బ్రిటిష్ సామ్రాజ్యం
From Wikipedia, the free encyclopedia
యునైటెడ్ కింగ్డమ్, అది ఏర్పడక ముందు ఉనికిలో ఉన్న దేశాలూ పరిపాలించిన దేశాలు, కాలనీలు, ప్రొటెక్టరేట్లు, సామంత ప్రాంతాలు, తదితర భూభాగాలతో కూడిన ప్రాంతాలన్నిటినీ కలిపి బ్రిటిష్ సామ్రాజ్యం అంటారు. ఇది 16 వ శతాబ్దం చివర, 18 వ శతాబ్దాల మధ్య ఇంగ్లాండ్ స్థాపించిన విదేశీ ఆస్తులు, వాణిజ్య పోస్టులతో ప్రారంభమైంది. ఉచ్ఛస్థితిలో ఉన్నపుడు ఇది చరిత్రలో కెల్లా అతిపెద్ద సామ్రాజ్యం. ఒక శతాబ్దానికి పైగా ప్రపంచ శక్తిగా నిలిచింది.[1] 1913 నాటికి బ్రిటిష్ సామ్రాజ్యంలో 41.2 కోట్ల జనాభా ఉండేది. ఆనాటి ప్రపంచ జనాభాలో అది 23%.[2] 1920 నాటికి దాని విస్తీర్ణం 3,55,00,000 చ.కి.మీ. ఉండేది.[3] యావత్తు భూభాగంలో ఇది 24%. ఫలితంగా, దాని రాజ్యాంగ, చట్టపరమైన, భాషా, సాంస్కృతిక వారసత్వం విస్తృతంగా ఉంది. దాని శక్తి అత్యున్నత స్థాయిలో ఉన్నపుడు, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వర్ణించడానికి "సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం" అనే మాటను తరచుగా ఉపయోగిస్తారు.రోజులో ఏసమయంలో నైనా ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న దాని భూభాగాలలో కనీసం ఏదో ఒకదాని పైనైనా సూర్యుడు ప్రకాశిస్తూనే ఉంటాడు.[4]
బ్రిటిష్ సామ్రాజ్యం | |
---|---|
ఎడమ: గ్రేట్ బ్రిటన్ జెండా (1707 ఏకీకరణ చట్టాల ప్రకారం) కుడి: యునైటెడ్ కింగ్డం జెండా (1800 ఏకీకరణ చట్టాల ప్రకారం) | |
ప్రపంచవ్యాప్తంగా బ్రిటిష్ సామ్రాజ్యం కింద ఉన్న ప్రాంతాలు. ప్రస్తుతం కూడా బ్రిటిష్ ఓవర్సీస్ టెరిటరీస్ పేరుతో ఉన్న భూభాగాలను ఎర్ర క్రీగీతతో చూపించబడ్డాయి. |
15, 16 వ శతాబ్దాలలో డిస్కవరీ యుగంలో, పోర్చుగల్, స్పెయిన్ దేశాలు భూగోళంపై యూరోపియన్ల అన్వేషణకు ముందంజ వేసాయి. ఈ క్రమంలో అవి పెద్ద విదేశీ సామ్రాజ్యాలను స్థాపించాయి. ఈ సామ్రాజ్యాలు సృష్టించిన గొప్ప సంపద గురించి అసూయపడిన ఇంగ్లాండ్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ దేశాలు [5] అమెరికా, ఆసియాల్లో తమ స్వంత కాలనీలు, వాణిజ్య నెట్వర్క్లను స్థాపించడం ప్రారంభించాయి. 17, 18 వ శతాబ్దాలలో నెదర్లాండ్స్, ఫ్రాన్స్తో వరసగాఅ జరిగిన యుద్ధాల పర్య్వసానంగా ఇంగ్లాండ్ (1707 లో ఇంగ్లాండ్, స్కాట్లాండ్ లు ఏకమైన తరువాత ఇంగ్లాండ్, "బ్రిటన్" అయింది), ఉత్తర అమెరికాలో ఆధిపత్య శక్తిగా రూపొందింది. 1757 లోజరిగిన ప్లాసీ యుద్ధంలో ఈస్ట్ ఇండియా కంపెనీ మొఘల్ బెంగాల్ను స్వాధీనం చేసుకోవడంతో, బ్రిటన్ భారత ఉపఖండంలో ఆధిపత్య శక్తిగా మారింది.