పడమటి కనుమలు
From Wikipedia, the free encyclopedia
పడమటి కనుమలు భారతదేశపు పశ్చిమ తీరానికి సమాంతరంగా, కేరళ, తమిళనాడు, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలలో విస్తరించి ఉన్న పర్వత శ్రేణి.[1] వీటినే సహ్యాద్రి పర్వతశ్రేణులు అని కూడా పిలుస్తారు. 1,40,000 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉన్న ఈ పర్వత శ్రేణి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. జీవ వైవిధ్యానికి సంబంధించి, ప్రపంచంలోని ఎనిమిది ప్రధానకేంద్రాల్లో ఇది ఒకటి.[2][3] దీనిని కొన్నిసార్లు గ్రేట్ ఎస్కార్ప్మెంట్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు.[4] దేశంలోని వృక్షజాలం, జంతుజాలాల్లో చాలా భాగం ఇక్కడ ఉంది. వీటిలో చాలా జాతులు భారతదేశంలో మాత్రమే కనిపిస్తాయి.[5] యునెస్కో ప్రకారం, పడమటి కనుమలు హిమాలయాల కంటే పాతవి. వేసవి చివరలో నైరుతి దిశలో వచ్చే వర్షాన్ని మోసుకొచ్చే రుతుపవనాలను అడ్డగించడం ద్వారా ఇవి భారతీయ రుతుపవన వాతావరణ నమూనాలను ప్రభావితం చేస్తాయి.[1] ఈ శ్రేణి దక్కన్ పీఠభూమి పశ్చిమ అంచున ఉత్తరం నుండి దక్షిణానికి వెళుతుంది. అరేబియా సముద్ర తీరం వెంట సమాంతరంగా వ్యాపించి, సన్నటి తీర మైదానాన్ని, దక్కను పీఠభూమినీ వేరు చేస్తాయి. ఈ తీరమైదాన ప్రాంతాన్ని కొంకణ్ అని అంటారు. జాతీయ ఉద్యానవనాలు, వన్యప్రాణుల అభయారణ్యాలు, రిజర్వ్ అడవులతో సహా పడమటి కనుమలలో మొత్తం ముప్పై తొమ్మిది ప్రాంతాలను 2012 లో ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తించారు. ఈ ప్రదేశాలు కేరళలో ఇరవై, కర్ణాటకలో పది, తమిళనాడులో ఐదు, మహారాష్ట్రలో నాలుగు ఉన్నాయి.[1][6]
పడమటి కనుమలు | |
---|---|
అత్యంత ఎత్తైన బిందువు | |
శిఖరం | Anamudi, Eravikulam National Park |
ఎత్తు | 2,695 మీ. (8,842 అ.) |
నిర్దేశాంకాలు | 10°10′N 77°04′E |
కొలతలు | |
పొడవు | 1,600 కి.మీ. (990 మై.) N–S |
వెడల్పు | 100 కి.మీ. (62 మై.) E–W |
విస్తీర్ణం | 160,000 కి.మీ2 (62,000 చ. మై.) |
భౌగోళికం | |
దేశం | భారతదేశం |
States | Gujarat, Maharashtra, Goa, Karnataka, Kerala and Tamil Nadu |
Region | Western and Southern India |
Settlements | జాబితా
|
Biome | Tropical rainforests and Marshes |
Geology | |
Age of rock | Cenozoic |
Type of rock | Basalt, Laterite and Limestone |
UNESCO World Heritage Site | |
Criteria | Natural: ix, x |
సూచనలు | 1342 |
శాసనం | 2012 (36th సెషన్ ) |
ప్రాంతం | 795,315 ha |
వీటి వాలు సముద్రం వైపు చాలా నిటారుగా, పీఠభూమి వైపు ఎక్కువ వాలుతో ఉంటాయి. ఈ కనుమల ద్వారానే దక్కన్ పీఠభూమికి కొంకణ్ మైదానాలకు రోడ్డు, రైలు మార్గాలను వేశారు.
ఈ శ్రేణి తపతీ నదికి దక్షిణంగా గుజరాత్ లోని సోంగాధ్ పట్టణం సమీపంలో ప్రారంభమవుతుంది. మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల గుండా సుమారు 1,600 కి.మీ. పొడవున విస్తరించి ఉన్నాయి. భారతదేశం యొక్క దక్షిణ కొసన, తమిళనాడులో స్వామితోప్ వద్ద మరుంతువజ్మలై వద్ద ముగుస్తాయి. ఈ కొండలు 1,60,000 చ.కి.మీ విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నాయి. భారతదేశంలో దాదాపు 40% పరీవాహకప్రాంతాన్ని కవర్ చేసే నదులు పడమటి కనుమల్లోనే పుడుతున్నాయి. పడమటి కనుమలు నైరుతి రుతుపవనాల గాలులను దక్కన్ పీఠభూమికి రాకుండా నిరోధిస్తాయి. వీటి సగటు ఎత్తు 1,200 మీటర్లు.[1]
ఈ ప్రాంతం ప్రపంచంలోని పది "హాటెస్ట్ బయోడైవర్శిటీ హాట్స్పాట్లలో " ఒకటి. పడమటి కనుమల్లో 7,402 జాతుల పుష్పించే మొక్కలు, 1,814 జాతుల పుష్పించని మొక్కలు, 139 క్షీరద జాతులు, 508 పక్షి జాతులు, 179 ఉభయచర జాతులు, 6,000 కీటకాలు, 290 మంచినీటి చేప జాతులూ ఉన్నాయి. ఇప్పటి వరకూ కనుగొనని అనేక జాతులు పడమటి కనుమలలో ఉండవచ్చని భావిస్తున్నారు. పడమటి కనుమలలో కనీసం 325 అంతరించిపోతున్న జాతులు ఉన్నాయి.[7][8][9]