18 వ శతాబ్దం
శతాబ్దం / From Wikipedia, the free encyclopedia
18వ శతాబ్దం 1701 జనవరి 1 నుండి 1800 డిసెంబర్ 31 వరకు ఉన్న 100 సంవత్సరాలు. 18వ శతాబ్దంలో, జ్ఞానోదయం ఆలోచనలు అమెరికన్, ఫ్రెంచ్, హైతియన్ విప్లవాలలో పరాకాష్టకు చేరుకున్నాయి. ఈ శతాబ్దంలో, బానిస వ్యాపారం, మానవ అక్రమ రవాణా అట్లాంటిక్ తీరంలో విస్తరించగా రష్యా, [1] చైనా, [2] కొరియాలో క్షీణించింది. బానిసత్వానికి మద్దతు ఇచ్చే నిర్మాణాలు, నమ్మకాలతో సహా రాచరిక, కులీన అధికార వ్యవస్థల చట్టబద్ధతను విప్లవాలు సవాలు చేయడం ప్రారంభించాయి. ఈ శతాబ్దపు మధ్యకాలంలో పారిశ్రామిక విప్లవం ప్రారంభమైంది. ఇది మానవ సమాజంలోను, పర్యావరణంలోనూ సమూల మార్పులకు దారితీసింది.
పాశ్చాత్య చరిత్రకారులు అప్పుడప్పుడు 18వ శతాబ్దాన్ని తమ పని ప్రయోజనాలకు అనుగుణంగా నిర్వచించారు. ఉదాహరణకు, ఇది ఫ్రాన్స్కు చెందిన లూయిస్ XIV మరణానికి ఫ్రెంచ్ విప్లవం ప్రారంభానికీ మధ్య (1715-1789 మధ్య) నున్న కాలాన్ని "పొట్టి" 18వ శతాబ్దంగా నిర్వచించారు. నేరుగా పరస్పరం అనుసంధానించబడిన సంఘటనలకు ఈ నిర్వచనం ప్రాధాన్యతనిస్తుంది. [3] [4] పెద్ద చారిత్రక ఉద్యమాలను చేర్చడానికి శతాబ్దాన్ని విస్తరించే చరిత్రకారులు, 1688 గ్లోరియస్ రివల్యూషన్ నుండి 1815 లో వాటర్లూ యుద్ధం వరకు ఉన్న కాలాన్ని [5] "సుదీర్ఘమైన" 18వ శతాబ్దం [6] అంటారు. ఈ కాలం ఆ తరువాత కూడా కొనసాగవచ్చు. [7]
ఈ కాలాన్ని "వెలుగు శతాబ్దం" లేదా "హేతువు యొక్క శతాబ్దం" అని కూడా పిలుస్తారు. ఖండాంతర ఐరోపాలో, తత్వవేత్తలు ప్రకాశవంతమైన యుగం గురించి కలలు కన్నారు. కొందరికి, ఈ కల 1789 నాటి ఫ్రెంచ్ విప్లవంతో సాకారమైంది. మొదట, ఐరోపాలోని అనేక రాచరికాలు జ్ఞానోదయ ఆదర్శాలను స్వీకరించాయి గానీ ఫ్రెంచ్ విప్లవం నేపథ్యంలో తమ అధికారాన్ని కోల్పోతామని భయపడ్డారు. ఫ్రెంచ్ విప్లవాత్మక యుద్ధాలలో ఫ్రెంచ్ రిపబ్లిక్ను వ్యతిరేకించడానికి విస్తృత సంకీర్ణాలను ఏర్పాటు చేశారు.
18వ శతాబ్దంలో పోలిష్-లిథువేనియన్ కామన్వెల్త్ స్వతంత్ర రాజ్యంగా కూడా ముగిసింది. దాని అర్ధ-ప్రజాస్వామ్య ప్రభుత్వ వ్యవస్థ పొరుగు రాష్ట్రాలైన ప్రష్యా, రష్యా, ఆస్ట్రియాలతో పోటీపడేంత పటిష్టంగా లేదు. ఇవి పోలిష్-లిథువేనియన్ కామన్వెల్త్ను పంచుకున్నాయి. దీంతో ఆ తరువాతి 100 సంవత్సరాల పాటు మధ్య ఐరోపా, రాజకీయాల మార్చేసింది.
