భారతదేశానికి బోఫోర్స్ హొవిట్జర్ల సరఫరాలో లంచాలు ఇచ్చిన కుంభకోణం From Wikipedia, the free encyclopedia
బోఫోర్స్ కుంభకోణం అనేది 1980 లు, 1990 లలో భారతదేశం, స్వీడన్ ల మధ్య జరిగిన ఒక ప్రధాన ఆయుధ-కాంట్రాక్టుకు సంబంధించిన రాజకీయ కుంభకోణం. దీన్ని భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు మొదలుపెట్టారు. ఇందులో భారత ప్రధాని రాజీవ్ గాంధీ, భారత స్వీడిష్ ప్రభుత్వాలలోని అనేక ఇతర సభ్యులు చిక్కుకున్నారు. ఆయుధాల తయారీదారు బోఫోర్స్ AB తయారు చేసిన 155 మి.మీ. ఫీల్డ్ హోవిట్జర్ల కొనుగోలు కాంట్రాక్టులో కిక్బ్యాక్లు అందుకున్నారని ఆరోపించారు.[1] ఈ సంస్థ వాలెన్బర్గ్ కుటుంబానికి చెందిన స్కాండినవిస్కా ఎన్స్కిల్డా బాంకెన్ పెట్టిన పెట్టుబడిపై ఆధారపడింది.[2] ఈ కుంభకోణం 410 ఫీల్డ్ హోవిట్జర్ల విక్రయం కోసం భారత ప్రభుత్వంతో స్వీడిష్ ఆయుధ తయారీదారు బోఫోర్స్ మధ్య కుదిరిన US $1.4 బిలియన్ల ఒప్పందంలో చెల్లించిన అక్రమ కిక్బ్యాక్లకు సంబంధించినది. ఇది స్వీడన్లో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద ఆయుధ ఒప్పందం. అభివృద్ధి ప్రాజెక్టుల కోసం కేటాయించిన డబ్బును ఈ ఒప్పందాన్ని కుదిర్చేందుకు మళ్లించారు. నిబంధనలను ఉల్లంఘించడం, సంస్థలను బైపాస్ చేయడం జరిగిందని దర్యాప్తులో వెల్లడైంది.[3]
స్వీడిష్ పోలీసులలో విజిల్బ్లోయర్ చెప్పిన కథనం ఆధారంగా 1987 ఏప్రిల్ 16 న, ఒక స్వీడిష్ రేడియో స్టేషన్ ఒక కథనాన్ని ప్రసారం చేసింది. ప్రసిద్ధ స్వీడిష్ ఫిరంగి తయారీదారు బోఫోర్స్, రూ 1500 కోట్ల కాంట్రాక్టు పొందడం కోసం స్వీడన్, భారతదేశంతో సహా అనేక దేశాల లోని వ్యక్తులకు లంచాలు చెల్లించిందని ఆరోపించింది. భారత సైన్యం కోసం, 410 బోఫోర్స్ 155 మి.మీ. హొవిట్జర్లు సరఫరా చేసే ఒప్పందం కోసం, అంతకు కిందటి సంవత్సరం ఆ లంచాలు చెల్లించారు.[4] అయితే, భారతదేశంలోని వార్తాపత్రికలు ఏవీ ఈ విషయాన్ని గుర్తించలేదు. 1987 మేలో, స్వీడిష్ రేడియో స్టేషన్ ప్రసారం చేసిన ఒక ప్రసారం ప్రకారం, భారతీయ రాజకీయ నాయకులు, కాంగ్రెస్ పార్టీ సభ్యులు, బ్యూరోక్రాట్లకు రూ 60 కోట్ల లంచాలు బోఫోర్స్ చెల్లించింది. ఆ సమయంలో స్వీడన్లో ఉన్న ది హిందూ కు చెందిన ఒక యువ పాత్రికేయురాలు, చిత్రా సుబ్రమణ్యం, మరొక కథనాన్ని కవర్ చేస్తూ ఉన్నపుడు ఇది ఆమె దృష్టికి వచ్చింది. ఈ కుంభకోణం కారణంగా, 1989 నవంబరులో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో పాలక భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది.[5] స్వీడిష్ కంపెనీ భారతీయ అగ్ర రాజకీయ నాయకులు, కీలక రక్షణ అధికారులకు రూ 64 కోట్ల లంచాలు ఇచ్చింది.[6]
విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ రక్షణ మంత్రిగా ఉన్న సమయంలో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. స్వీడిష్ రేడియోలో రాయిటర్స్ వార్తల వెల్లడి ద్వారా పరిశోధనాత్మక జర్నలిజం ద్వారా వెల్లడైంది. ది హిందూ వార్తాపత్రికకు చెందిన ఎన్. రామ్ నేతృత్వంలోని బృందం దాన్ని ముందుకు తీసుకెళ్ళింది.[7] ది హిందూ కోసం రాసే చిత్రా సుబ్రమణ్యం, చెల్లింపులను వివరించే 350 కి పైగా పత్రాలను పొందారు. తర్వాత ది ఇండియన్ ఎక్స్ప్రెస్, ది స్టేట్స్మన్లో కథనాలు వచ్చాయి. ప్రభుత్వం నుండి వచ్చిన ఒత్తిడితో ది హిందూ, బోఫోర్స్ కుంభకోణం గురించి కథనాలను ప్రచురించడం ఆపివేయడంతో, చిత్రా సుబ్రమణ్యం పై రెండు వార్తాపత్రికలకు తన కథనాలను ఇచ్చింది. ఈ కుంభకోణపు 25వ వార్షికోత్సవం సందర్భంగా 2012 ఏప్రిల్లో ది హూట్లో ప్రచురించబడిన ఒక ఇంటర్వ్యూలో ఆమె,[8] స్వీడిష్ పోలీసు మాజీ చీఫ్ స్టెన్ లిండ్స్ట్రోమ్, తనకు ఆ పత్రాలను ఎందుకు లీక్ చేసాడో, ప్రజాస్వామ్యంలో విజిల్-బ్లోయర్ల పాత్ర ఏమిటో ఆమె చర్చించింది.[1]
1977 - పాకిస్తాన్ సరికొత్త అమెరికన్ లాంగ్-రేంజ్ 155-మిమీ M198 హోవిట్జర్లను కొనుగోలు చేయాలనుకుంటోందన్న నివేదికలకు ప్రతిస్పందనగా (అమెరికాలో రాజకీయ ఆందోళనల కారణంగా ఇది ఆగిపోయింది.[9]), భారతదేశం బోఫోర్స్తో పాటు మరొక ఆరు తయారీదారులను తమ హోవిట్జర్లను సూచించమని అభ్యర్థించింది.[10]
1981 ప్రారంభంలో - ఫీల్డ్ ట్రయల్స్లో పాల్గొనడానికి నాలుగు హోవిట్జర్లు షార్ట్లిస్ట్ అయ్యాయి. అవి: FH-77B, FH-70, GHN-45, GIAT-155 TR . [10]
1985 - FH-70, GHN-45 లు ట్రయల్స్ నుండి తొలగించబడ్డాయి.[10]
1986 మార్చి 24 - భారత ప్రభుత్వం, స్వీడిష్ ఆయుధ కంపెనీ బోఫోర్స్ ల మధ్య 410 155 mm హోవిట్జర్ ఫీల్డ్ గన్స్ సరఫరా కోసం $285 మిలియన్ల ఒప్పందంపై సంతకాలయ్యాయి. [11]
1987 ఏప్రిల్ 16 - అగ్ర స్వీడిష్,[12] భారతీయ రాజకీయ నాయకులు, కీలక రక్షణ అధికారులతో సహా అనేక దేశాలకు చెందిన వ్యక్తులకు ఒప్పందం కుదుర్చుకోవడానికి బోఫోర్స్ లంచాలు చెల్లించిందని స్వీడిష్ రేడియో ఆరోపించింది.[11][13]
1987 - వెల్లడి ఫలితంగా, భారత ప్రభుత్వం బోఫోర్స్ను బ్లాక్లిస్ట్లో చేర్చింది, కంపెనీని భారతదేశంలో వ్యాపారం చేయకుండా నిరోధించింది.[14] కుంభకోణంతో సంబంధం ఉన్న మధ్యవర్తి ఒట్టావియో క్వత్రోచి, పెట్రోకెమికల్స్ సంస్థ స్నాంప్రోగెట్టికి చెందిన ఇటాలియన్ వ్యాపారవేత్త.[1] క్వత్రోచి రాజీవ్ గాంధీ కుటుంబానికి సన్నిహితుడు, 1980 లలో పెద్ద వ్యాపార సంస్థలకు, భారత ప్రభుత్వానికీ మధ్య శక్తివంతమైన బ్రోకర్గా ఎదిగాడు.[1]
1991 మే 21 - కేసు విచారణలో ఉండగా, రాజీవ్ గాంధీని ఎల్టీటీఈ ఈ కేసుతో సంబంధం లేని కారణాలతో హత్య చేసింది.[1]
1997 - సంవత్సరాల న్యాయ పోరాటం తర్వాత స్విస్ బ్యాంకులు దాదాపు 500 పత్రాలను విడుదల చేశాయి.
