అక్షాంశం
ఉత్తర, దక్షిణ ధృవాలకు సమానదూరంలో భూగోళంపై గీసిన భూమధ్యరేఖను 00 అక్షాంశం అని అంటారు. / From Wikipedia, the free encyclopedia
భూగోళంపై తూర్పు, పడమరలను కలుపుతూ గీసిన ఊహారేఖలను అక్షాంశాలు అంటారు. వీటిలో ఉత్తర, దక్షిణ ధృవాలకు సమానదూరంలో భూగోళంపై గీసిన వృత్తానికి భూమధ్యరేఖ అని పేరు. భూమధ్యరేఖను 00 అక్షాంశం అని అంటారు. భూమధ్యరేఖ భూగోళాన్ని రెండు అర్ధభాగాలుగా విభజిస్తుంది. భూమధ్యరేఖ ఉత్తరంగా ఉన్న భాగాన్ని ఉత్తరార్థగోళం అని, దక్షిణ భాగాన్ని దక్షిణార్థ గోళం అని అంటారు. భూమధ్యరేఖ సమాంతరంగా ఒక డిగ్రీ తేడాతో ఉత్తర, దక్షిణ ధృవాల వరకు గీసిన వృత్తాలు అక్షాంశాలు.[1]
అక్షాంశ రేఖలన్నింటిలోకి భూమధ్య రేఖ వృత్తం అతిపెద్దది. ఈ ప్రాంతంలో భూమి చుట్టుకొలత 40,075 కి.మీ. ఉంటుంది. మిగతావన్నీ పోనుపోను తగ్గి ధృవాల వద్ద బిందువుగా ఏర్పడతాయి. ఒక అక్షాంశం విలువ భూమధ్యరేఖ నుంచి ఉత్తరంగాగాని, దక్షిణంగాగాని ఆ అక్షాంశంపైగల బిందువుల నుంచి భూకేంద్రాన్ని కలుపుతూ గీసిన రేఖకు, భూమధ్యరేఖా తలానికి మధ్య ఉన్న కోణానికి సమానం. ఉత్తరార్ధగోళంలో 90 అక్షాంశాలున్నాయి. వీటిని ఉత్తర అక్షాంశాలని అంటారు. దక్షిణార్ధగోళంలో 90 అక్షాంశాలున్నాయి. వీటిని దక్షిణ అక్షాంశాలని అంటారు.[2]