సంప్రదింపుల అనంతరం జవహర్ లాల్ నెహ్రూ, వల్లభ్ భాయి పటేల్, ఆచార్య కృపలానీ ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ పార్టీ, మహమ్మద్ అలీ జిన్నా, లియాఖత్ అలీ ఖాన్, అబ్దుల్ రబ్ నిష్తార్ ల ప్రాతినిధ్యంలోని ముస్లిం లీగ్, సిక్ఖుల ప్రతినిధిగా సర్దార్ బల్దేవ్ సింగ్ లతో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లార్డ్ మౌంట్బాటన్ ఒప్పందానికి వచ్చాక, యు.కె. ప్రధానమంత్రి క్లెమెంట్ అట్లీ ప్రభుత్వం, భారత గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్ కలిసి చట్టాన్ని తయారుచేశారు.
అధికార బదిలీ కోసం సంప్రదింపులు చేసేందుకు వచ్చిన క్యాబినెట్ మిషన్ సమైక్య భారత సమాఖ్య ప్రతిపాదన (మే 16 ప్రతిపాదన) కు కాంగ్రెస్, ముస్లిం లీగ్ ల ఆమోదం లభించింది. కానీ క్యాబినెట్ మిషన్ సభ్యుడు క్రిప్స్ ఎవరికి అనుకూలమైన నిర్వచనం వారికి చెప్తూ ఆమోదం పొందడంతో వారు వెళ్ళగానే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జవహర్ లాల్ నెహ్రూ ప్రసంగిస్తూ దాన్ని పూర్తిగా తిరస్కరించాడు. దాంతో ఆగ్రహించిన ముస్లిం లీగ్ నాయకుడు జిన్నాప్రత్యక్ష కార్యాచరణ దినానికి పిలుపునిచ్చారు. హింసాత్మకమైన ఈ మలుపుతో కాంగ్రెస్, బ్రిటిషు ప్రభుత్వాలపై ఒత్తిడి వచ్చింది. ఈ నేపథ్యంలో దేశాన్ని సమాఖ్యగా ఉంచే మే 16 ప్రతిపాదన, పూర్తి బెంగాల్, పూర్తి పంజాబ్ లతో పాకిస్తాన్ విభజించి ఏర్పరిచే జూన్ 16 ప్రతిపాదనకు మధ్యగా మరో ప్రణాళికను ముందు సివిల్ సర్వెంట్ వి.కె.మీనన్ తయారు చేశాడు. దీని ప్రకారం బ్రిటిషు ఇండియా భారతదేశం, పాకిస్తాన్ లుగా విభజన అవుతుంది, అలాగే బెంగాల్, పంజాబ్ ప్రావిన్సులు కూడా విభజితమై, ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు పాకిస్తాన్ కు, హిందువుల సంఖ్యాధిక్యత ఉన్న ప్రాంతాలు భారతదేశానికి లభిస్తాయి. ఇది మౌంట్ బాటన్ ప్రణాళికగా పేరొందింది. దీనికి ముందు కాంగ్రెస్ వారు అంగీకరించారు. ఐతే కాంగ్రెస్ నుంచి ప్రతిపాదన విన్నప్పుడు వ్యతిరేకించినా అధికార బదిలీకి సిద్ధమైపోతున్న బ్రిటిషు ప్రభుత్వం ఈ ప్రతిపాదననూ తిరస్కరిస్తే అధికారాన్ని బేషరతుగా కాంగ్రెస్ కు బదిలీ చేయగలదని అనుమానించిన జిన్నా మౌంట్ బాటన్ నుంచి వినగానే దీనికి అంగీకరించారు.[2]
అట్లీ ప్రకటన
యునైటెడ్ కింగ్ డమ్ ప్రధానమంత్రి క్లెమెంట్ అట్లీ 1947 ఫిబ్రవరి 20న ప్రకటన ఇలావుంది:
బ్రిటిషు ప్రభుత్వం బ్రిటిషు ఇండియాకు పూర్తి స్వంత ప్రభుత్వాన్ని కనీసం 1948 జూన్ నాటికి మంజూరుచేస్తుంది.
తుది (అధికార) బదిలీ తేదీ నిర్ణయించిన తర్వాత సంస్థానాల భవితవ్యం నిర్ణయమవుతుంది.[3]
3 జూన్ ప్రణాళిక
ఇది మౌంట్ బాటన్ ప్రణాళికగా పేరొందింది.