1999 - భారత ప్రభుత్వం బోఫోర్స్పై నిషేధాన్ని ఎత్తివేసింది. కార్గిల్ యుద్ధ సమయంలో బోఫోర్స్ తుపాకులు సమర్థవంతంగా పనిచేస్తాయని నిరూపించబడినప్పటికీ విడిభాగాల కొరత కారణంగా నిషేధాన్ని ఎత్తివేసారు.[14]
1999 అక్టోబరు 22 - భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) క్వత్రోచి, విన్ చద్దా, రాజీవ్ గాంధీ, రక్షణ కార్యదర్శి SK భట్నాగర్ లతో పాటు అనేక మందిపై మొదటి ఛార్జిషీట్ దాఖలు చేసింది.[15]
2001 - విన్ చద్దా, SK భట్నాగర్ లు మరణించారు. [16]
2002 జూన్ 10 - ఢిల్లీ హైకోర్టు ఈ కేసులో ఇప్పటివరకు జరిగిన అన్ని చర్యలను రద్దు చేసింది . అయితే, దీనిని భారత సుప్రీంకోర్టు 2003 జూలై 7న తిరగ్గొట్టింది [17]
2004 - కేంద్ర ప్రభుత్వం మారింది. 2004 లోక్సభ ఎన్నికల తర్వాత భారత జాతీయ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 2004 ఫిబ్రవరి 5న, ఢిల్లీ హైకోర్టు రాజీవ్ గాంధీపైన, ఇతరులపైనా లంచం ఆరోపణలను కొట్టివేసింది.[18]
2005 మే 31 - ఢిల్లీ హైకోర్టు బ్రిటీష్ వ్యాపార సోదరులు శ్రీచంద్, గోపీచంద్, ప్రకాష్ హిందూజాలపై ఉన్న ఆరోపణలను కొట్టివేసింది. అయితే ఇతరులపై ఆరోపణలు అలాగే ఉన్నాయి.[19]
డిసెంబరు 2005 - B. దాత్, భారత ప్రభుత్వం, CBI తరపున వ్యవహరించే భారత అదనపు సొలిసిటర్ జనరల్, ఈ ఖాతాలకు, బోఫోర్స్ లంచాలకూ లింక్ చేయడానికి తగిన సాక్ష్యాధారాలు లేనందున, గతంలో స్తంభింపజేసిన క్వత్రోచికి చెందిన రెండు బ్రిటీష్ బ్యాంక్ ఖాతాలను విముక్తం చెయ్యాలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. స్థంభింపజేయక ముందు, ఆ రెండు ఖాతాలలో €3 మిలియన్లు, $1 మిలియన్ ఉండేవి. లండన్లోని రెండు బ్యాంకు ఖాతాల నుండి క్వత్రోచి డబ్బును విత్డ్రా చేయలేదని నిర్ధారించమని జనవరి 16 న భారత సుప్రీంకోర్టు భారత ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిందితులు ఈ రెండు ఖాతాల నుండి సుమారు US$4.6 మిలియన్లను ఇప్పటికే ఉపసంహరించుకున్నారని CBI, 2006 జనవరి 23న ఒప్పుకుంది. ఆ తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.[15]
2006 జనవరి 16 - తాము ఇప్పటికీ క్వత్రోచిని అప్పగించే ఉత్తర్వులను కొనసాగిస్తున్నామని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో CBI పేర్కొంది. CBI అభ్యర్థన మేరకు ఇంటర్పోల్, క్వత్రోచిని అరెస్టు చేయడానికి రెడ్ కార్నర్ నోటీసును విడుదల చేసింది.[20]
