From Wikipedia, the free encyclopedia
ప్రతాపరుద్రుడు కాకతీయ రాజవంశానికు చెందిన చివరి రాజు. ప్రతాపరుద్రుడు రుద్రమదేవి మనవడు (కూతురు కొడుకు). రుద్రమదేవి ఇతనిని వారసునిగా చేసుకోవటానికి దత్తత తీసుకొంది. ప్రతాపరుద్రునికి మొదట వీరరుద్రుడు, కుమారరుద్రుడను పేర్లుండెను. జినకళ్యాణాభ్యుదయమను రచనను ముగించుచూ గ్రంథకర్త అప్పయార్యుడు తన్న గ్రంథమును రుద్రకుమారదేవుని రాజ్యములో శకము 1241లో ముగించితినని చెప్పుకున్నాడు.
| |||||||||||||||||||||||||||||||||||||||
‡ రాణి
|
1289లో కాయస్థ సేనాని అంబదేవుని తిరుగుబాటు అణచు ప్రయత్నములో రుద్రమదేవి మరణించింది. ప్రతాపరుద్రుడు సింహాసనమధిష్ఠించాడు. ప్రతాపరుద్రుని పరిపాలనాకాలం అంతా యుద్ధములతోనే గడచింది[1].
రాజ్యాన్ని విస్తరించి రాజ్యపాలనలో పెక్కు సంస్కరణలు చేశాడు. ఈతని కాలములో వ్రాయబడిన "సరస్వతీ విలాసము" అను గ్రంథములో హిందూ ధర్మములు, ఆచారములు, ఆస్తి హక్కులు మొదలగు చట్టములు క్రోడీకరించబడినవి [2]. పెక్కు గ్రామాలకు నీటి వసతి కొరకు చెఱువులు తవ్వించాడు. వీటిలో బయ్యారము చెరువు ప్రసిద్ధమైనది
సా. శ. 1289లో రుద్రమ దేవి మరణానంతరం రాజ్యాధికారం చేబట్టిన వెంటనే అంబదేవుని తిరుగుబాటు అణచివేయుటకు ప్రతాపరుద్రుడు పూనుకున్నాడు. అందుకోసం నాయంకారవిధానమును కట్టుదిట్టం చేశాడు. నాయకుల సైన్యమునంతనూ తీర్చిదిద్ది మంచి శిక్షణ ఇప్పించి సిద్ధపరిచాడు. తన దాడిని మూడుగా విభజించి మూడు మార్గములలో నడిపించాడు. ఒకటి అంబదేవుని పైకి, రెండవది నెల్లూరు పైకి, మూడవది సేవుణ రాజ్యము పైకి. ఇందులూరి అన్నయ త్రిపురాంతకముపై దాడిచేసి సా. శ. 1291లో అంబదేవుని తరిమివేశాడు. ఆడిదము మల్లు నెల్లూరు పైకి వెడలి అచట మనుమగండభూపాలుని హతమార్చాడు. పశ్చిమరంగములో గోన గన్నయ, విటలుడు యాదవరాజాక్రాంతములైనున్న ఆదవాని, తుంబళం కోటలు పట్టుకొని రాయచూరు దుర్గముపై దాడికి వెడలారు. కన్నడప్రాంతాలైన మాణువ, హాళువలను కూడా సాధించి కృష్ణా తుంగభద్రల నడిమిదేశమంతటినీ జయించారు. దీనితో సేవుణ రాజు దురాక్రమణము కట్టుబడింది. ఆంతరంగిక వ్యవహారాలీవిధముగా చక్కదిద్దుకొనగలిగినను ప్రతాపరుద్రునికి గొప్ప విపత్కరపరిస్థితి ఉత్తరదేశము నుండి ముంచుకొచ్చింది.
ఢిల్లీ సుల్తాను జలాలుద్దీను యొక్క అల్లుడు గరషాస్ప్ మాలిక్ సా.శ. 1296లో యాదవరాజ్యముపై దండెత్తి దేవగిరిని దోచుకుపోయాడు. గరషాస్ప్ తన మామను హత్యచేసి "అల్లావుద్దీన్ ఖిల్జీ" అను పేరుతో సింహాసనమెక్కాడు. సిరిసంపదలతో తులతూగుతున్న ఓరుగంటిపై ఖిల్జీ కన్ను బడింది. తెలుగుదేశముపై ముస్లిముల దాడులకు సా.శ. 1303లో అంకురార్పణ జరిగింది.
