తేజస్ (యుద్ధ విమానం)
భారత్కు చెందిన హెచ్ఏఎల్ తయారుచేసిన యుద్ధ విమానం / From Wikipedia, the free encyclopedia
తేజస్, భారతదేశం అభివృద్ధి చేసి, తయారు చేసిన యుద్ధ విమానం. డెల్టా వింగ్ కలిగి, ఒకే ఇంజనుతో పనిచేసే తేజస్, మల్టీరోల్ లైట్ కాంబాట్ యుద్ధ విమానం. దీనిని భారత ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎడిఎ), హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) లు రూపొందించాయి. దీని ప్రధాన వినియోగదారులు భారత వైమానిక దళం, భారత నావికాదళాలు. పాతవై, వయసు పైబడుతున్న మిగ్ -21 యుద్ధ విమానాల స్థానాన్ని పూరించేందుకు, 1980 లలో మొదలుపెట్టిన లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (ఎల్సిఎ) కార్యక్రమం నుండి రూపుదిద్దుకున్న విమానమే తేజస్. 2003 లో, ఈ యుద్ధవిమానానికి అధికారికంగా "తేజస్" అని పేరు పెట్టారు.[8]
తేజస్ | |
---|---|
భారత వాయుసేన 18 స్క్వాడ్రన్కు చెందిన తేజస్ - గాల్లో ఎగురుతూ | |
పాత్ర | మల్టీ రోల్ లైట్ ఫైటర్ |
రూపుదిద్దుకున్న దేశం | India |
తయారీదారు | హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ |
డిజైను బృందం | ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజన్సీ |
మొదటి విహారం | 2001 జనవరి 4 |
చేర్చుకున్నవారు | 2015 జనవరి 17[1] |
స్థితి | సేవలో[2] |
ప్రధాన వాడుకరి | భారతీయ వాయుసేన |
ఉత్పత్తి జరిగిన కాలం | 2001–ఇప్పటి వరకూ |
మొత్తం సంఖ్య | 32 (2019 మార్చి నాటికి, 16 ప్రోటోటైపులతో సహా)[3][4] |
కార్యక్రమం ఖర్చు | ₹7,399.69 crore (US$927 million) (LCA total in 2015)[5] |
ఒక్కొక్కదాని ఖర్చు | |
Developed into | HAL Tejas Mk2 |
తేజస్ తోక లేని సంయుక్త డెల్టా-వింగ్ కాన్ఫిగరేషన్ను, ఒకే డోర్సల్ ఫిన్తో ఉంటుంది. ఇది సాంప్రదాయిక రెక్కల డిజైన్ల కంటే మెరుగైన హై-ఆల్ఫా పనితీరును అందిస్తుంది.[9] దీని వింగ్ రూట్ లీడింగ్ ఎడ్జ్ 50 డిగ్రీల స్వీప్, బాహ్య వింగ్ లీడింగ్ ఎడ్జ్ 62.5 డిగ్రీల స్వీప్, వెనుక ఉన్న అంచు నాలుగు డిగ్రీల ఫార్వర్డ్ స్వీప్ కలిగి ఉంది. రిలాక్స్డ్ స్టాటిక్ స్టెబిలిటీ, ఫ్లై-బై-వైర్ ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్, మల్టీ-మోడ్ రాడార్, ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ఏవియానిక్స్ సిస్టమ్, మిశ్రమ పదార్థ నిర్మాణాల వంటి సాంకేతికతలను తేజస్లో సమకూర్చారు. ఇది సమకాలీన సూపర్సోనిక్ పోరాట విమానాలలో అతి చిన్నది, అత్యంత తేలికైనది.[10][11]
హెచ్ఏఎల్ HF-24 మారుత్ తరువాత హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) అభివృద్ధి చేసిన రెండవ విమానం, తేజస్. ఇది సూపర్సోనిక్ ఫైటర్ విమానం. 2016 నాటికి, తేజస్ మార్క్-1 భారత వైమానిక దళం (ఐఎఎఫ్) కోసం ఉత్పత్తి జరుగుతూ ఉంది. భారత నావికా దళం (ఐఎన్) కోసం నావికాదళ తేజస్పై వైమానిక పరీక్షలు జరుగుతున్నాయి. వాయుసేన కోసం 200 సింగిల్-సీట్ యుద్ధ విమానాలు, 20 రెండు సీట్ల శిక్షణ విమానాలూ అవసరమని అంచనా వేసారు. నావికాదళానికి కనీసం 40 సింగిల్-సీట్ ఫైటర్లు అవసరమని అంచనా. వాయుసేనలో మొదటి తేజస్ యూనిట్ - నం. 45 స్క్వాడ్రన్ (ఫ్లయింగ్ డాగర్స్) - 2016 జూలై 1 న రెండు తేజస్లతో ఏర్పాటు చేసారు. ప్రారంభంలో బెంగళూరులో ఉన్న 45 స్క్వాడ్రన్ను తరువాత తమిళనాడులోని సూలూరు వద్ద ఉన్న స్థావరానికి మార్చారు.[12][13] 2016 నాటికి, తేజస్ లో ఉన్న విడిభాగాల్లో స్వదేశీవి విలువ ప్రకారం 59.7%, సంఖ్య ప్రకారం 75.5% అని రక్షణ శాఖ సహాయ మంత్రి సుభాష్ భామ్రే పార్లమెంటుకు నివేదించాడు.[14]
వైమానిక దళంలో అన్ని రకాలూ కలిపి మొత్తం 324 తేజస్ విమానాలు అవసరమని 2019 లో ప్రణాళికలు తయారు చేసారు.[15] మొదటి బ్యాచ్లో మొత్తం 40 మార్క్-1 విమానాలు సరఫరా చేస్తారు. వాటిలో 16 ఐఓసి స్టాండర్డ్ (ఇప్పటికే సరఫరా చేసేసారు),[16] 16 ఎఫ్ఓసి స్టాండర్డ్ (2019 చివరి నాటికి సరఫరా మొదలౌతుంది),[17] 8 శిక్షణ విమానాలూ ఉన్నాయి.[18] వీటి తరువాత సరఫరా చేసే 83 తేజస్లు, అప్గ్రేడ్ చేసిన మార్క్-1ఎ రకానికి చెందినవి.[19] ఈ మొదటి 123 విమానాల సరఫరా పూర్తయ్యే సమయానికి - 2025–26 నాటికి - తేజస్ మార్క్-2 ఉత్పత్తికి సిద్ధంగా ఉంటుందని భావిస్తున్నారు.[20]