దలైలామా
టిబెట్ బౌద్ధుల మతాచార్యుడు / From Wikipedia, the free encyclopedia
దలైలామా, టిబెట్ లోని గెలుగ్ శాఖకు చెందిన బౌద్ధుల ఆచార్య పదవి పేరు. టిబెట్ లోని సాంప్రదాయిక బౌద్ధ శాఖల్లో ఇది అత్యంత నవీనమైనది. [1] ప్రస్తుత దలైలామా, దలైలామాల పరంపరలో 14 వ వారు,భారతదేశంలో శరణార్థిగా నివసిస్తున్నాడు. అతడి పేరు టెన్జిన్ గయాట్సో . దలైలామాను తుల్కస్ శ్రేణిలో ఒకడిగా పరిగణిస్తారు. తుల్కస్ అంటే కారుణ్య బోధిసత్వుడైన అవలోకితేశ్వరుడి అవతారమని భావిస్తారు [2] [3]
దలైలామా
Standard Tibetan: ཏཱ་ལའི་བླ་མ་ Wylie transliteration: tā la'i bla ma | |
---|---|
విధం | His Holiness |
అధికారిక నివాసం | ధర్మశాల, హిమాచల్ ప్రదేశ్, భారతదేశం |
నిర్మాణం | 1391 |
మొదట చేపట్టినవ్యక్తి | Gendun Drup, 1st Dalai Lama |
17 వ శతాబ్దంలో 5 వ దలైలామా కాలం నుండి, అతని మూర్తిమత్వం ఎల్లప్పుడూ టిబెట్ ఏకీకరణకు చిహ్నంగా ఉంటూ వచ్చింది. అతను బౌద్ధ విలువలకు, సంప్రదాయాలకూ ప్రాతినిధ్యం వహించాడు. [4] మధ్య టిబెట్లో రాజకీయం గాను, సంఖ్యాపరం గానూ ఆధిపత్యం వహించిన గెలుక్ శాఖలో దలైలామా ఒక ముఖ్యమైన వ్యక్తి. కానీ అతని మత అధికారం వివిధ బౌద్ధ శాఖల సరిహద్దులను దాటిపోయింది. దలైలామాకు ఏ శాఖ సంప్రదాయాలలోనూ అధికారిక లేదా సంస్థాగత పాత్ర లేదు. ఆయా శాఖలకు చెందిన స్వంత ఉన్నత లామాలే శాఖకు నేతృత్వం వహిస్తారు. అయినప్పటికీ, దలైలామా టిబెటన్ ఏకీకృత రాజ్యానికి చిహ్నం. బౌద్ధ విలువలు సంప్రదాయాలకు సంబంధించినంత వరకు ఏ బౌద్ధ శాఖ కంటే కూడా ఉన్నతంగా ప్రాతినిధ్యం వహిస్తాడు. [5] భిన్నమైన మత ప్రాంతీయ సమూహాలను కలిపి, అందరికీ ఆరాధ్యుడైన వ్యక్తిగా ఉండే దలైలామా యొక్క సాంప్రదాయిక పనితీరును ప్రస్తుత పద్నాలుగో దలైలామా చేపట్టాడు. బహిష్కృత సమాజంలో విభేదాలను, విభజనలనూ అధిగమించడానికి అతను పనిచేశాడు. టిబెట్ లోను, ప్రవాసం లోనూ ఉన్న టిబెటన్లకు జాతీయతా చిహ్నంగా మారాడు. [6]
1642 నుండి 1705 వరకు, మళ్ళీ 1750 నుండి 1950 ల వరకు, దలైలామాలు లేదా వారి ప్రతినిధులు లాసాలోని టిబెటన్ ప్రభుత్వానికి (లేదా గాండెన్ ఫోడ్రాంగ్ ) నాయకత్వం వహించారు. ఇది టిబెట్ పీఠభూమి మొత్తాన్నీ లేదా చాలా భాగాన్ని స్వయంప్రతిపత్తితో పరిపాలించింది [7] క్వింగ్ రాజవంశం ఆధిపత్యం కింద ఉండేది. [8] 1913 - 1951 మధ్య ఉన్న కాలం వివాదాస్పదమైన "వాస్తవ స్వాతంత్ర్యం" కాలం అని అంటారు. ఈ టిబెటన్ ప్రభుత్వం మొదట మంగోల్ రాజులైన ఖోషుట్ రక్షణలో ఉండేది. అ తరువాత డుంగార్ ఖానెట్స్ (1642–1720), ఆ తరువాత మంచు నేతృత్వంలోని క్వింగ్ వంశపు (1720-1912) చక్రవర్తుల రక్షణలో ఉంది. 1913 లో, అగ్వాన్ డోర్జీవ్తో సహా పలు టిబెటన్ ప్రతినిధులు టిబెట్, మంగోలియా మధ్య ఒక ఒప్పందంపై సంతకం చేశారు. ఈ ఒప్పందం ద్వారా పరస్పర గుర్తింపును, చైనా నుండి తమ స్వాతంత్ర్యాన్నీ ప్రకటించుకున్నారు. అయితే ఈ ఒప్పందపు చట్టబద్ధతను, టిబెట్ స్వాతంత్ర్యాన్నీ రిపబ్లిక్ ఆఫ్ చైనా, ప్రస్తుత పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా రెండూ తిరస్కరించాయి. చైనా యొక్క . [9] అయినప్పటికీ, 1951 వరకు దలైలామాలే టిబెటన్ ప్రభుత్వానికి నాయకత్వం వహించారు.