బంగాళాఖాతం
From Wikipedia, the free encyclopedia
బంగాళాఖాతం హిందూ మహాసముద్రపు ఈశాన్య భాగం. దీనికి పశ్చిమ, వాయవ్య దిశల్లో భారతదేశం, ఉత్తరాన బంగ్లాదేశ్, తూర్పున మయన్మార్, అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి. శ్రీలంక లోని సంగమన్ కందా కు, వాయవ్య కొన వద్ద ఉన్న సుమత్రా (ఇండోనేషియా) కూ మధ్య ఉండే రేఖ, బంగాళాఖాతానికి దక్షిణ సరిహద్దు. ఇది, అఖాతం అని పిలువబడే నీటి ప్రాంతాల్లో ప్రపంచంలో కెల్లా అతి పెద్దది. దక్షిణ ఆసియా, ఆగ్నేయాసియాలో దీనిపై ఆధారపడిన దేశాలు ఉన్నాయి. ప్రాచీన భారతదేశంలో, బంగాళాఖాతాన్ని కళింగ సాగర్ అనేవారు. తరువాత బ్రిటిషు భారతదేశంలో, చారిత్రాత్మక బెంగాల్ ప్రాంతంలోని కలకత్తా రేవు, భారతదేశంలో బ్రిటిషు సామ్రాజ్యానికి ముఖద్వారం కావడంతో, ఆ ప్రాంతం పేరుతో ఇది బంగాళాఖాతంగా పిలవబడింది. ప్రపంచంలోనే అతి పొడవైన సముద్రపు బీచ్ అయిన కాక్స్ బజార్, అతిపెద్ద మడ అడవులూ బెంగాల్ పులికి సహజ ఆవాసమూ అయిన సుందర్బన్స్ బంగాళాఖాతం తీరం లోనే ఉన్నాయి.
బంగాళాఖాతం | |
---|---|
ప్రదేశం | దక్షిణ ఆసియా, అగ్నేయ ఆసియా |
అక్షాంశ,రేఖాంశాలు | 15°N 88°E |
రకం | అఖాతం |
ప్రాథమిక ప్రవేశం | హిందూ మహాసముద్రం |
బేసిన్ దేశాలు | బంగ్లాదేశ్, భారతదేశం ఇండోనేషియా మయన్మార్, శ్రీలంక[1][2] |
గరిష్ట పొడవు | 2,090 km (1,300 mi) |
గరిష్ట వెడల్పు | 1,610 km (1,000 mi) |
2,600,000 km2 (1,000,000 sq mi) | |
సగటు లోతు | 2,600 m (8,500 ft) |
అత్యధిక లోతు | 4,694 m (15,400 ft) |
బంగాళా ఖాతం విస్తీర్ణం 2,600,000 square kilometres (1,000,000 sq mi). దీనిలోకి అనేక పెద్ద నదులు ప్రవహిస్తున్నాయి: గంగా - హుగ్లీ, పద్మ, బ్రహ్మపుత్ర - జమునా, బరాక్ - సుర్మా - మేఘనా, ఇర్వాడ్డి, గోదావరి, మహానది, బ్రాహ్మణి, బైతారాణి, కృష్ణ, కావేరి. దీని అంచున చెన్నై, ఎన్నూర్, చిట్టగాంగ్, కొలంబో, కోలకతా - హల్దియా, మొంగ్ల, పరదీప్, పోర్ట్ బ్లెయిర్, మాతర్బారి, తూతుకూడి, విశాఖపట్నం, ధర్మా మొదలైన ముఖ్య నౌకాశ్రయాలు. గోపాల్పూర్ పోర్ట్, కాకినాడ, పేరా చిన్న ఓడరేవులు వున్నాయి.