్షలకు లోనయ్యింది. దీన్ని అధికారికంగా ప్రారంభించవలసి ఉంది.