బ్రిటిషు ప్రభుత్వం 1947 జూన్ 3న ప్రతిపాదించిన ప్రణాళికలో ఈ అంశాలున్నాయి:
భారత విభజనకు సూత్రాన్ని బ్రిటిషు ప్రభుత్వం అంగీకరించింది
వారసులుగా వచ్చే ప్రభుత్వాలకు డొమినియన్ స్థాయి ఇవ్వబడుతుంది
బ్రిటిషు కామన్వెల్త్ నుంచి ఎప్పుడైనా తప్పుకునేందుకు షరతులు లేని హక్కు ఉంటుంది
భారత స్వాతంత్ర్య చట్టం 1947 అన్నది జూన్ 3 ప్రణాళికకు అమలు వంటిది.
చట్టం లోని అతి ముఖ్యమైన నిబంధనలు:
1947 ఆగస్టు 15 న బ్రిటిష్ ఇండియాను భారతదేశం, పాకిస్తాన్ అనే రెండు కొత్త దేశాలుగా విభజించడం
బెంగాల్, పంజాబ్ ప్రావిన్సుల విభజించి, రెండు కొత్త దేశాలకు పంపకం చెయ్యడం.
రెండు కొత్త దేశాలలో గవర్నర్ జనరల్ కార్యాలయాన్ని బ్రిటన్ రాచరికపు ప్రతినిధిగా ఏర్పాటు చేయడం .
రెండు కొత్త దేశాల రాజ్యాంగ సభలకు పూర్తి శాసనాధికారాన్ని ఇవ్వడం.
1947 ఆగస్టు 15 న సంస్థానాలపై బ్రిటిష్ అధికారాన్ని ముగించడం, స్వతంత్రంగా ఉండడానికి గాని, ఏదో ఒక దేశంలో చేరడానికి గాని వాటికి ఉన్న హక్కును గుర్తించడం.[4][5]
బ్రిటిషు చక్రవర్తి "భారత చక్రవర్తి" అనే పేరును వాడడాన్ని రద్దు చేయడం (కింగ్ జార్జ్ VI రాజు 1948 జూన్ 22 న రాజ ప్రకటన ద్వారా దీన్ని అమలు చేశాడు).
సాయుధ దళాల విభజనతో సహా ఉమ్మడి ఆస్తిని రెండు కొత్త దేశాల మధ్య పంపకానికి ఈ చట్టం ఏర్పాటు చేసింది.
రెండు కొత్త డొమినియన్ రాజ్యాలు: భారత సామ్రాజ్యం నుండి రెండు కొత్త డొమినియన్లు ఉద్భవిస్తాయి: భారతదేశం, పాకిస్తాన్.
జరిగే తేదీ: 1947 ఆగస్టు 15 ను విభజన తేదీగా ప్రకటించారు
భూభాగాలు:
పాకిస్తాన్: తూర్పు బెంగాల్, పశ్చిమ పంజాబ్, సింధ్, బెలూచిస్తాన్ చీఫ్ కమిషనర్ ప్రావిన్స్.
నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ (ఇప్పుడు పఖ్తూన్ఖ్వా) విధి ప్రజాభిప్రాయ సేకరణలో తేలుతుంది.
బెంగాల్, అస్సాం:
భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం ఏర్పాటు చేసిన బెంగాల్ ప్రావిన్స్ ఇకపై ఉనికిలో ఉండదు.
దీని స్థానంలో తూర్పు బెంగాల్, పశ్చిమ బెంగాల్ అనే రెండు కొత్త ప్రావిన్సులను ఏర్పాటు చేస్తారు.
అస్సాం ప్రావిన్స్లోని జిల్లా సిల్హెట్ విధి ప్రజాభిప్రాయ సేకరణలో తేలుతుంది.
పంజాబ్:
భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం ఏర్పడిన ప్రావిన్స్ ఇకపై ఉనికిలో ఉండదు.
పశ్చిమ పంజాబ్ తూర్పు పంజాబ్ అనే రెండు కొత్త ప్రావిన్సులను ఏర్పాటు చేస్తారు.
కొత్త ప్రావిన్సుల సరిహద్దులను గవర్నర్ జనరల్ నియమించే సరిహద్దు కమిషన్ అవార్డు ద్వారా, నిర్ణీత తేదీకి ముందు గానీ తరువాత గానీ నిర్ణయించాలి.