అల్లావుద్దీను ఖిల్జీ తన విశ్వాసపాత్రులైన సర్దారులు మాలిక్ ఫక్రుద్దీన్ జునా, జాజు లను గొప్ప సైన్యముతో బంగాళదేశము మీదుగా పంపాడు. కాకతీయ నాయకుడు పోతుగంటి మైలి ఉప్పరపల్లి (ప్రస్తుత కరీంనగర్ మండలం) వద్ద తురుష్క సైన్యాన్ని ఎదుర్కొని తరిమివేశాడు.
సా.శ. 1309లో సుల్తాను మరింత సైన్యముతో మాలిక్ నాయిబ్ కాఫూర్ ను పంపాడు. అతడు దేవగిరిమీదుగా పయనించి దారిలో సిరిపూరు కోటను స్వాధీనము చేసుకుంటాడు. విషయము తెలిసి ప్రతాపరుద్రుడు సైన్యమును సిద్ధముచేసి కోట సంరక్షణకు సన్నిద్ధుడవుతాడు. కాఫూర్ హనుమకొండను ఆక్రమించి ఓరుగల్లు ముట్టడించాడు. బురుజునకొక నాయకుని చొప్పున తగు సైన్యముతో నెలరోజులు వీరోచితముగా కోటను కాపాడారు. తుదకు ముస్లిం సేనలు మట్టిగోడను చుట్టిఉన్న అగడ్తను దాటి లోపలికి ప్రవేశించగలిగాయి. ప్రతాపరుద్రుడు రాతికోటను సురక్షితముగా కాపాడగలిగాడు. విసిగి వేసారిన కాఫూర్ ఓరుగంటి పరిసరప్రాంతం, గ్రామాలు భస్మీపటలం చేసాడు. అమాయక ప్రజలను, ఆడువారిని, పిల్లలను, ముసలివారు అని కూడా చూడకుండ నరసంహారం చేశాడు. సైనికులు స్త్రీలపై అత్యాచారాలు చేశారు. ఇది తెలిసి ప్రతాపరుద్రుడు సంధికి ఒప్పుకొని అపారమైన ధనమును, ఏనుగులను బహూకరించాడు.
సా. శ. 1318లో సుల్తాను పేరిట సర్వాధికారము వహించి పాలన చేస్తున్న మాలిక్ కాఫుర్ను హత్య చేసి అల్లావుద్దీన్ కొడుకు కుతుబుద్దీన్ ముబారక్ సింహాసనమాక్రమించాడు. దక్కన్ వ్యవహారములు చక్కబెట్టడానికి ముబారక్ స్వయంగా దేవగిరి మీదుగా ఓరుగల్లు వస్తాడు. ఆతని దురాగతముల గురించి విన్న ప్రతాపరుద్రుడు ధనకనకవస్తువాహనాలిచ్చి పంపుతాడు.
సా. శ. 1320లో ఢిల్లీ రాజకీయాలలో పెద్ద మార్పు వచ్చింది. ఖిల్జీ వంశం పోయి తుగ్లక్ వంశం అధికారములోకి వచ్చింది. ఘియాజుద్దీన్ తుగ్లక్ సుల్తానయ్యడు. ఇది అదనుగా చూసి ప్రతాపరుద్రుడు వార్షిక కప్పం ఆపివేస్తాడు. లోగడ సుల్తానుకప్పగించిన బీదర్ కోట మరల ఆక్రమిస్తాడు. కోపగించిన ఘియాజుద్దీన్ తన కొడుకు ఉలుఘ్ ఖానును ఓరుగల్లుపై దండయాత్రకు పంపుతాడు. దారిలోగల బీదర్, కోటగిరి లోబరుచుకొని ఓరుగల్లు కోట ముట్టడించాడు. ఎంత ప్రయత్నించినా కోట స్వాధీనము కాలేదు. అయిదు నెలల ముట్టడి తర్వాత విఫలుడైన ఉలుఘ్ ఖాన్ ఢిల్లీ మరలి పోయాడు. చరిత్రకారులు ఈ విషయముపై పలువిధాలుగా వ్రాశారు. కాని ప్రతాపరుద్రుని నాయకుల, సేనల ధైర్యసాహసములకు, పోరాట పటిమకు ఇది ఒక మచ్చుతునక.
