కార్ల్ మార్క్స్
From Wikipedia, the free encyclopedia
కార్ల్ మార్క్స్ [4] (మే 5, 1818 - మార్చి 14, 1883) జర్మన్ శాస్త్రవేత్త, తత్త్వవేత్త, ఆర్థికవేత్త, సామాజికవేత్త, పాత్రికేయుడు, సోషలిస్టు విప్లవకారుడు. ప్రస్తుత జర్మనీలోని ట్రయర్ పట్టణంలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన మార్క్స్, రాజకీయ ఆర్థికశాస్త్రం, హెగెలియన్ తత్త్వశాస్త్రం చదువుకున్నారు. యుక్తవయస్సులో మార్క్స్ ఏ దేశపు పౌరసత్వం లేని స్థితిలో, లండన్లో జీవితం గడిపాడు. లండన్లోనే మరో జర్మన్ ఆలోచనాపరుడైన ఫ్రెడెరిక్ ఏంగెల్స్ తో కలిసి తన చింతన అభివృద్ధి చేసుకుంటూ, పలు పుస్తకాలు ప్రచురించాడు. 1848 నాటి కరపత్రమైన కమ్యూనిస్ట్ మేనిఫెస్టో వాటన్నిటిలోకీ సుప్రసిద్ధమైంది. తదుపరి కాలపు మేధో, ఆర్థిక, రాజకీయ చరిత్రను అతని రచన ప్రభావితం చేసింది.
జననం | కార్ల్ హెన్రిక్ మార్క్స్ (1818-05-05)1818 మే 5 ట్రయర్, ప్రష్యన్ రాజ్యం, జర్మన్ సమాఖ్య |
---|---|
మరణం | 1883 మార్చి 14(1883-03-14) (వయసు 64) లండన్, ఇంగ్లాండ్, యునైటెడ్ కింగ్డమ్ |
నివాసం | జర్మనీ, ఫ్రాన్స్, బెల్జియం, యునైటెడ్ కింగ్డమ్ |
జాతీయత | జర్మన్ |
యుగం | 19వ శతాబ్ది తత్త్వశాస్త్రం |
ప్రాంతం | పాశ్చాత్య తత్త్వశాస్త్రం, జర్మన్ తత్త్వశాస్త్రం |
మతం | లేదు (నాస్తికుడు; కొన్నేళ్ళు లూథరానిజం) |
తత్వ శాస్త్ర పాఠశాలలు | మార్క్సిజం, కమ్యూనిజం, సామ్యవాదం, భౌతికవాదం |
ప్రధాన అభిరుచులు | రాజకీయం, ఆర్థికశాస్త్రం, తత్త్వశాస్త్రం, సామాజిక శాస్త్రం, కార్మిక సంబంధాలు, చరిత్ర, వర్గ పోరాటాలు, ప్రకృతిశాస్త్రం |
ప్రసిద్ధ ప్రసిద్ధ ఆలోచనలు | Co-founder of Marxism (with Engels), surplus value, contributions to the labour theory of value, class struggle, alienation and exploitation of the worker, The Communist Manifesto, Das Kapital, materialist conception of history |
ప్రభావితమైనవారు
| |
సంతకం |
సమాజం, ఆర్థిక శాస్త్రం, రాజకీయాలు వంటివాటిపై మార్క్స్ సిద్ధాంతాలను కలగలిపి మార్క్సిజంగా పిలుస్తున్నారు. మార్క్సిజం ప్రధానంగా మానవ సమాజాలు వర్గ పోరాటాల ద్వారా అభివృద్ధి చెందాయని, పెట్టుబడిదారి వ్యవస్థలో ఇది సహజంగా పాలక వర్గాలకీ (బూర్జువాలుగా పేరొందాయి, ఉత్పత్తి సాధనాలను అదుపుచేస్తూంటాయి), శ్రామిక వర్గాలకీ (ప్రొలెటరేట్ గా పేరొందిన ఈ వర్గాలు తమ శ్రమశక్తిని వేతనం కోసం అమ్ముకుంటూంటాయి) నడుమ ఘర్షణగా పరిణమిస్తుంది. పరాయీకరణ, విలువ, వస్తు పూజ, మిగులు విలువ వంటి తన సిద్ధాంతాల ద్వారా మార్క్స్ పెట్టుబడిదారి వ్యవస్థ వినియోగదారి మనసత్తత్వం అభివృద్ధి చేయడం, సామాజిక అంతరాలు, శ్రమశక్తిని దోపిడీ చేయడం ద్వారా సామాజిక సంబంధాలు, విలువలను ఏర్పరుస్తోందని వాదించాడు. చారిత్రిక భౌతికవాదం అనే విమర్శనాత్మక దృక్పథాన్ని ఉపయోగించి, మార్క్స్ పునాది, పైనిర్మాణ సిద్ధాంతం (బేస్ అండ్ సూపర్ స్ట్రక్చర్ థియరీ) ని ప్రతిపాదించాడు. సమాజంలోని సాంస్కృతిక, రాజకీయ స్థితిగతులను, అలానే వాటి మానవ స్వభావపు భావనలను ప్రధానంగా నిగూఢమైన ఆర్థిక పునాదులే నిర్ధారిస్తాయని ఈ సిద్ధాంతం చెప్తోంది. ఈ ఆర్థిక విమర్శలు 1867 నుంచి 1894 వరకూ మూడు భాగాలుగా ప్రచురితమైన ప్రభావశీలమైన దాస్ కేపిటల్లో పొందుపరిచారు.
