తవుడు
From Wikipedia, the free encyclopedia
వరిధాన్యం (Paddy) ను రైస్ మిల్లింగ్ చేసినప్పుడు, బియ్యంతో పాటుపొట్టు/ ఊక (Husk) 25%, నూకలు (Broken rice) 3-5%, తౌడు లేదా తవుడు (Bran) ఉప ఉత్పత్తులుగా (By Products) ఏర్పడును. బియ్యపు గింజ (Endosperm) పై సన్నని పొరలా (Thin membrane), బ్రౌన్ రంగులో, ఆవరించి వుండును. బ్రౌన్రంగును తొలగించి, బియ్యాన్ని తెల్లగా చెయ్యుటకై పాలిష్ (polish) చేసినప్పుడు పాలిష్గా తవుడు ఉత్పత్తి అగును.వరిధాన్యంలో తవుడు 6-8% వరకు వుండును.పొట్టు25-30% వరకు వుండును. తవుడు మంచి ఫోషక విలువలున్న పదార్థాలను కలిగి ఉంది. తవుడులో 15-24% వరకు నూనె, 14-16% వరకు మాంసకృత్తులను (Proteins) ఉన్నాయి. ఇంకను55-60%వరకు పాలిసాక్రైడ్స్,6-12%వరకు ఫైబరు ఉన్నాయి. తవుడులో ఇంత పోషక విలువలుండటం వలననే డాక్టరులు దంపుడు బియాన్ని (hand pounded rice) ఆహారంగా తీసుకొమని చెప్తారు. కొన్ని దేశాలలో దంపుడు బియ్యాన్ని ప్యాకెట్లో నింపి అమ్ముచున్నారు. 2008-2009 లో భారతదేశంలో 140 మిలియన్ టన్నుల వరి ఉత్పత్తికాగా, మిల్లింగ్ చెయ్యగా 100 మిలియన్ టన్నుల బియ్యం, 80 లక్షల టన్నుల తవుడు ఊత్పత్తి అయ్యింది. అందులో 35 లక్షల తవుడును నేరుగా పశువుల దాణాగా వాడగా, 45 లక్షల టన్నుల తవుడు నుండి తౌడు నూనెను ఉత్పత్తి చెయ్యడం జరిగింది. బియ్యాన్ని రెండు రకములుగా ఉత్పత్తి చెయ్యుదురు. ఒకట్ పచ్చి బియ్యం (Raw Rice), రెండు ఉప్పుడు బియ్యం (Boiled Rice). ధాన్యాన్ని కళ్ళంలో ఎండబెట్టి, తేమను తొలగించి, నేరుగా రైస్ మిల్లో మిల్లింగ్ చేయగా వచ్చిన బియ్యాన్ని పచ్చిబియ్యమని, తవుడును పచ్చితవుడు (Raw Rice Bran) అంటారు. ధాన్యాన్ని స్టీమ్ ద్వారా ఉడికించి (steam boiled), మిల్లింగ్ చెయ్యగా వచ్చిన బియ్యాన్ని ఉప్పుడు బియ్యం (Boiled Rice), అలా వచ్చిన తవుడును ఉప్పుడు తవుడు (Boiled Bran) అంటారు.