కలంకారీ
వస్త్రాలపై చిత్రించే కళ / From Wikipedia, the free encyclopedia
కలంకారీ అనగా వెదురుతో చేసిన కలంతో సహజమైన రంగులను ఉపయోగించి వస్త్రాలపై బొమ్మలు చిత్రించే ఒక కళ. ఇది చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో పుట్టింది. పురాతన హరప్పా నాగరికతకు సంబంధించిన త్రవ్వకాలలో లభించిన ఒక వెండి పాత్ర మీద చిత్రాలు ఉన్న ఒక వస్త్రం ఆధారంగా కలంకారీ కళ చాలా ప్రాచీనమైనదని తెలుస్తోంది. బౌద్ధ ఆరామాలు కూడా ఈ కలంకారీ వస్త్రాలతో అలంకరించే వారు. అలెగ్జాండర్ కూడా కలంకారీ వస్త్రాలను తనతోపాటు తీసుకువెళ్ళాడంటారు.[1] కారీ అనగా హిందీ లేదా ఉర్దూలో పని అని అర్థం. 10వ శతాబ్దంలో పర్షియన్, భారతీయ వర్తకుల సంబంధాల నేపథ్యం నుంచి ఈ పదం ఉద్భవించి ఉండవచ్చు.[2] ఐరోపా వర్తకులు కూడా ఇలాంటి వస్త్రాలపై చిత్రించే కళను వేరే పేర్లతో పిలుస్తుంటారు. ఉదాహరణకు పోర్చుగీసు వారు దీనిని పింటాడో అని అంటారు. డచ్చి వారు సిట్జ్ అనీ బ్రిటీష్ వారు షింజ్ అనీ పిలుస్తారు. కృష్ణా జిల్లా పెడనలో దీన్ని బ్లాక్ ప్రింటింగ్ పిలుస్తారు. ప్రస్తుతం మనం చూసే బ్లాక్ ప్రింటింగ్సు పెడన నుండి వస్తుంటే దేవతా చిత్రాలు (హస్త కళలు) అన్నీ కాళహస్తి నుండి వస్తున్నాయి. అయితే తూర్పుగోదావరి జిల్లాలో ఆర్యవటంలో కూడా కొంతమంది పెడన తరహాలోన బ్లాక్ ప్రింటింగ్ చేస్తున్నారు.