2007 ఉత్తర ఇరాక్ ఆక్రమణ
From Wikipedia, the free encyclopedia
2014 జూన్లో, ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా(ఐ.ఎస్.ఐ.ఎస్.) లేదా ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ ది లెవంట్(ఐ.ఎస్.ఐ.ఎల్) అనే సంస్థ మరికొన్ని బలగాలతో కలిసి ఇరాకీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉత్తర ఇరాక్ ప్రాంతంలో పోరాటం ప్రారంభించాయి. ఈ పోరాటానికి నేపథ్యంగా డిసెంబర్ 2013లో ఇరాక్ దేశంలో జరిగిన కల్లోలాలు, వివాదాలు ఉన్నాయి. సమర్రా ప్రాంతంలో జూన్ 5న జరిగిన దాడితో ప్రారంభించి, జూన్ 9న మోసుల్ దిగ్బంధం, జూన్ 11న తిక్రిత్ దిగ్బంధంతో కొనసాగిస్తూ ఐ.ఎస్.ఐ.ఎస్., అనుబంధ బలగాలు కలిసి పలు నగరాలను ఇతర ప్రాంతాలను స్వాధీనపరుచుకున్నాయి. ఇరాకీ ప్రభుత్వ సైన్యాలు జూన్ 13న దక్షిణ దిశగా కదలడంతో కుర్దిష్ బలగాలు వివాదాస్పదమైన ఉత్తర ఇరాక్ ప్రాంతంలోని కిర్కుక్లోని చమురు క్షేత్రాలపై ఆధిక్యత సంపాదించాయి. జూన్ నెలాఖరుకు ఇరాక్ ప్రభుత్వం జోర్డాన్, సిరియాలతో పాటుగా పశ్చిమ సరిహద్దుపై తన నియంత్రణను పూర్తిగా కోల్పోయింది.
మోసుల్ దాడి, ఆపైన రాత్రికి రాత్రి దిగ్బంధం వంటి పరిణామాలతో జూన్ 10న ఇరాక్ ప్రధాని నౌరి అల్-మలికి ఆ దేశంలో జాతీయ అత్యయిక స్థితికి పిలుపునిచ్చారు. ఐతే రక్షణ స్థితిగతులను పక్కనపెట్టి ఇరాక్ పార్లమెంట్ మలికిని అత్యయిక స్థితి అమలుచేసేందుకు అంగీకరించలేదు. పలువురు సున్ని, కుర్దిష్ తెగలకు చెందిన చట్టసభ్యులు ప్రధాని అత్యయిక స్థితి ద్వారా తన అధికార పరిధిని విస్తరించడాన్ని వ్యతిరేకిస్తూ పార్లమెంటు సెషన్లను బహిష్కరించారు.