బుద్ధుని జీవిత గాథలు చెక్కబడ్డ ఏనుగు దంతపు కళాకృతి
From Wikipedia, the free encyclopedia
బుద్ధుని జీవిత గాథలు చెక్కబడ్డ ఏనుగుదంతపు కళాకృతి ఒకే ఏనుగు దంతంపై అంతర్భాగాలతో చెక్కిన కళాఖండం, ప్రస్తుతానికి న్యూఢిల్లీ నేషనల్ మ్యూజియంలోని అలంకరణ కళల గాలరీలో ప్రదర్శింపబడుతోంది.
[1] ఈ ఏనుగు దంతం ప్రదర్శనశాలకు వితరణగా లభించింది. దాదాపు ఐదు అడుగుల పొడవు ఉన్న ఈ ఏనుగు దంతపు కళాకృతిపై బుద్ధుని జీవితానికి సంబంధించిన 43 ఘట్టాలను చెక్కారు. దీనిని 20వ శతాబ్ది తొలినాళ్లలో ఢిల్లీ ప్రాంతానికి చెందిన కళాకారుడు తయారుచేసినట్టు భావిస్తున్నారు.
పొడవైన, పూర్తి ఏనుగు దంతాలను చెక్కేందుకు ఉపయోగించడం 18, 19 శతాబ్దాలలోని భారతదేశంలో ప్రాచుర్యం పొందింది. ముఖ్యంగా ఈ శైలి బర్మాలో కాక మళ్ళీ ఢిల్లీ ప్రాంతాల్లోనే ప్రాచుర్యం పొందింది. ఇలాంటి పూర్తి ఏనుగు దంతాల కళాకృతులు కాంగోకు చెందిన ఐవరీ కోస్టు ప్రాంతంలో [2][3], బెనిన్లోనూ కనిపిస్తాయి. ఐతే అవి ఆఫ్రికన్ ఏనుగుల దంతాలతో చేసినవి కావడం భేదం.
ఏనుగు దంతాలు చెక్కి కళాకృతులు తయారుచేసే కళ భారతదేశంలో చాలా ప్రాచీనతరమైనది. కాళిదాసు రాసిన మేఘదూతంలో కూడా ఈ కళ గురించిన వివరాలు దొరుకుతాయి. లభ్యమవుతున్న పురాతన ఏనుగు దంతం కళాకృతుల్లో తక్షశిలలో దొరికిన సా.శ.2వ శతాబ్దానికి చెందిన దంతపు దువ్వెన ఉంది. ఏనుగుల సంచారం ఎక్కువగా ఉండి, కళకు మహారాజుల పోషణ లభించిన అస్సాం, మైసూర్ ప్రాంతాల్లో ఏనుగు దంతాలను చెక్కే కళ పరిఢవిల్లింది. ఏనుగు దంతాల కళాకృతులు రాజ్యల నడుమ వ్యాపారానికి కేంద్రంగా విలసిల్లాయి. ఆ కళాకృతులు ఎక్కడ ఈ కళకు పోషణ లభిస్తుందో అక్కడక్కడకు వెళ్ళాయి.[4]
ఈ ఏనుగు దంతపు కళాకృతిపై బుద్ధుని జీవితానికి సంబంధించిన ముఖ్యమైన ఘట్టాలు 43 వృత్తాకార అరల్లో చెక్కారు. వాటిలో మొదటి 25 బుద్ధుని జీవితంలో జననం నుంచి జ్ఞానోదయం వరకూ జరిగిన ఘట్టాల మాలిక కాగా, మిగిలిన 18 జ్ఞానోదయం నుంచి మహాపరినిర్వాణం వరకూ ఉన్న ఘట్టాలు కలిగినది. ఇలాంటి ఘట్టాలనే శిల్పాల్లో, చిత్రాల్లో ఎన్నోసార్లు చిత్రితమైనవి, ఈ దంతపు కళాకృతిలో మరికొన్ని కొత్త ఘట్టాలను కూడా కలిగుంది. ఉదాహరణకు సిద్ధార్థుడు పక్షి కోసం పోరాడడం, జంతుజాలాన్ని చంపడంపై అతని వ్యతిరేకత, మరణాన్ని గురించి గుర్తించడం వంటివి వాటిలో కొన్ని. పైకి వెళ్ళేకొద్దీ దంతం యొక్క మందం తగ్గిపోతుంది కనుక పైన ఉన్న అరల చుట్టుకొలత తగ్గించి, వృత్తం నుంచి అరలను వేరే ఆకారానికి మార్చి వాటిలో భూమిస్పర్శ ముద్ర, అభయముద్ర, ధర్మచక్రప్రవతన ముద్ర వంటి సుప్రసిద్ధమైన ముద్రలతో ఉన్న బుద్ధుణ్ణి చెక్కారు. అరల మధ్యలో లోపలికి చెక్కిన పూలతీగల వంటి నాడకట్టు కూడా దీనికి మరింత అందాన్ని చేకూర్చింది.
