కోనసీమ జిల్లా
ఆంధ్రప్రదేశ్లో ఒక జిల్లా / From Wikipedia, the free encyclopedia
కోనసీమ జిల్లా, అధికారికంగా, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ భాగంగా 2022లో కొత్తగా ఏర్పడిన జిల్లా.[1] ఇది పూర్వపు తూర్పు గోదావరి జిల్లా నుండి కొన్ని మండలాలను విడగొట్టుట ద్వారా ఆవిర్బంచింది. జిల్లా కేంద్రం అమలాపురం. గోదావరి నది సముద్రంలో కలిసే ప్రాంతమే కోనసీమ. ధవళేశ్వరం బ్యారేజ్ దిగువన గోదావరి పలు పాయలుగా మారుతుంది. అందులో వశిష్ఠ, వైనతేయ, గౌతమీ పాయల మధ్య ప్రాంతమే కోనసీమ. నదీ పాయల మధ్య దీవుల సముదాయంలా కోనసీమ కనిపిస్తుంది. బంగాళాఖాతం తీరాన్ని ఆనుకుని ఉంటుంది. గతంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో భాగంగా ఉన్న రాజోలు, కొత్తపేట, రామచంద్రపురం, ముమ్మడివరం, మండపేట, అమలాపురం, పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాలతో ఈ జిల్లా అవతరించింది. జిల్లాలో అమలాపురం, రామచంద్రపురం, కొత్తపేట అనే మూడు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. ఈ రెవెన్యూ డివిజన్లను 22 మండలాలుగా విభజించారు. 2011 భారత జనగణన ప్రకారం, జిల్లాలో జనాభా మొత్తం 17.191 లక్షలు మంది ఉన్నారు.[2] జిల్లా వైశాల్యం 2,083 చ. కి. విస్తీర్ణంతో ఉంది. అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, ద్రాక్షారామంలో పంచారామలలో ఒకటైన శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వరస్వామి దేవాలయం జిల్లాలో ప్రముఖ పర్యాటక ఆకర్షణలు.
కోనసీమ జిల్లా
డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా | |
---|---|
దేశం | భారత దేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
ప్రాంతం | కోస్తా |
Seat | అమలాపురం |
Area | |
• Total | 2,083 km2 (804 sq mi) |
Population (2011)[1] | |
• Total | 17,19,100 |
భాషలు | |
• అధికార | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 0 ( ) |