ఒట్టోమన్ సామ్రాజ్యంలో మున్నెన్నడూ లేనట్లుగా శాంతి, ఆర్థిక విస్తరణ జరిగాయి. 1740 నుండి 1768 వరకు వారు ఎటువంటి యూరోపియన్ యుద్ధాలలో పాల్గొనలేదు. పర్యవసానంగా, ఏడేళ్ల యుద్ధంలో యూరపియన్లు సాధించిన సైనిక అభివృద్ధి ఈ సామ్రాజ్యంలో జరగలేదు. ఒట్టోమన్ సామ్రాజ్యం సైన్యం వెనుకబడి పోయి, శతాబ్దం రెండవ అర్ధ భాగంలో రష్యా చేతిలో అనేక పరాజయాలను చవిచూసింది. నైరుతి, మధ్య ఆసియాలో, నాదర్ షా విజయవంతమైన సైనిక దండయాత్రలకు నాయకత్వం వహించాడు. ఇది పరోక్షంగా దుర్రానీ సామ్రాజ్య స్థాపనకు దారితీసింది.
అమెరికా ఖండాల్లోను ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలోనూ యూరోపియన్ల వలసరాజ్యాలు పెరిగాయి. నౌకా యాత్రల యుగంలో భాగంగా ప్రజల భారీ వలసలు పెరిగాయి. ప్రస్తుత ఇండోనేషియాలో యూరోపియన్ వలసరాజ్యం తీవ్రమైంది. ఇక్కడ డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ మాతారం సుల్తానేట్పై నియంత్రణను పెంచింది. మెయిన్ల్యాండ్ ఆగ్నేయాసియా, కాన్బాంగ్-అయుత్తాయ యుద్ధాలు, టేయ్ సన్ తిరుగుబాటులో చిక్కుకుంది. అయితే తూర్పు ఆసియాలో, ఈ శతాబ్దం హై క్వింగ్ యుగం, తోకుగావా షోగునేట్ ల ఏకాంత విధానాలను చూసింది.
స్పానిష్ వారసత్వ యుద్ధం, ఫ్రెంచ్, ఇండియమ్ యుద్ధాలతో సహా శతాబ్దమంతా వివిధ సంఘర్షణలు జరిగాయి. గ్రేట్ బ్రిటన్ దాని యూరోపియన్ ప్రత్యర్థులపై విజయం సాధించి ఐరోపాలో ప్రముఖ వలసరాజ్యంగా మారింది. అయితే, అమెరికన్ రివల్యూషనరీ వార్ తర్వాత బ్రిటన్ ఉత్తర అమెరికాలో తన కాలనీలను కోల్పోయింది. ఇది యునైటెడ్ స్టేట్స్గా ఏర్పడింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లలో యూరోపియన్ వలసరాజ్యం శతాబ్దం రెండో అర్ధ భాగంలో ప్రారంభమైంది.
భారత ఉపఖండంలో, మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు మరణంతో, మధ్యయుగ భారతదేశం ముగింపుకు వచ్చినట్లైంది. ఈ ప్రాంతంలో యూరోపియన్ ప్రభావం, నియంత్రణ పెరగడానికి నాంది పలికింది. ఇదే కాలంలో మరాఠా విస్తరణ వేగవంతమైంది. శతాబ్దం మధ్య నాటికి, బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలోని తూర్పు భాగాలను జయించడం ప్రారంభించింది.ప్లాసీ యుద్ధంలో బెంగాల్ నవాబు, అతని ఫ్రెంచ్ మిత్రులపై బ్రిటిషు వారు విజయం సాధించాక ఈ ప్రక్రియ వేగవంతమైంది. శతాబ్దం చివరి నాటికి, భారతదేశంలో కంపెనీ పాలన దక్షిణాసియాలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించింది. బ్రిటిషు వారు దక్షిణాదికి కూడా విస్తరించి టిప్పు సుల్తాన్, అతని తండ్రి హైదర్ అలీలు పాలించిన మైసూర్ రాజ్యానికి వ్యతిరేకంగా జరిగిన ఆంగ్లో-మైసూర్ యుద్ధాలలో పాల్గొన్నారు. . [8]