రౌండు టేబులు సమావేశాలు
From Wikipedia, the free encyclopedia
భారతదేశ స్వపరిపాలనా విషయాలను చర్చింటానికి బ్రిటీషు ప్రభుత్వం 1930 నుండి 1932 వరకు లండన్లో నిర్వహించిన మూడు అఖిల పక్ష సమావేశాలను రౌండు టేబులు సమావేశాలు అంటారు. భారత స్వపరిపాలనపై సైమన్ కమిషను ఇచ్చిన నివేదిక పర్యవసానంగా 1930-32లలో బ్రిటిషు ప్రభుత్వం రౌండు టేబులు సమావేశాలను ఏర్పాటు చేసింది.[1] స్వపరిపాలన కోరిక దేశంలో క్రమేణా బలపడుతూ వస్తోంది. భారత్ డొమినియను ప్రతిపత్తి దిశగా సాగాలసిన అవసరం ఉందని 1930ల నాటికి, బ్రిటిషు రాజకీయనాయకులనేకులు భావించారు. అయితే, సమావేశాలు పరిష్కరించజాలని అభిప్రాయ భేదాలు భారత, బ్రిటిషు రాజకీయనాయకుల మధ్య ఉన్నాయి.
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/te/thumb/2/2a/First_round_table_conference_delegates1.jpg/220px-First_round_table_conference_delegates1.jpg)
1927లో బ్రిటీషు ప్రభుత్వం 1919 చట్టం ద్వారా ప్రవేశపెట్టిన పాలనా సంస్కరణల అమలును పరిశీలించటానికి, పరిస్థితిని గమనించి మార్పులు సూచించటానికి సర్ జాన్ సైమన్ అధ్యక్షతన ఒక కమిషన్ను నియమించింది.సైమన్ కమిషను సూచించిన సంస్కరణలను ప్రవేశపెట్టే విషయం పరిశీలించటానికి బ్రిటీషు ప్రభుత్వం 1930 నవంబరులో లండనులో అఖిలపక్ష సమావేశం (రౌండ్ టేబుల్ సమావేశం) ఏర్పాటు చేసింది. ఈ అఖిలపక్ష సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలు, సంస్థలు, అన్ని స్వదేశ సంస్థానాల పాలకులు సమావేశమై సమస్యలు చర్చిస్తారు. అయితే కాంగ్రేసు పార్టీ సంపూర్ణ స్వరాజ్యం కోసం పోరాడుతున్నందున సమావేశాన్ని బహిష్కరించి హాజరు కాలేదు. మొదటి అఖిలపక్ష సమావేశంలో హిందూ మహాసభ, ముస్లిం లీగు, సంస్థానాధీశులు హాజరైనారు. దేశములో బలమైన పార్టీ కాంగ్రేసు హాజరు కాకపోవడముతో బ్రిటీషు వారు ఏవిధమైన రాజ్యాంగ మార్పులు చేయలేకపోయారు. మొదటి అఖిలపక్ష సమావేశం విఫలమయ్యింది.