![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/0/07/India_House_today.jpg/640px-India_House_today.jpg&w=640&q=50)
ఇండియా హౌస్
1905-1910 మధ్య ఉత్తర లండన్లో ఉన్న విద్యార్థి నివాసం, భారత స్వాతంత్ర్య విప్లవ కార్యకలాపాల కేంద్రం / From Wikipedia, the free encyclopedia
ఇండియా హౌస్, 1905 - 1910 మధ్య కాలంలో ఉత్తర లండన్లో, హైగేట్ లోని క్రోమ్వెల్ అవెన్యూలో ఉన్న విద్యార్థి వసతి భవనం. న్యాయవాది శ్యామ్జీ కృష్ణ వర్మ ప్రోత్సాహంతో, బ్రిటన్లోని భారతీయ విద్యార్థులలో జాతీయవాద భావాలను పురికొల్పడానికి దీన్ని ప్రారంభించారు. ఈ సంస్థ ఇంగ్లండ్లో ఉన్నత చదువుల కోసం వచ్చే భారతీయ యువకులకు స్కాలర్షిప్లను మంజూరు చేసేది. ఈ భవనం వేగంగా రాజకీయ క్రియాశీలతకు కేంద్రంగా మారింది. ఇది విదేశీ విప్లవ భారత జాతీయవాదానికి అత్యంత ప్రముఖమైనది. వివిధ సమయాల్లో భవనాన్ని ఉపయోగించిన జాతీయవాద సంస్థలను అనధికారికంగా సూచించడానికి "ఇండియా హౌస్" అనే పేరే వాడేవారు.
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/0/07/India_House_today.jpg/320px-India_House_today.jpg)
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/te/thumb/7/77/India_House_collage2.jpg/220px-India_House_collage2.jpg)
మధ్య: ది ఇండియన్ సోషియాలజిస్ట్, సెప్టెంబర్ 1908 సంచిక.
ఇండియా హౌస్ నిర్వాహకులు ది ఇండియన్ సోషియాలజిస్ట్ అనే వలసవాద వ్యతిరేక వార్తాపత్రికను ప్రచురించేవారు. బ్రిటిష్ భారత పాలకులు దీనిని "దేశద్రోహి" అని ముద్ర వేసి నిషేధించారు. [1] వినాయక్ దామోదర్ సావర్కర్, భికాజీ కామా, VN ఛటర్జీ, లాలా హర్ దయాల్, VVS అయ్యర్, MPT ఆచార్య, PM బాపట్లతో సహా అనేకమంది ప్రముఖ భారతీయ విప్లవకారులు, జాతీయవాదులకు ఇండియా హౌస్తో సంబంధం ఉండేది. 1909లో, ఇండియా హౌస్ సభ్యుడు, మదన్ లాల్ ధింగ్రా, భారతదేశ వ్యవహారాల మంత్రికి రాజకీయ సహాయకుడైన సర్ WH కర్జన్ విల్లీని హత్య చేశాడు.
హత్య తర్వాత స్కాట్లాండ్ యార్డ్, ఇండియన్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ ఆఫీస్ చేసిన దర్యాప్తుతో సంస్థ బీటలు వారింది. మెట్రోపాలిటన్ పోలీసులు ఇండియా హౌస్ కార్యకలాపాలపై చేపట్టిన అణిచివేత చర్యల వలన దాని సభ్యులు బ్రిటన్ వదిలి ఫ్రాన్స్, జర్మనీ, యునైటెడ్ స్టేట్స్కు వెళ్ళిపోయారు. చాలా మంది సభ్యులు భారతదేశంలో విప్లవాత్మక కుట్రలలో పాల్గొన్నారు. ఇండియా హౌస్ సృష్టించిన నెట్వర్కు మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో భారతదేశంలో జాతీయవాద విప్లవం కోసం హిందూ-జర్మన్ కుట్రలో కీలక పాత్ర పోషించింది. తదనంతర దశాబ్దాలలో, ఇండియా హౌస్ పూర్వ విద్యార్థులు భారత కమ్యూనిజం లోను, హిందూ జాతీయవాదం స్థాపనలోనూ ప్రముఖ పాత్ర పోషించారు.