ఇక ఉపద్రవములుండవని భావించిన ప్రతాపరుద్రుడు యుద్ధములో జరిగిన నష్ఠాలను పూడ్చుకొనక ఉపేక్షించాడు. కొటకు మరమ్మతులు చేయించలేదు. సామగ్రి సమకూర్చుకొనలేదు. నెలరోజులలో మహాసైన్యముతో తిరిగివచ్చిన ఉలుఘ్ ఖాన్ తో తలబడిన ప్రతాపరుద్రుని సేనలు వీరోచితముగా పోరాడినను పరాజయము తప్పలేదు. కాకతీయ నాయకులలో తలెత్తిన అనైక్యత, ఈర్ష్యాద్వేషాలు కూడా ఓటమికి కారణాలని చరిత్రకారుల అభిప్రాయం.
ప్రతాపరుద్రుడు, కటకపాలుడు గన్నమ నాయుడు మరియూ పెక్కు సేనానులు బందీలయ్యారు. ప్రతాపరుద్రున్ని బంధించిన ఉలుఘ్ఖాన్, వరంగల్ లోనే ఉంచితే ప్రమాదమని విశ్వాసపాత్రులైన ఖాదిర్ ఖాన్, ఖ్వాజాహాజీలకు అతనిని ఢిల్లీకి తరలించే బాధ్యతను అప్పగించాడు. అయితే ప్రతాపరుద్రుడు మార్గమధ్యంలోనే కన్నుమూశాడు. అయితే ఇవన్నీ గ్రంథస్తం చేసిన షాంసి సిరాజ్ అఫీఫ్ ప్రతాపరుద్రుడు ఎలా మరణించాడో వివరించలేదు. సుల్తాను సైన్యం ప్రతాపరుద్రుని ఢిల్లీ తీసుకు వెళుతుండగా మార్గమధ్యాన సోమోద్భవ (నర్మదానది) తీరంలో అతను కన్నుమూశాడని ముసునూరి ప్రోలయ నాయకుని సా.శ. 1330 విలసదానపత్రం పేర్కొంది.[3] ప్రతాపరుద్రుడు సహజ మరణం చెందలేదని స్వచ్ఛందంగానే భగవదైక్యం చెందాడని సా.శ. 1423లో రెడ్డిరాణి వేయించిన అనితల్లి కలువచేరు తామ్రశాసనంలో ఉంది.[4] దీనిని బట్టి ప్రతాపరుద్రుడు ఆత్మహత్య చేసుకోవటమో లేదా అతని కోరిక మేరకు సహచరులెవరైనా చంపటమో జరిగివుంటుందని భావిస్తున్నారు.[5]
ప్రతాప రుద్రుని వీరగాథ తెలుగు సాహిత్యంలో ఎన్నో విధాలుగా కీర్తింపబడింది.
ఢిల్లీ పాలకులు ఓరుగల్లును ఆక్రమించుకున్న తర్వాతి కాలంలో వారితో పోరాడి ఆంధ్రదేశంలోని వివిధ ప్రాంతాలను తిరిగి ఆక్రమైంచిన పలువురు రాజులు, వారి సేనానులు తమ శాసనాలలో ప్రతాప రుద్రుని వీరగాథను ప్రశంసించారు. తీరాంధ్రను పరిపాలించిన మునుసూరి రాజులు, రెడ్డి రాజులు వేయించిన పలు శాసనాలలో కాకతీయ సామ్రాజ్య పతనానికి సంబంధించిన విషాదం, కాపాడుకునేందుకు ప్రతాప రుద్రుడు చేసిన వీరోచిత పోరాటాలు వంటీవి ప్రస్తావనకు వచ్చాయి.
ప్రతాప రుద్రుడినే రాజుగా కీర్తించే వివరాలు తెలిపే శాసనాలు:
నాటకాలు, కావ్యాలు, చారిత్రిక నవలలు వంటి వాటిలో ప్రతాప రుద్రుని గురించి ఎన్నో ప్రస్తావనలు రావడమే కాక కొన్ని రచనల్లో ప్రతాప రుద్రుని పోరాటాలు, వీరత్వం, దురదృష్టకరమైన ఓటమి, మరణం వంటివే ఇతివృత్తాలు. వీటిలో కొన్ని చారిత్రికపరమైన వివరాలను కాకుండా కాల్పనికాంశాలకు పెద్దపీట వేసినవీ ఉన్నాయి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.