కొత్త డొమినియన్ల కోసం రాజ్యాంగం: కొత్త రాజ్యాంగాన్ని రూపొందించే లోపు, కొత్త రాజ్యాలను, దాని ప్రావిన్సులనూ భారత ప్రభుత్వ చట్టం 1935 కు లోబడి పాలిస్తారు. (కొత్త డొమినియన్ ప్రభుత్వాలకు తాత్కాలిక నిబంధనలు).
కొత్త డొమినియన్ల గవర్నర్ జనరళ్ళు:
బ్రిటన్ రాజు కొత్త డొమినియన్లకు ఒక్కో గవర్నర్ జనరల్ను నియమించాలి. కొత్త రాజ్యాల శాసనసభ చట్టానికి లోబడి ఇది ఉంటుంది.
రెండు డొమినియన్లకు గవర్నర్ జనరల్గా ఒకే వ్యక్తి: కొత్త డొమినియన్లలో ఏదైనా శాసనసభ చట్టం ద్వారా ఒప్పుకోకపోతే తప్ప, అదే ఒకే వ్యక్తి రెండింటికి గవర్నర్ జనరల్ కావచ్చు.
గవర్నర్ జనరల్ అధికారాలు: (సెక్షన్ -9)
ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకురావడానికి గవర్నర్ జనరల్కు అధికారం ఇవ్వబడింది.
భూభాగాలు, అధికారాలు, విధులు, హక్కులు, ఆస్తులు, బాధ్యతలు మొదలైన వాటిని విభజించడం గవర్నర్ జనరల్ బాధ్యత.
గవర్నర్ జనరల్ దీనిని అవసరమని భావించిన చోట్ల, భారత ప్రభుత్వ చట్టం 1935 ను స్వీకరించడానికి, సవరించడానికి.
ఏదైనా మార్పును ప్రవేశపెట్టే అధికారం 1948 మార్చి 31 వరకు ఉంది. ఆ తరువాత ఆ చట్టాన్ని సవరించడాన్నీ, స్వీకరించడాన్నీ రాజ్యాంగ అసెంబ్లీ చూసుకుంటుంది. (కొత్త డొమినియన్ ప్రభుత్వానికి తాత్కాలిక నిబంధనలు.)
ఏదైనా చట్టానికి సమ్మతి ఇవ్వడానికి గవర్నర్ జనరల్కు పూర్తి అధికారాలు ఉన్నాయి.
కొత్త డొమినియన్లకు చట్టం:
ప్రస్తుత శాసన వ్యవస్థయే రాజ్యాంగ తయారీ సంస్థగాను, శాసనసభగానూ కొనసాగించడానికి అనుమతించారు. (ప్రతి కొత్త డొమినియన్ ప్రభుత్వానికి తాత్కాలిక నిబంధనలు. )
డొమినియన్ కు చెందిన శాసనసభకు ఆ డొమినియన్ కోసం చట్టాలు చేయడానికి పూర్తి అధికారాలు ఇవ్వబడ్డాయి, పరిపాలనా ప్రాంతానికి బయట కార్యకలాపాలు జరిపే చట్టాలతో సహా.
విభజన తేదీ తరువాత UK పార్లమెంటు చేసే ఏ చట్టమూ కొత్త డొమినియన్ ప్రాంతాలకు వర్తించదు.
కొత్త డొమినియన్ల శాసనసభలు చేసే ఏ చట్టమైనా, లేదా చట్టం లోని ఏ నిబంధనైనా, ఇంగ్లాండ్ చట్టానికి విరుద్ధంగా ఉన్నంత మాత్రాన అది చెల్లకుండా పోదు.
డొమినియన్ గవర్నర్ జనరల్, శాసనసభ చేసే ఏ చట్టానికైనా హిజ్ మెజెస్టీ పేరు మీద అనుమతి ఇవ్వడానికి పూర్తి అధికారాలు కలిగి ఉంటారు. [పాకిస్తాన్ రాజ్యాంగ అసెంబ్లీ కాన్ఫిగరేషన్ (CAP I): కేంద్ర శాసనసభలో 69 మంది సభ్యులు + 10 వలస సభ్యులు = 79].
కొత్త డొమినియన్ల ఏర్పాటు పర్యవసానాలు:
హిస్ మెజెస్టీ ప్రభుత్వం కొత్త డొమినియన్లపై అన్ని బాధ్యతలను కోల్పోయింది.
భారతీయ రాష్ట్రాలపై హిజ్ మెజెస్టీ ప్రభుత్వం యొక్క అధికారం ముగిసింది.
