భారత విభజన
From Wikipedia, the free encyclopedia
1947 లో యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంటు చేసిన చట్టం ద్వారా బ్రిటిషు భారతదేశాన్ని [lower-alpha 2] భారతదేశం, పాకిస్థాన్ అనే రెండు రెండు స్వతంత్ర అధినివేశ రాజ్యాలుగా విభజించడాన్ని భారత విభజన అంటారు.[3] ఆనాటి భారతదేశం నేడు భారత రిపబ్లిక్ గాను, ఆనాటి పాకిస్తాన్ నేడు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్లు గానూ ఉనికిలో ఉన్నాయి. ఈ విభజనలో బెంగాల్, పంజాబ్ అనే రెండు రాష్ట్రాలను ఆ రాష్ట్రాల్లో జిల్లా వారీగా ఉన్న ముస్లిం, ముస్లిమేతర ప్రజల మెజారిటీల ఆధారంగా విభజించారు. దేశ విభజనతో పాటు బ్రిటిషు ఇండియన్ ఆర్మీ, రాయల్ ఇండియన్ నేవీ, ఇండియన్ సివిల్ సర్వీస్, రైల్వే, సెంట్రల్ ట్రెజరీల విభజన కూడా జరిగింది. ఈ విభజనను భారత స్వాతంత్ర్య చట్టం 1947లో వివరించారు. దీని ఫలితంగా బ్రిటిషు రాజ్ లేదా భారతదేశంలో బ్రిటిషు పాలన రద్దైపోయింది. భారతదేశం, పాకిస్తాన్ అనే రెండు స్వయంపరిపాలక దేశాలు 1947 ఆగస్టు 15 న అర్ధరాత్రి చట్టబద్ధంగా ఉనికిలోకి వచ్చాయి.
తేదీ | 1947 ఆగస్టు |
---|---|
ప్రదేశం | బ్రిటిషు ఇండియా, భారతదేశం, పాకిస్తాన్ |
ఫలితం | బ్రిటిషు ఇండియా సామ్రాజ్యాన్ని భారతదేశం, పాకిస్తాన్ అనే రెండు స్వతంత్ర డొమినియన్లుగా విభజన, కాందిశీకుల సమస్య |
మరణాలు | 2,00,000 నుండి 20 లక్షల దాకా,[1][lower-alpha 1] 14 million displaced[2] |
ఈ విభజనలో 1 - 1.2 కోట్ల మంది ప్రజలు మత ప్రాతిపదికన కాందిశీకులయ్యారు. కొత్తగా ఏర్పడిన దేశాల్లో పెద్దయెత్తున శరణార్థుల సంక్షోభం ఏర్పడింది. పెద్ద ఎత్తున హింస జరిగింది. విభజన సమయం లోను, అంతకుముందూ జరిగిన ప్రాణనష్టం అంచనాలు వివాదాస్పదంగా ఉన్నాయి. రెండు లక్షల నుండి ఇరవై లక్షల దాకా ఈ అంచనాలు ఉన్నాయి. [1] [lower-alpha 3] విభజన లోని హింసాత్మక స్వభావం భారత పాకిస్తాన్ల మధ్య శత్రుత్వానికి, అనుమానాల వాతావరణానికీ కారణమైంది. ఇప్పటికీ ఇది వాటి సంబంధాలను దెబ్బతీస్తూనే ఉంది.
1971 లో పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ విడిపోవడాన్ని లేదా బ్రిటిషు ఇండియా పరిపాలన నుండి బర్మా (ఇప్పుడు మయన్మార్ ), సిలోన్ (ఇప్పుడు శ్రీలంక ) లు విడిపోవడం భారతదేశ విభజనలో భాగం కాదు. [lower-alpha 4] రాచరిక సంస్థానాలు భారత పాకిస్తాన్లలో విలీనమవడం, లేదా విలీనానికి సంబంధించి హైదరాబాద్, జునాగఢ్, జమ్మూ కాశ్మీర్ రాజ్యాల్లో తలెత్తిన వివాదాలు కూడా విభజనలో భాగం కాదు. 1947–1954 కాలంలో ఫ్రెంచ్ భారతదేశం లోని ప్రాంతాలను భారతదేశంలో కలపడం లేదా 1961 లో గోవానూ, పోర్చుగీస్ భారతదేశంలోని ఇతర జిల్లాలనూ భారతదేశం చేజిక్కించుకోవడం కూడా ఈ విభజనలో భాగం కావు. 1947 లో ఈ ప్రాంతంలోని ఇతర సమకాలీన రాజకీయ ప్రాంతాలైన సిక్కిం, భూటాన్, నేపాల్, మాల్దీవులు కూడా ఈ విభజన ద్వారా ప్రభావితం కాలేదు. [lower-alpha 5]
రాచరిక సంస్థానాల్లో, పాలకుల ప్రమేయంతో గానీ, పాలకులు అసలు పట్టించుకోక పోవడం ద్వారా గానీ వ్యవస్థీకృతమైన హింస జరిగింది. సిక్కు రాష్ట్రాల్లో (జింద్, కపూర్తలా మినహా) ముస్లింల ఏరివేత జరుగుతూంటే అక్కడీ సంస్థానాధీశులు పట్టించుకోకుండా ఉండిపోయారు. పాటియాలా, ఫరీద్కోట్, భరత్పూర్ వంటి ఇతర సంస్థానాధీశులు ఈ అల్లర్లు చేయించడంలో భారీ ఎత్తున పాల్గొన్నారని భావిస్తున్నారు. భరత్పూర్ పాలకుడు, జాతి పేరిట తన ప్రజల ఏరివేత జరుగుతోంటే సాక్షిగా ఉన్నాడు - ముఖ్యంగా డీగ్ వంటి చోట్ల.[7]