2007 ఫిబ్రవరి 6 - క్వత్రోచిని 2007 ఫిబ్రవరి 6న అర్జెంటీనాలో నిర్బంధించారు. అయితే అతని నిర్బంధ వార్తను ఫిబ్రవరి 23న మాత్రమే CBI విడుదల చేసింది. క్వత్రోచిని అర్జెంటీనా పోలీసులు విడుదల చేశారు. అయితే, అతని పాస్పోర్ట్ను స్వాధీనం చేసుకుని, అతన్ని దేశం విడిచి వెళ్ళడానికి అనుమతించలేదు.[21] భారతదేశం, అర్జెంటీనాల మధ్య నేరస్థుల అప్పగింత ఒప్పందం లేనందున, అర్జెంటీనా సుప్రీంకోర్టులో కేసు సమర్పించబడింది. క్వత్రోచి అరెస్టుకు ఆధారమైన కీలకమైన కోర్టు ఉత్తర్వును భారత ప్రభుత్వం అందించకపోవడంతో భారత ప్రభుత్వం అప్పగింత కేసును కోల్పోయింది. ఆ తర్వాత, కోర్టు తీర్పుకు సంబంధించిన అధికారిక ఆంగ్ల అనువాదాన్ని పొందడంలో ఆలస్యం కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయంపై అప్పీల్ చేయలేదు.[22]
2011 మార్చి 4 - ఢిల్లీ కోర్టు క్వత్రోచికి వ్యతిరేకంగా తగిన సాక్ష్యాధారాలు లేనందున కేసు నుండి తాత్కాలిక ఉపశమనం కల్పించింది.[23]
2013 జూలై 12 - క్వత్రోచి మిలన్లో గుండెపోటుతో మరణించాడు.[24]
వివాదాస్పదమైనప్పటికీ, బోఫోర్స్ తుపాకీని పాకిస్తాన్తో కార్గిల్ యుద్ధంలో ప్రాథమిక ఫీల్డ్ ఫిరంగిగా విస్తృతంగా ఉపయోగించారు. యుద్దభూమి కమాండర్ల ప్రకారం ఈ గన్ కారణంగా, పాకిస్తాన్కు వ్యతిరేకంగా భారతదేశానికి పైచేయి దక్కింది.[25]
నవంబరు 2013లో విడుదలైన తన పుస్తకం, అన్నోన్ ఫేసెట్స్ ఆఫ్ రాజీవ్ గాంధీ, జ్యోతి బసు, ఇంద్రజిత్ గుప్తా పుస్తకంలో మాజీ సీబీఐ డైరెక్టర్ డాక్టర్ ఏపీ ముఖర్జీ, రాజీవ్ గాంధీ రక్షణ సరఫరాదారులు చెల్లించే కమీషన్ను కాంగ్రెస్ పార్టీ నిర్వహణ ఖర్చుల కోసం ప్రత్యేకంగా ఉపయోగించాలని కోరుకున్నాడని రాసాడు.[26] 1989 జూన్ 19న ప్రధాని నివాసంలో వారిద్దరి మధ్య జరిగిన సమావేశంలో గాంధీ తన వైఖరిని వివరించారని ముఖర్జీ చెప్పాడు.[27] అయితే, దర్యాప్తుకు నాయకత్వం వహించిన స్వీడిష్ పోలీసు మాజీ హెడ్ స్టెన్ లిండ్స్ట్రోమ్ ప్రకారం, రాజీవ్ గాంధీకి చెల్లింపులు అందినట్లు సూచించడానికి ఏమీ కనబడలేదు. అయితే కిక్బ్యాక్ల గురించి తెలిసినా వాటిపై చర్యలు తీసుకోకపోవడాన్ని అతడు తప్పుబట్టాడు.[28]
బోఫోర్స్ కుంభకోణం, తదుపరి ఎన్నికలలో ఒక ప్రధాన అంశంగా హైలైట్ అయింది. దీనితో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయింది. వి. పి. సింగ్ రాజీనామాకు కారణం బోఫోర్స్ కుంభకోణమేనని విస్తృతంగా విశ్వసించినప్పటికీ, హెచ్డిడబ్ల్యు జలాంతర్గామి ఒప్పందం (శిశుమార్ క్లాస్) లో భారతీయ ఏజెంట్లు తీసుకున్న కమీషన్ల విషయమై మంత్రివర్గంలో వచ్చిన విభేదాల కారణంగానే తాను రాజీనామా చేసినట్లు సింగ్ స్పష్టం చేశాడు.[29]