ఈ చట్టం ఆమోదించేటప్పుడు అమలులో ఉన్న భారతీయ రాష్ట్రాలు, గిరిజన ప్రాంతాలతో ఉన్న అన్ని ఒప్పందాలూ, ఒడంబడికలూ ముగిశాయి.
బ్రిటిష్ క్రౌన్ బిరుదుల నుండి "భారత చక్రవర్తి" అనే బిరుదు తొలగించబడింది.
సెక్రెటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా కార్యాలయం రద్దైంది. సివిల్ సర్వీస్ లేదా సివిల్ పోస్టులకు బ్రిటను సింహాసనం తరపున సెక్రెటరీ ఆఫ్ స్టేట్ నియామకాలకు చేసే GOI చట్టం 1935 లోని నిబంధనలు పనిచేయడం మానేశాయి.
పౌర అధికారులు: 1947 ఆగస్టు 15 న, అంతకు ముందూ నియమించబడిన ప్రభుత్వ ఉద్యోగుల సేవలను పూర్తి ప్రయోజనాలతో కొత్త డొమినియన్ల ప్రభుత్వాల క్రింద కొనసాగించడానికి సెక్షన్ 10 వీలు కలిగిస్తోంది.
సాయుధ దళాలు: 11, 12, 13 సెక్షన్లు భారత సాయుధ దళాల భవిష్యత్తు గురించి చెబుతాయి. 1947 జూన్ 7 న విభజన కమిటీని ఏర్పాటు చేశారు. విభజన గురించి నిర్ణయించడానికి, ప్రతి వైపు నుండి ఇద్దరేసి ప్రతినిధులు ఉంటారు. వైస్రాయ్ చైర్మనుగా ఉంటారు. విభజన ప్రక్రియ ప్రారంభమైన వెంటనే దీని స్థానంలో పార్టిషన్ కౌన్సిల్ ను నియమించాల్సి ఉంది.
మొదటి, రెండవ షెడ్యూళ్ళు:
మొదటి షెడ్యూల్: తూర్పు బెంగాల్ కొత్త ప్రావిన్స్లో తాత్కాలికంగా చేర్చబడిన జిల్లాల జాబితా చూపిస్తుంది:
చిట్టగాంగ్ డివిజన్: చిట్టగాంగ్, చిట్టగాంగ్ కొండ ప్రాంతాలు, నోఖాలి, టిప్పెరా జిల్లాలు.
చాలా హింస జరిగింది. భారత భూభాగం నుండి చాలా మంది ముస్లింలు పాకిస్తాన్కు పారిపోయారు; పాకిస్తాన్ నుండి హిందువులు, సిక్కులు భారతదేశానికి పారిపోయారు. హింస నుండి తప్పించుకుని తమ కొత్త దేశానికి పారిపోయే క్రమంలో చాలా మంది తమ ఆస్తులు, వస్తువులన్నింటినీ విడిచిపెట్టారు.[7]
సంస్థానాలు
1947 జూన్ 4 న, మౌంట్ బాటెన్ ఒక విలేకరుల సమావేశం నిర్వహించారు, దీనిలో అతను రాచరిక సంస్థానాల ప్రశ్నను పరిష్కరించాడు. అవి 563 కి పైగా ఉన్నాయి. బ్రిటన్కు, భారతీయ సంస్థానాలకు మధ్య ఉన్న ఒప్పందం సంబంధాలు ముగిసిపోతాయి. 1947 ఆగస్టు 15 న బ్రిటిష్ అధికారం ముగుస్తుంది. క్రొత్త డొమినియన్లలో ఏదో ఒకదానిలో చేరడానికి, లేదా స్వతంత్రంగా ఉండడానికి వారికి స్వేచ్ఛ ఉంటుంది.[8][9]
ఆగస్టు 15 నాటికి 560 కి పైగా రాచరిక రాష్ట్రాలు భారతదేశానికి చేరాయి. జునాగఢ్, హైదరాబాద్, జమ్మూ కాశ్మీర్ లు దీనికి మినహాయింపు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం భారతదేశం, పాకిస్తాన్ రెండింటికీ ఆనుకుని ఉంది. కానీ దాని హిందూ పాలకుడు మొదట్లో స్వతంత్రంగా ఉండటానికి ఎంచుకున్నాడు. పాకిస్తాన్ గిరిజన దాడి తరువాత, అతను 1947 అక్టోబరు 26 న భారతదేశానికి చేరాడు. భారతదేశం పాకిస్తాన్ మధ్య ఈ రాష్ట్రం వివాదాస్పదమైంది.[10]జునాగఢ్ రాష్ట్రం మొదట్లో పాకిస్తాన్కు చేరింది, కాని దాని హిందూ జనాభా తిరుగుబాటు చేసారు. శాంతిభద్రతలు విచ్ఛిన్నమవడంతో, దాని దివాన్ 1947 నవంబరు 8 న పరిపాలనను చేపట్టవలసిందిగా భారతదేశాన్ని అభ్యర్థించారు. భారతదేశం 1948 ఫిబ్రవరి 20 న రాష్ట్రంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించింది, దీనిలో ప్రజలు భారతదేశంలో చేరడానికి అధికంగా ఓటు వేశారు. హైదరాబాద్ రాజ్యంలో, మెజారిటీ హిందూ జనాభా ఉంది. ముస్లిం పాలకుడు తీవ్రమైన కల్లోలాన్ని, వర్గ హింసనూ ఎదుర్కొన్నాడు. 1948 సెప్టెంబరు 13 న రాష్ట్రంలో భారతదేశం జోక్యం చేసుకుంది, ఆ తరువాత రాష్ట్ర పాలకుడు చేరిక ఒప్పందంపై సంతకం చేసి, భారతదేశంలో చేరాడు.
