కాళిదాసు రచించిన మహాకావ్యం From Wikipedia, the free encyclopedia
మేఘ సందేశం (సంస్కృతం) పూర్తిపాఠం వికీసోర్స్లో ఉంది.
మేఘ సందేశం లేదా మేఘదూతం (Meghasandesam or Meghadiootam) సంస్కృతంలో మహాకవి కాళిదాసు రచించిన ఒక కావ్యము. కాళిదాసు రచించిన కావ్యత్రయం అని పేరు పొందిన మూడు కావ్యాలలో ఇది ఒకటి. (మిగిలిన రెండు రఘు వంశము, కుమార సంభవము)
కేవలం 111 శ్లోకాలతో కూడిన ఈ చిన్నకావ్యము కాళిదాసు రచనలలోను, సంస్కృత సాహిత్యంలోను విశిష్టమైన స్థానాన్ని కలిగి ఉంది. కుబేరుని కొలువులో ఉన్న ఒక యక్షుడు కొలువునుండి ఒక సంవత్సరం పాటు బహిష్కారానికి గురవుతాడు. ఆ యక్షుడు హిమాలయాలలోని కైలాసగిరికి పైన, అలకాపురిలో ఉన్న తన ప్రియురాలికి ఒక మేఘం ద్వారా సందేశం పంపుతాడు. మార్గసూచకంగా యక్షుడు ఆ మేఘానికి హిమాలయాలకు పోయే దారిలోనున్న పెక్కు దృశ్యాలను వర్ణిస్తాడు.
1813లో ఈ కావ్యం 'హోరేస్ హేమాన్ విల్సన్' (Horace Hayman Wilson) చే ఆంగ్లంలోనికి అనువదింపబడింది.
మేఘ సందేశంలో శ్లోకాల సంఖ్యపై కొంత అనిశ్చితి ఉంది. మూల కావ్యంలో 110 లేదా 111 శ్లోకములని అంటారు. పూర్వ మేఘంలో 63, ఉత్తర మేఘంలో 48 శ్లోకాలున్నాయని సుశీలకుమార దేవుడు చెప్పాడు. వావిళ్ళవారి ప్రతిలో 124 శ్లోకాలు, మరి కొన్ని ప్రతులలో 129 శ్లోకాలు చెప్పబడ్డాయి.[1]
మేఘ సందేశం కావ్యంలో కాళిదాసు వర్ణనా నైపుణ్యము, అలంకార పటిమ, పాత్ర చిత్రణ, శృంగార ప్రస్తావన అద్భుతంగా కనిపిస్తాయి. ఇంకా వివిధ భౌగోళిక అంశాలు చెప్పబడ్డాయి. సంక్షిప్తంగా కావ్యంలో ఉన్న విషయం ఇది.
ఒక యక్షుడు కర్తవ్యాన్ని విస్మరించడం వలన యజమాని శాపానికి గురియై, మహిమలు పోగొట్టుకుని, కొలువునుండి ఒక సంవత్సరంపాటు బహిష్కరింపబడి, ఒక సంవత్సరం పాటు చిత్రకూటం వద్ద రామగిరి అరణ్యాలలో తిరుగాడుతూ ఉన్నాడు. ప్రియురాలి ఎడబాటుతో విహ్వలుడై ఉన్న అతనికి ఆషాఢం సమీపించినపుడు ఒక మబ్బుతునక అతనికంటబడింది. తన వియోగంతో తన ప్రేయసి కృశించి దుఃఖిస్తూ ఉంటుందని తలచిన ఆ యక్షుడు ఎలాగో ప్రేయసిని ఊరడించడానికి తన సందేశాన్ని ఆమెకు అందించమని కోరుతాడు. పుష్కలావర్త సంభూతుడు అయిన మేఘుడు ఉత్తమ కుల సంజాతుడు గనుక ఒకవేళ తన అభ్యర్ధనను తిరస్కరించినా 'యాచనా లాఘవము' (చిన్నతనము) ఉండదని భావించి అతనిని ప్రార్ధిస్తాడు. మేఘుడు వెళ్ళవలసిన మార్గాన్నీ, మధ్యలో కానవచ్చే దృశ్యాలనూ వర్ణిస్తాడు.
మిత్రమా! గాలి పాటు నీ ప్రయాణానికి అనుకూలంగా ఉంది. శుభ శకునాలు కనుపిస్తున్నాయి. హంసలు నీకు మానస సరోవరం దాకా తోడు వస్తాయి. దారిలో అలసిపోతే కొండ కొనలపై విశ్రాంతి తీసుకో. శక్తి ఉడిగితే మధురమైన నదీజలాలను ఆస్వాదించు. మధ్యలో పొటమరించిన కార్చిచ్చును ఆర్చేవాడవు గనుక నిన్ను ఆమ్రకూటం మరువలేదు. మధ్యలో నెమళ్ళు అందంగా నిన్ను స్వాగతిస్తాయి. కాని మైమరచి కార్యాన్ని విస్మరించవద్దు సుమా!.
