క్రియా యోగం
From Wikipedia, the free encyclopedia
క్రియా యోగం, ఒక ప్రాచీన యోగ శాస్త్రం. ఇది ఇటీవల కాలంలో మహాయోగి మహావతార్ బాబాజీ శిష్యుడు లాహిరి మహాశయుల ద్వారా పునరుద్ధరింపబడి, పరమహంస యోగానంద రాసిన ఒక యోగి ఆత్మకథ ద్వారా లోకంలో వెలుగులోకి వచ్చింది. యోగానంద సూచనల ద్వారా పాశ్చాత్య దేశాల్లో కూడా దీని సాధన 1920 నుండి మొదలైంది.
యోగానందుల వారు ఒక యోగి ఆత్మకథలో, యోగవిద్యకు ప్రప్రథమ శాస్త్రకారుడైన పతంజలి క్రియా యోగాన్ని పేర్కొంటూ "ఉచ్ఛ్వాశ నిశ్శ్వాసల గతిని విచ్ఛేదించడం ద్వారా జరిగే ప్రాణాయామంతో ముక్తిని సాధించవచ్చు" అని వ్రాశాడు. అలాగే ఇది మనిషి రక్తంలో ఉన్న కర్బనాన్ని హరింపజేసి ప్రాణవాయువుతో నింపే ఒక మానసిక - శారీరక ప్రక్రియ అని పేర్కొన్నాడు.[1][2]
క్రియా యోగశాస్త్రంలో ఆధ్యాత్మిక పురోగతిని త్వరితగతిని పొందేందుకు, భగవదనుభవం పొందేందుకు అనేక స్థాయిల్లో ప్రాణాయామం, మంత్రం, ముద్ర, ధ్యానం మొదలైన పద్ధతులు ఉన్నాయి. యోగానందకు ఈ విద్య గురు-శిష్య పరంపరాగతంగా శ్రీ యుక్తేశ్వర్ గిరి, లాహిరీ మహాశయ, మహావతార్ బాబాజీ నుండి సంక్రమించింది.