From Wikipedia, the free encyclopedia
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ (ఆంగ్లం: skill development scam) అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC)లో అవినీతి జరిగిందనే అనేదానిపై ఆరోపణ, రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ పధకంలో రూ.241 కోట్లు అవినీతి జరిగిందనే అభియోగాలు ఉన్నాయి. రూ. 241 కోట్లు, కొత్తగా స్థాపించబడిన పి.వి.ఎస్.పి/స్కిల్లర్ ఎంటర్ ప్రైజెస్ అనే కంపెనీకి దారి మళ్ళించినట్లు సి.ఐ.డి దర్యాప్తులో సూచిందింది.[1] 2016లో, టీడీపీ ప్రభుత్వ హయాంలో, నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ అందించి వారి ఉపాధిని పెంపొందించే లక్ష్యంతో APSSDC స్థాపించబడింది.[2]
2014 జూన్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 2 నెలలకు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కీమును తెచ్చాడు. యువతకు స్కిల్స్ (నైపుణ్యాలు) అభివృద్ధి చేసి, ఉపాధి కలిపించడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ స్కీమ్ ఖర్చు రూ.3,356 కోట్లు కాగా, ఇందులో ప్రభుత్వ వాటా 10 శాతం, 90 శాతం సీమెన్స్ సంస్థ పెట్టుకోవాలని ఒప్పందం (MoU) కుదుర్చుకున్నారు.
అయితే సీమెన్స్ సంస్థ నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్గా రావాల్సిన డబ్బు రాకపోయినా, ప్రాజెక్ట్ వ్యయంలో 10% వాటాగా రూ. 371 కోట్ల డబ్బును ప్రభుత్వం విడుదల చేసి డొల్ల కంపెనీలకు మళ్లించదని ఆరోపణలు వచ్చాయి[3]. ఇది నారా చంద్రబాబునాయుడు ఆదేశాలతోనే ఇలా జరిగిందనే వాదన ఉంది. అంతేకాకుండా యువతకు ఎక్కడా ఎలాంటి నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వలేదు.[4]
2017లో జిఎస్టి ఇంటెలిజెన్స్ పూణేలోని పన్నుల దర్యాప్తు విభాగం కోట్లాది రూపాయలతో కూడిన ఈ ఆర్థిక మోసాన్ని వెలికితీసింది. విచారణ కోసమని 2018లో అవినీతి నిరోధక శాఖకి ఫిర్యాదు చేశారు. ఈ విచారణలో, ఈ ప్రాజెక్ట్ కోసమని ఎటువంటి టెండర్లు పిలవలేదని, పైగా సిమెన్స్ ఇండస్ట్రీ తమ స్వంత వనరుల నుండి ఒక్క రూపాయి ఖర్చు చేయలేదని, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన మొత్తం విదేశాలకు వెళ్ళి తిరిగి షెల్ కంపనీలకు చేరాయని అధికారులు గుర్తించారు. దీంతో నారా చంద్రబాబునాయుడును నేర పరిశోధన విభాగం (సీఐడీ) పోలీసులు 2023 సెప్టెంబరు 9న అవినీతి నిరోధక చట్టం 1988 కింద నంద్యాల క్యాంపులో అరెస్ట్ చేశారు[5]. అతని హయాంలో స్కిల్ డెవలప్మెంట్ స్కీం పేరిట స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగిందని ప్రధాన ఆరోపణ.[6] కాగా అతనిపై 120 (బి), 166, 167, 418, 420, 465, 468, 201, 109 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.[7]
స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో రూ. 371 కోట్ల ప్రభుత్వ నిధులతో జరిగిన కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ముసుగులో కాంట్రాక్టులను తారుమారు చేయడం, ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడం, మోసపూరిత పథకం పన్నడం వంటివి ఈ కేసులో ప్రమేయం ఉన్న చంద్రబాబునాయుడు తో పాటు ఇతరులపై వచ్చిన ఆరోపణల్లో ఉన్నాయి.[4]
ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఈ స్కాంపై దృష్టి సారించింది. జిఎస్టి, ఇంటెలిజెన్స్, ఐటి, ఇడి, సెబి వంటి ప్రభుత్వ ఏజెన్సీలు ఈ స్కామ్పై సమగ్ర దర్యాప్తు చేశాయి. విదేశాల్లో దోచుకున్న నిధులను అధికారులు విజయవంతంగా స్వదేశానికి రప్పించారు.[4]
ఈ కుంభకోణంలో ప్రధాన పాత్రధారి అయిన సిమెన్స్, అంతర్గత విచారణ నిర్వహించి, మేజిస్ట్రేట్ ముందు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్ 164 కింద ఒక వాంగ్మూలాన్ని అందించింది. ప్రభుత్వం జారీ చేసిన జాయింట్ వెంచర్ (JVO) లేదా మెమోరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్ (MOU)లో తమ కంపెనీకి ఎలాంటి ప్రమేయం లేదని సిమెన్స్ కంపెనీ తెలిపింది.[4]