బుద్ధ జీవిత ఘట్టాలు దంతపు కళాకృతిపై కింది నుంచి పైకి గడియారం తిరిగే దిశలో (క్లాక్ వైజ్) అమర్చి ఉన్నాయి.[5]
బుద్దుని జీవితంలో జ్ఞానోదయ పూర్వపు ఘట్టాలు
రాజకుమారుడు సిద్ధార్థుడు జీవించిన కపిలవస్తు నగరపు చిత్రీకరణ: మొదటి అరలో పర్వతాలు, జీవజాలం, నిర్మాణాలు చూపుతూ, ఒక నగర చిత్రీకరణ చేస్తూన్నాయి. ఇది బుద్ధుని జీవితం కనుక కపిలవస్తు నగరమే కావచ్చనే ఊహ కల్పిస్తోంది.
శుద్ధోదన మహారాజు కూర్చున్న రూపం: సిద్ధార్థుని తండ్రి, కపిలవస్తు మహారాజు శుద్ధోదనుడు తన సింహాసనంపై కూర్చొన్న రూపం.
మహారాణి మాయాదేవి కల: సిద్ధార్థుని తల్లి, మహారాణి మాయాదేవికి ఏనుగు కలలోకి రావడం ఆమె గర్భంలోని శిశువు దివ్యత్వానికి చిహ్నం.
మాయాదేవి ఆమె తల్లిదండ్రులను సందర్శించడం
కుమారుడు సిద్ధార్థునితో మాయాదేవి: ఈ సన్నివేశం కపిలవస్తు రాకుమారుడు, సిద్ధార్థుని జననాన్ని మిగిలిన సాహిత్య, శిల్ప కథనాలకు భిన్నంగా చూపుతోంది. ఇక్కడ రాణి మాయాదేవి తన ఒడిలో పసిబిడ్డతో అడవిగా భావించాల్సిన ప్రదేశంలో తన స్నేహితులు, చెలికత్తెలు చుట్టుముట్టినట్టు చిత్రితమైంది.[6]
అసితుడనే ఋషి శుద్ధోదన మహారాజును సందర్శించడం
మాయాదేవి మరణ ఘట్టం
ఉద్యానవనంలో సిద్ధార్థుడు
దెబ్బతిన్న పక్షితో సిద్ధార్థుడు, దేవదత్తుడు
సిద్ధార్థుడు దెబ్బతిన్న పక్షిని కాపాడి, దానిని నయం చేయడం
యశోధర స్వయంవరంలో విలుకానిగా సిద్ధార్థుడు
సిద్ధార్థునికి మాలవేస్తున్న యశోధర
ఒక ముసలివాడిని కలిసిన సిద్ధార్థుడు
ఒక శవయాత్రను చూస్తున్న సిద్ధార్థుడు
తపస్సులో ఉన్న సన్యాసిని చూస్తున్న సిద్దార్థుడు
నిద్రపోతున్న భార్యా పిల్లలను వదిలివెళ్తున్న సిద్ధార్థుడు
సహాయకుడు చండకునితో పాటుగా రాజప్రాసాదాన్ని వదిలివెళ్తున్న సిద్దార్థుడు
మారుడు (రాక్షసుడు) బుద్ధుని దృష్టి మరల్చాలన్న ప్రయత్నం చేయడం మారుడు, బోధిసత్త్వుని లక్ష్యాన్ని అందుకోనీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేసిన బలవంతుడైన భూతం. మారుడు తన శక్తివంతమైన సైన్యంతో బోధిసత్త్వుణ్ణి భయభ్రాంతులకు గురిచేయాలని, అతని కుమార్తెలతో మోహింపజేయాలని ప్రయత్నిస్తాడు. ఐతే బోధిసత్త్వుణ్ణి అతని లక్ష్యం నుంచి మరల్చడంలో విఫలుడవుతాడు. మారుడు ఓటమిని అంగీకరిస్తాడు.