ఇంకా ముందుకు సాగి విదిశానగరం వద్ద వేదవతీ నదీజలాలను ఆస్వాదించు. ఉజ్జయినీ నగరంలోని ఉత్సవాలను తిలకించు. ఏదైనా మేడపైన విశ్రాంతి తీసుకో. మహాకాళేశ్వరుని పూజా సమయంలో మృదంగ నాదంలాగా ఉరిమి ముందుకు సాగు. తరువాత గంభీరానదికి ఎదురు వెళ్ళు. దేవగిరి వద్ద చల్లనిగాలి నీకు సేద తీరుస్తుంది. అక్కడ నువ్వు ఉరిమితే కార్తికేయుని నెమలి ఆనందంగా ఆడుతుంది. తరువాత చర్మణ్వతీ నది, దశపురము, బ్రహ్మావర్తము, కురుక్షేత్రము కనిపిస్తాయి. సరస్వతీ నదీజలాలతో పునీతుడవు కావచ్చును. పాలపొంగులాంటి గంగానది ఫైనుండి పయనించి హిమాలయాలను చేరుకో. ఆదిదంపతుల ఆతిథ్యమారగించు. ఒకవేళ గౌరమ్మ కాలినడకన కైలాసం ఎక్కుతూ ఉంటే నీవు మెట్లుగా మారి ఆమెకు సహకరించు. తరువాత మానస సరోవరం జలాలను గ్రోలి ముందుకు సాగగానే కన్నుల పండువుగా అలకా నగరం కనుపిస్తుంది.
అలకానగరం శోభ వర్ణనతో ఉత్తర మేఘం భాగం ఆరంభమౌతుంది. యక్షుడు మేఘునితో తన సంభాషణను ఇలా కొనసాగిస్తాడు -
మిత్రమా! అలకానగరం వర్ణనకు అలవి గానంత అందమైనది. అక్కడి అనేకమైన మేడలు నీతో సమానంగా అంబరాలనంటుతుంటాయి. నీ మెరుపు నెచ్చెలి ఎప్పుడూ నిన్నంటిపెట్టుకొని ఉన్నట్లుగా ఆ భవనాలలో సుందరాంగులు శోభాయమానంగా ఉంటారు. వర్ణ చిత్రాలతో, మధుర సంగీత నాదాలతో, ఇంద్రనీల కాంతులతో ఆ భవనాలు అలరారుతుంటాయి. అక్కడ కుబేరుని ప్రాసాదమునకు ఉత్తరాన ఇంద్రధనుస్సులా ఉండే నా భవనం దూరాన్నుంచే కనిపిస్తుంది.కల్పవృక్షము, నీలమణిఖచితమైన సోపానములు గల బావి, కృతక పర్వతము, కన్నులకింపైన వకుళ, అశోక వృక్షములు, ద్వారమున రమ్యమైన శంఖ పద్మములు - ఇవి నాయింటి గురుతులు.
ఆ నా భవనమున ఇంపైన పలువరస, సన్ననైన నడుము, చకిత హరిణీ నయనములు గలిగి, యౌవన మధ్యస్థ యైన ముద్దులొలుకు వయ్యారపు బొమ్మ యున్నది. ఆమెయే నా ప్రియతమ, నా బహిఃప్రాణము, మద్వియోగ సంతప్త. ఒకవేళ ఆమె గనుక నిద్రిస్తూ ఉంటే దయతో సద్దుమణగి వేచియుండుము. తరువాత మెల్లగా మేలుకొలిపి మందస్వరముతో నా సందేశాన్ని వినిపించు.
ఆ సందేశము ఏమంటే - "ఓ కళ్యాణీ! విధి చేత శిక్షింపబడిన నీ కాంతుడు రామగిరి ఆశ్రమమున కుశలముగా నున్నాడు. నీకై కుములుచున్నా గాని, శాపాంతమున తిరిగి లభింపగల భోగములను తలచుకొని ఊరట చెందుచున్నాడు. నీవు బేలవు కాక ధైర్యము తెచ్చుకొనుము. కష్టములు కడతేరక మానవు. మిగిలిన నాలుగు నెలల శాపము త్వరలో ముగియనున్నది. ఆపై అంతా ఆనందమే".
ఇంకా యక్షుడు మేఘునితో ఇలా అన్నాడు - "ఓ జలదా! అన్యమార్గము లేక ఈ దూతకార్యము నీకప్పగించుచున్నాను. నా ధూర్తత్వమును మన్నింపుము. నా దయనీయ స్థితిని చూచి నీవీ సందేశమును అందజేతువని ఆశించుచున్నాను. ఆపై నీ ఇచ్చవచ్చిన యెడ నీవు తిరుగవచ్చును. నీకెన్నటికిని ప్రియ వియోగము సంభవించకుండు గాక".
దయనీయమైన ఆ సందేశమును వినిన మేఘుడు యక్షపురికి అరిగి యక్షిణికి ప్రియుని కుశలవార్తను అందజేసెను. ఆ పడతి ఊరటనందెను. కుబేరుడు కూడా ఈ విషయమునెరిగి కరుణతో శాపమును అంతమొందించెను. అప్పుడా యువ దంపతులు సంతోషాంతరంగితులగుచు ఎక్కువైన భోగములనుభవించిరి.
వర్ణనలలోను, అలంకారాలలోను కాళిదాసునకు గల అసమాన ప్రతిభా శైలి ఈ కావ్యంలో వెల్లివిరిసింది. మచ్చుకు కొన్ని వర్ణనలు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.