తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం
From Wikipedia, the free encyclopedia
తమిళనాడు (గతంలో మద్రాసు రాష్ట్రంగా కొన్నాళ్ళు, మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా కొన్నాళ్ళు ఉండేది) లో భారత స్వాతంత్ర్యానికి ముందు, తర్వాత హిందీ వ్యాప్తి చేసే ప్రయత్నాలకు వ్యతిరేకంగా జరిగిన వరుస ఆందోళనలను తమిళనాడులో హిందీ వ్యతిరేకోద్యమం అని పిలుస్తారు. ఈ ఆందోళనల్లో భారీ ప్రదర్శనలు, దాడులు ఉన్నాయి, రాష్ట్రంలో హిందీకి అధికార హోదా ఏర్పడడానికి వ్యతిరేకంగా పలు రాజకీయ, విద్యార్థి ఉద్యమాలు జరిగాయి.
మద్రాసు ప్రెసిడెన్సీలో సి.రాజగోపాలాచారి నేతృత్వంలోని భారత జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వం హిందీ బోధన అన్ని పాఠశాలల్లో తప్పనిసరి చేయడంతో మొట్టమొదట హిందీ వ్యతిరేకోద్యమం 1937లో జరిగింది. ప్రభుత్వ ఉత్తర్వులను వెనువెంటనే ఇ.వి. రామస్వామి నాయకర్ (పెరియార్), ప్రతిపక్షమైన జస్టిస్ పార్టీ వ్యతిరేకించారు. మూడు సంవత్సరాల పాటు కొనసాగిన ఆందోళన బహుముఖీనంగా సాగింది, దీనిలో భాగంగా నిరాహారదీక్షలు, సమావేశాలు, పాదయాత్రలు, పికెటింగ్, ఆందోళన వంటి చేశారు. ప్రభుత్వం తీవ్రంగా ప్రతిస్పందించింది, ఇద్దరు ఆందోళనకారులు మృతిచెందగా, పిల్లలు, మహిళలు సహా 1198 మంది అరెస్టయ్యారు. 1939లో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీనామా చేశాకా, 1940 ఫిబ్రవరిలో మద్రాసు ప్రెసిడెన్సీ బ్రిటీష్ గవర్నర్ నిర్బంధ హిందీ విద్యాభ్యాసాన్ని ఉపసంహరించారు. యునైటెడ్ కింగ్డం నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం లభించాకా రాజ్యాంగ రచన సందర్భంగా భారత రిపబ్లిక్కు అధికారిక భాషను స్వీకరించడం తీవ్ర చర్చలకు కేంద్ర బిందువు అయింది.
విస్తృతమైన, వేర్వేరు వాదాలతో కూడిన చర్చ తర్వాత భారత దేశానికి అధికారిక భాషగా హిందీని స్వీకరించి, ఆంగ్లాన్ని అనుబంధ అధికారిక భాషగా తాత్కాలికంగా 15 సంవత్సరాల కాల వ్యవధికి ఏర్పరిచారు, ఆ తర్వాత హిందీ ఏకైక అధికారిక భాషగా కొనసాగుతుందన్నది ఏర్పాటు. 1950 జనవరి 26న కొత్త రాజ్యాంగం అమలులోకి వచ్చింది. 1965 తర్వాత హిందీని ఏకైక అధికారిక భాషగా చేసే ప్రయత్నం చాలా హిందీయేతర భారత రాష్ట్రాలకు ఆమోదం కాలేదు, వారు ఆంగ్లం వాడకాన్ని కొనసాగించాలని వాదించారు. ద్రవిడ కళగం నుంచి విడిపోయి ఏర్పడ్డ రాజకీయ పార్టీ ద్రవిడ మున్నేట్ర కళగం (డిఎంకె) హిందీ వ్యతిరేకతకు యత్నాలకు నేతృత్వం వహించింది. వారి భయాందోళనలు తొలగించేందుకు ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 1963లో అధికారిక భాష చట్టాన్ని 1965 తర్వాత కూడా ఆంగ్లం వినియోగాన్ని కొనసాగించేలా చేశారు. చట్టంలోని పాఠ్యం డీఎంకెను సంతృప్తిపరచలేదు, అలానే ఈ హామీలు భవిష్యత్ ప్రభుత్వాలు గౌరవించకపోవచ్చన్న సంశయవాదం ప్రారంభమైంది. హిందీని ఏకైక అధికారిక భాషగా మార్చే 1965 జనవరి 26 తేదీన హిందీ వ్యతిరేకోద్యమం మద్రాసు రాష్ట్రంలో అత్యంత వేగం సంతరించుకుంది, కళాశాల విద్యార్థులు ఉద్యమాన్ని సమర్థించసాగారు. 25 జనవరి తేదీన మద్రాసు రాష్ట్రపు దక్షిణాది నగరమైన మదురైలో ఆందోళన చేస్తున్న విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీ సభ్యుల మధ్య జరిగిన చిన్న వివాదం రాజుకుని పూర్తిస్థాయి అల్లర్లు చెలరేగాయి, ఇవి తర్వాత రెండు నెలల పాటు కొనసాగాయి. వీటిలో అనేక హింసాత్మక చర్యలు, లూటీలు, గృహదహనాలు, పోలీసు కాల్పులు, లాఠీఛార్జీలు చోటుచేసుకున్నాయి. ఆందోళనను అణచివేయడానికి మద్రాసు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పారామిలటరీ దళాలను రప్పించాయి; వారి రాకతో ఇద్దరు పోలీసులు సహా అధికారిక అంచనాల ప్రకారం 70 మంది మరణించడం జరిగింది. పరిస్థితిని శాంతపరచడానికి భారత ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి హిందీ భాషేతర రాష్ట్రాలు కోరే వరకూ ఇంగ్లీష్ అధికారిక భాషగా కొనసాగుతుందని హామీనిచ్చారు. అల్లర్లు, విద్యార్థుల ఆందోళన శాస్త్రి హామీ తర్వాత సద్దుమణిగాయి. 1965 నాటి ఆందోళనలు రాష్ట్రంలో ప్రధాన రాజకీయ మార్పులకు కారణమయ్యాయి. డీఎంకె 1967లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందింది, ఆపై మరోమారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి మరెప్పుడూ రాలేకపోయింది.