పాకిస్థాన్
ముహమ్మద్ అలీ జిన్నా పాకిస్తాన్ గవర్నర్ జనరల్ అయ్యాడు. లియాఖత్ అలీ ఖాన్ పాకిస్తాన్ ప్రధాని అయ్యాడు.
1947 1948 అక్టోబరు మార్చి మధ్య, అనేక ముస్లిం-మెజారిటీ సంస్థానాల పాలకులు పాకిస్తాన్లో చేరడానికి చేరిక ఒప్పందంపై సంతకం చేశారు. వీటిలో అమ్బ్, బహావల్పూర్, చిత్రాల్, దిర్, కలాట్, ఖైర్పూర్, ఖరణ్, లాస్ బేలా, మక్రాన్, స్వాత్ లు ఉన్నాయి.[10][11][12]
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 395 లోను, 1956 నాటి పాకిస్తాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 221 లోనూ భారత స్వాతంత్ర్య చట్టాన్ని రద్దు చేసారు.[13] రెండు రాజ్యాంగాలు కొత్త దేశాలకు ఎక్కువ స్వాతంత్ర్యం ఇచ్చే ఉద్దేశంతో ఉన్నాయి. బ్రిటిషు చట్టం ప్రకారం, కొత్త రాజ్యాంగాలకు ఈ చట్టాన్ని రద్దు చేయడానికి చట్టపరమైన అధికారం లేనప్పటికీ, స్వదేశంలో చేసుకునే చట్టాల ఆధారంగా మాత్రమే స్వతంత్ర న్యాయ వ్యవస్థలను స్థాపించే ఉద్దేశంతో వీటిని రద్దు చేసాయి.[14] యునైటెడ్ కింగ్డమ్లో ఈ చట్టాన్ని రద్దు చేయలేదు, అక్కడ ఇప్పటికీ దాని ప్రభావం ఉంది. అయితే, దానిలోని కొన్ని విభాగాలను రద్దు చేసారు.
గాంధీ, రాజ్ మోహన్ (మే 2016). "విజయం". వల్లభ్ భాయ్ పటేల్:జీవిత కథ (in తెలుగు (అనువాదం)) (2ed.). హైదరాబాద్: ఎమెస్కో బుక్స్.{{cite book}}: CS1 maint: unrecognized language (link)
See Section 7 (1) (b): "the suzerainty of His Majesty over the Indian States lapses, and with it, all treaties and agreements in force at the date of the passing of this Act between His Majesty and the rulers of Indian States, all functions exercisable by His Majesty at that date with respect to Indian States, all obligations of His Majesty existing at that date towards Indian States or the rulers thereof, and all powers, rights, authority or jurisdiction exercisable by His Majesty at that date in or in relation to Indian States by treaty, grant, usage, sufferance or otherwise."
Z. H. Zaidi, ed., Jinnah Papers: The states: Historical and Policy Perspectives and Accession to Pakistan, vol. VIII (Quaid-i-Azam Papers Project, Government of Pakistan, 2003), p. 113
"Article 221: The Government of India Act, 1935, and the Indian Independence Act, 1947, together with all enactments amending or supplementing those Acts, are hereby repealed: Provided that the repeal of the provisions of the Government of India Act, 1935, applicable for the purposes of Article 230 shall not take effect until the first day of April, 1957."