ఉత్తరమీమాంస
From Wikipedia, the free encyclopedia
వ్యాస విరచితమైన బ్రహ్మ సూత్రములే షడ్దర్శనాలలో ఆఖరిదైన ఉత్తరమీమాంసా దర్శనము లేదా వేదాంత దర్శనము. బాదరాయణునిచే సూత్రబద్ధం చేయటం వలన బాదరాయణ సూత్రాలనీ, వేదాంతాన్ని వివరిస్తాయి కనుక వేదాంత సూత్రాలనీ, బ్రహ్మమును గురించి నివేదిస్తాయి కనుక బ్రహ్మమీమాంస లేదా బ్రహ్మ సూత్రాలనీ పేరు వచ్చింది. శారీరకుని (శరీర పరివృతుడైన జీవాత్మ) గురించి మీమాంసించడం వలన శారీరక మీమాంస అని కూడా అంటారు. అందుకే బ్రహ్మసూత్రాలకు శంకరుడు వ్రాసిన భాష్యం శారీరక భాష్యంగా ప్రసిద్ధి కెక్కింది. ఈ సూత్రములను వ్రాసినది బాదరయణుడు అని ఆదిశంకరుడు స్పస్టముగ వ్రాసినా బాదరయణుడు, వ్యాసుడు ఒకరే అను విషయములో కచ్చితమైన ఆధారములు లేవు. ఇందులో జైన, బౌద్ధ మతములను పరామర్సించుట చేత, ఆ మతములు మన దేశములో ప్రచారమైన తర్వాత ఈ గ్రంథము రచించి యుండవచ్చునని తెలియవచ్చుచున్నది.
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
బ్రహ్మసూత్ర గ్రంథంలో నాలుగు అధ్యాయాలు, ప్రతీ అధ్యాయంలో నాలుగు పాదాలు, ప్రతి పాదంలో కొన్ని అధికరణాల చొప్పున మొత్తం 192 అధికరణాలు, ప్రతి అధికరణంలో కొన్ని సూత్రాల చొప్పున మొత్తం 555 సూత్రాలు ఉన్నాయి. శంకరునితోపాటు రామానుజుడు, మధ్వాచార్యుడు, వల్లభాచార్యుడు మొదలైనవారు కూడా బ్రహ్మసూత్రాలకు భాష్యాలను రచించడం జరిగింది.
ఇందలి ప్రథమమున గల నాలుగు సూత్రములు మాత్రము బహు మిక్కిలిగా గురువులు తమ శిష్యులకు బోధింతురు. వీటిని "చతుస్సూత్రి" అని అంటారు.
దీనితో పాటు శంకరులవారి అధ్యాస భాష్యము చాల ముఖ్యమైనది. అధ్యాస అనగా ఆరోపము. అధ్యాస ఎలా జరిగింది అని శ్రవణ కాలములో అవగతము చేసుకున్నవారికి, వేదాంత అర్ధమును గ్రహించుట బహు సులువు అగును. సూత్రము అనగా, తక్కువ సంఖ్యగల మాటలు, సారమైన విషయము, వివిధములైన అర్ధములు దానియందుండ వలయును. అనావస్యమైన మాటలు ఉండకూడదు. మరి ఏ దోషములు ఉండరాదు. సూత్రమును విడగొట్టి వివరముగ గురుశిష్య సంప్రదాయముతో తెలుసుకొనిన గాని సూత్రమున దాగిన అర్ధము యథాతథముగ బోధపడదు.