ధ్యానముద్రలో బుద్ధుడు
జ్ఞానోదయం అనంతరం బుద్ధుని జీవిత ఘట్టాలు
బుద్ధుడు ఆయన ఐదుగురు పూర్వస్నేహితులను కలవడం-వీరే ఆయన తొలి శిష్యులు అయ్యారు: జ్ఞానోదయం పొందిన అనంతరం, బుద్ధుడు తొలి బోధన ఐన ధర్మము గురించి బుద్ధగయలో అతని ఐదుగురు స్నేహితులకు బోధిస్తాడు. కౌండిన్య/కొండన్న, భద్దియ, వప్ప, మహానమ, అస్సజి వారి ఐదుగురు స్నేహితులు. బుద్ధుడు వార్ని కలిసేందుకు సారనాథ్ వెళ్ళాడు. నాలుగు సత్యాలను, అష్టవిధ మార్గాలను మొదటిసారి వారికి బోధించారు.
పశువుల కాపరితో ఓ మేకపిల్లను పట్టుకుని బుద్ధుడు నడుస్తున్న దృశ్యం
బుద్ధుణ్ణి ఆహ్వానిస్తున్న మగధ రాజు: చక్రవర్తి బింబిసారుణ్ణీ బుద్ధుడు శిష్యునిగా పొందాడు. చక్రవర్తి బౌద్ధాన్ని స్వీకరించి, బౌద్ధ విహారాలు నిర్మించేందుకు అనుమతినిచ్చాడు. ఇదే కాలక్రమేణా ఆ ప్రాంతానికి బీహార్ అనే పేరు వచ్చేందుకు కారణమైంది.[7]
శారిపుత్ర, మౌద్గల్యాయనులు బుద్ధుని శిష్యులు కావడం
బిడ్డ మరణం వల్ల శోకసంద్రంలో ఉన్న తల్లిని బుద్ధుడు తేరుకునేలా చేయడం
శుద్ధోదనుడు బుద్ధుణ్ణి కపిలవస్తుకు ఆహ్వానించడం
'యశోధర, ఆమె కుమారుడు రాహులుడితో బుద్ధుడూ
రాహులుణ్ణి బుద్ధుడు దీవించడం: యశోధర సూచన మేరకు రాహులుడు బుద్ధుణ్ణి ఆయన వారసత్వం కోసం అడుగుతాడు. బుద్ధుడు గౌరవనీయుడైన సరిపుత్తను (బుద్ధుని ముఖ్య అనుచరుడు) పిలిచి, తొలి శ్రమణెర (బాల సన్యాసి) గా మారిన ఏడేళ్ళ రాహులుణ్ణి నిర్దేశించమని చెప్తాడు. రాహులుని నిర్దేశం తర్వాత బుద్ధుడు అతనికి సత్యభాషణంలోని ప్రాముఖ్యత తెలియజేస్తాడు. బుద్ధుడు సత్యాన్ని అన్ని గుణాల్లోకీ అత్యుత్తమమైన గుణంగా నిలిపాడు. రాహులుడు క్రమంగా అర్హంతుడు అయ్యాడు.
పేరొందిన వేశ్య ఆమ్రపాలి బుద్ధునికి నమస్కరించడం: బుద్ధుడు వైశాలి సందర్శించినప్పుడు ఆమ్రపాలి యొక్క మామిడితోటలో బసచేశాడు. ఆమె బుద్ధుణ్ణి విందుకు పిలవగా ఆయన అంగీకరించాడు. అనంతరం ఆమె అదే మామిడితోటను వితరణ చేసింది. ఆమె బౌద్ధాన్ని స్వీకరించి, బౌద్ధమతానికి సమర్థకురాలిగా జీవించింది.
స్త్రీలు సౌధాల నుంచి బుద్ధుని బోధ చేయడాన్ని వీక్షించడం
భట్టాచార్య, అశోక్ కుమార్; సేన్గుప్తా, ప్రదీప్ కుమార్ (1991). ఫౌండేషన్స్ ఆఫ్ ఇండియన్ మ్యూజికాలజీ:పెర్సెప్షన్స్ ఇన్ ది ఫిలాసఫీ ఆఫ్ ఆర్ట్ అండ్ కల్చర్ (ఆంగ్లం). అభినవ్ పబ్లికేషన్స్. p.124.
పాఠక్, అనామిక (1997–98). "బుద్ధుని జీవిత ఘట్టాలు ప్రదర్శించేలా చెక్కిన ఏనుగు దంతపు కళాకృతి". కళ - ది జర్నల్ ఆఫ్ ఇండియన్ ఆర్ట్ హిస్టరీ కాంగ్రెస్. IV. గౌహతి: ఇండియన్ ఆర్ట్ హిస్టరీ కాంగ్రెస్.
పరిమూ, ఆర్. (1982). లైఫ్ ఆఫ్ బుద్ధా ఇన్ ఇండియన్ స్కల్చర్ (భారతీయ శిల్పకళలో బుద్ధుని జీవితం). న్యూఢిల్లీ. p.11.{{cite book}}: CS1 maint: location missing publisher (link)