బ్రిటీష్ రాజ్ సమయంలోను, స్వతంత్ర భారతదేశంలోనూ భారతదేశంలో ఆయుధ ఒప్పందాలలో మధ్యస్థులను నియమించారు. వారికి వివిధ శీర్షికలు, ముసుగుల క్రింద కమీషన్లు అందాయి.[30] వీటిలో కొన్ని వ్యక్తిగత లంచాలుగా చెల్లించగా, మరికొందరు రాజకీయ పార్టీలకు విరాళాలుగా చెల్లించారు.[31] ఇది అధిక స్థాయిలో అవినీతికి దారితీసింది. నిర్ణయాలను ప్రభావితం చేయడానికి రాజకీయ నాయకులు, అధికారులు, రక్షణ సిబ్బందికి చెల్లింపులు జరిగాయి. బోఫోర్స్ కుంభకోణం వల్ల ఏర్పడిన రాజకీయ వివాదాల ఫలితంగా, ఆయుధ ఒప్పందాలలో మధ్యవర్తులను నిషేషించారు.[32][33][34]
2015లో, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆధ్వర్యంలోని భారత ప్రభుత్వం ఆయుధ ఒప్పందాలలో మధ్యవర్తులు తమను తాము "కంపెనీ ప్రతినిధులు" అని పిలుచుకుంటే, అది చట్టబద్ధమేణని ప్రకటించింది.[35] అటువంటి సందర్భాలలో, ఆయుధాల ఒప్పందాలను కుదిర్చినందుకు మధ్యవర్తులకు ప్రభుత్వం "లీగల్ ఫీజు" పేరుతో చెల్లిస్తుందని అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ప్రకటించాడు.[36]
భారతీయ జనతా పార్టీకి చెందిన మాజీ కేబినెట్ మంత్రి అరుణ్ జైట్లీ ఈ కేసులో సీబీఐ వ్యవహరించిన తీరును విమర్శించాడు.
బోఫోర్స్ కేసు ముగింపు అనేక మలుపులతో నిండిపోయింది. 2004 లో ఢిల్లీ హైకోర్టు రాజీవ్ గాంధీ మరణానంతరం అతనికి క్లీన్ చిట్ ఇచ్చింది. అతనిపై లేదా ఏ ప్రభుత్వోద్యోగిపై అవినీతి కేసు లేదని పేర్కొంది. 14 ఏళ్లుగా ఈ కేసును కొనసాగించిన సీబీఐని ఈ తీర్పు దిగ్భ్రాంతికి గురిచేసింది. అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి కూడా ఎదురుదెబ్బ తగిలింది. అయితే ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో పోటీ చేస్తామని సీబీఐ పేర్కొంది.[41]
2011 లో ఢిల్లీ కోర్టు ఈ కేసును మూసివేయడానికి సీబీఐకి అనుమతి ఇచ్చింది.[42] ఆ తర్వాత 2012 లో, విచారణలకు నాయకత్వం వహించి, తనను తాను విజిల్బ్లోయర్గా గుర్తించిన స్వీడిష్ పోలీసు చీఫ్ స్టెన్ లిండ్స్ట్రోమ్, రాజీవ్ గాంధీ ఎలాంటి తప్పు చేయలేదని, బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్కు అతని కుటుంబానికీ ఈ కుంభకోణంలో ఎలాంటి ప్రమేయం లేదని చెప్పాడు. బదులుగా, నిబంధనలను ఉల్లంఘించడం, సంస్థలను దాటవేయడం, అభివృద్ధి ప్రాజెక్టుల కోసం కేటాయించిన నిధులను మళ్ళించడం తదితరాల ద్వారా ఒప్పందాన్ని పొందేందుకు స్వీడిష్ ప్రభుత్వం ప్రయత్నించిందని అతను ఆరోపించాడు.[43]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.