మార్క్స్ ప్రకారం, రాజ్యాలు ప్రజలందరి సాధారణ ఆసక్తులకు అనుగుణంగా నడుస్తున్నట్టుగా చూపించుకున్నా, నిజానికి పాలకవర్గం ఆసక్తులకు అనుగుణంగా నడుస్తాయి.[5] గత సామాజిక ఆర్థిక వ్యవస్థల్లాగానే పెట్టుబడిదారీ వ్యవస్థలోని అంతర్గత సమస్యలు స్వయం వినాశనానికి దారితీసి, దాని స్థానంలో కొత్త వ్యవస్థ ఐన సామ్యవాదం ఏర్పడుతుందని ఊహించారు. మార్క్స్ అభిప్రాయంలో పెట్టుబడిదారీ వ్యవస్థలోని వర్గ వైరుధ్యాలు దాని అస్థిరతకు, సంక్షోభానికి గురయ్యే లక్షణానికి కొంత కారణమై క్రమంగా కార్మిక వర్గం వర్గ చైతన్యాన్ని సాధించడానికి దారితీస్తుంది, ఇది వారు రాజకీయ ఆధిపత్యాన్ని సాధించేందుకు, చివరకు ఉత్పత్తిదారుల స్వేచ్ఛా సంఘటితంగా ఏర్పడే ప్రభుత్వం ద్వారా వర్గ రహిత, కమ్యూనిస్టు సమాజం స్థాపనకు దారితీస్తుంది.[6][7] మార్క్స్ కార్మిక వర్గం పెట్టుబడిదారీ వ్యవస్థను కూలదోసి, సామాజిక ఆర్థిక విముక్తి తీసుకువచ్చేందుకు సంఘటిత విప్లవ చర్య చేపట్టాలని వాదిస్తూ క్రియాశీలకంగా దాని ఆచరణ కోసం పోరాడారు.[8]
కార్ల్ మార్క్స్ మానవ చరిత్రలోకెల్లా అత్యంత ప్రభావశీలమైన వ్యక్తుల్లో ఒకరిగా పేరొందారు, ఆయన కృషి, సిద్ధాంతం అటు ప్రశంసలు, ఇటు విమర్శలు కూడా విస్తృతంగా పొందింది.[9] ఆర్థిక శాస్త్రంలో ఆయన కృషి శ్రమ గురించి, దానికీ పెట్టుబడికీ ఉన్న సంబంధం గురించి ప్రస్తుత అవగాహనకీ, తత్ సంబంధితమైన ఆర్థిక ఆలోచనకీ చాలావరకూ పునాదిగా నిలుస్తోంది.[10][11][12] ప్రపంచవ్యాప్తంగా ఎందరో మేధావులు, కార్మిక సంఘాలు, కళాకారులు, రాజకీయ పార్టీలు మార్క్స్ ఆలోచనాధార, తాత్త్వికత, కృషిలకు ప్రభావితం అయ్యాయి, చాలామంది ఆయన ఆలోచనను స్వీకరించడమో, మార్పుచేసుకోవడమో చేశారు. మార్క్స్ ని సామాన్యంగా ఆధునిక సామాజికశాస్త్ర నిర్మాతల్లో ఒకరిగా పేర్కొంటారు.[13]
మార్క్స్ మరణించేంతవరకూ ఆయన భావాలు ప్రధానంగా వ్యాప్తి చెందకపోయినా, ఆయన మరణానంతరం వాటి ప్రభావం విస్తరించింది. రష్యన్ విప్లవం మొదలుకొని ప్రపంచ వ్యాప్తంగా జరిగిన అనేక విప్లవాలు మార్క్సిజం సిద్ధాంతం పునాదిగా చేసినట్టు ప్రకటించుకున్నాయి. 20వ శతాబ్దిలో అనేక దేశాలు మార్క్సిస్టు దేశాలుగా తమను ప్రకటించుకున్నాయి. వ్లాదిమిర్ లెనిన్, మావో జెడాంగ్, ఫిడెల్ కాస్ట్రో, సాల్వడార్ అలెండె, జోసిప్ బ్రొజ్ టిటో, క్వామే క్రుమా సహా ఎందరో 20వ శతాబ్దికి చెందిన ప్రముఖ ప్రపంచ నాయకులు మార్క్స్ తమపై గాఢ ప్రభావం చూపాడని పేర్కొన్నారు.