గత తెలుగుదేశం పార్టీ హయాంలో ఏపీఎస్ఎస్డీసీలో రూ.3,300 కోట్ల కుంభకోణం జరిగినట్లు మార్చిలో ఆంధ్రప్రదేశ్ పోలీసుల క్రైమ్ ఇన్వెస్టిగేషన్ విభాగం దర్యాప్తు ప్రారంభించింది. 2016లో ఏపీఎస్ఎస్డీసీ సీఈవోగా పనిచేసిన మాజీ ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ (ఐఆర్టీఎస్) అధికారి అర్జా శ్రీకాంత్కు నోటీసులు జారీ చేసిన తర్వాత, ముగ్గురు ఐఏఎస్ అధికారులు అప్రూవర్గా మారిన నిందితుల వాంగ్మూలాలు, డిపాజిషన్ల ఆధారంగా దర్యాప్తు జరిగింది.[2]
దర్యాప్తు సమయంలో, స్కిల్ డెవలప్మెంట్ నుండి ఒక నోట్ను డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డిపిఆర్)గా చూపుతూ క్యాబినెట్కు సమర్పించిన విధానం, ఏర్పాటు చేసిన ప్రభుత్వ విధానాలను దాటవేయడం అనేది ఈ కేసులోని ప్రధాన సమస్యల్లో ఒకటిగా కనుగొన్నారు.[4] సత్వర ఆమోదం, నిధుల విడుదలతో కలిపి ఈ అక్రమాలపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది. స్పష్టమైన ఒప్పందం లేకుండా నిధులు విడుదల చేయడంతో కాంట్రాక్టు, ప్రభుత్వ ఉత్తర్వులు పరస్పర విరుద్ధంగా ఉన్నట్లు విచారణలో తేలింది.[4]
దీనిపై ఆర్థిక శాఖ అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేసినా చంద్రబాబు నాయుడు తక్షణమే నిధులు విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ సహా ప్రభుత్వంలోని కీలక అధికారులు నిధులు విడుదల చేయడంలో పాత్ర పోషించినట్లు సమాచారం. అయితే ఈ నిధులు ఎక్కడున్నాయో తెలియరాలేదు.[4]
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ డబ్బుకు సంబంధించిన 70కి పైగా లావాదేవీలు షెల్ కంపెనీల ద్వారా జరిగాయని, సమస్యాత్మకమైన ఈ స్కాంలో పరిశోధనలు ప్రారంభమైనప్పుడు ప్రాజెక్ట్కు సంబంధించిన నోట్ ఫైల్లు ధ్వంసమయ్యాయని ఆరోపణలు వచ్చాయి. విషయాలను మరింత క్లిష్టతరం చేస్తూ, స్కిల్ స్కామ్లో ముఖ్యమైన పాత్ర పోషించిన పి.వి.ఎస్.పి/స్కిల్లర్ తో పాటు డిజైన్ టెక్ వంటి కంపెనీలు సేవా పన్ను చెల్లించకుండా సెన్ వాట్ (సెంట్రల్ వాల్యూ యాడెడ్ టాక్స్)ని క్లెయిమ్ చేశాయి. 2017లోనే హవాలా మార్గాల ద్వారా నగదు బదిలీ జరిగినట్లు కంపెనీ లావాదేవీల్లో అవకతవకలు జరిగినట్లు జీఎస్టీ అధికారులు గుర్తించడంతో అనుమానం వచ్చింది.[4]
దర్యాప్తులో భాగంగా ఈడీ దాడులు చేసి సీమెన్స్ ఇండియా సాఫ్ట్వేర్ ఇండియా ప్రైవేట్ మాజీ ఎండీ సౌమ్యాద్రి శేఖర్ బోస్, డిజైన్టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వికాస్ వినాయక్ ఖాన్విల్కర్, మాజీ ఆర్థిక సలహాదారు ముకుల్ చంద్ర అగర్వాల్లను అరెస్టు చేసింది. అరెస్టయిన వారిలో స్కిల్లర్ ఎంటర్ప్రైజెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు అధీకృత సంతకం చేసిన సురేష్ గోయల్ కూడా ఉన్నాడు. నిధుల దుర్వినియోగం, మనీలాండరింగ్ కేసు నమోదు చేయబడింది, దర్యాప్తు పురోగతిలో ఉంది. 2023 సెప్టెంబరు 9న అదే కేసులో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును అరెస్టు చేశారు.[4]
చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో మానవ వనరుల శాఖ మంత్రిగా పనిచేసిన గంటా శ్రీనివాసరావును కూడా అరెస్టు చేశారు. విశాఖపట్నంలోని తన నివాసంలో శ్రీనివాసరావుతోపాటు ఆయన కుమారుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు.[8]
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో 2023 సెప్టెంబరు 10న విజయవాడ ఏసీబీ కోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఇరుపక్షాల వాదనలను పరిశిలించిన ఏసీబీ కోర్టు నారా చంద్రబాబునాయుడుకు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ప్రత్యేక భద్రత నడుమ రాజమండ్రి కేంద్ర కారాగారంనకు ఆయనను తరలించారు. జైలు అధికారులు ఆయనకు ఖైదీ నెంబర్ 7691 కేటాయిచారు.[9]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.