పిక్టోరియలిజం
From Wikipedia, the free encyclopedia
పిక్టోరియలిజం (ఆంగ్లం: Pictorialism) అనునది 19 ద్వితీయార్థంలో, 20వ శతాబ్దంలో ఫోటోగ్రఫిని అంతర్జాతీయ స్థాయిలో నడిపించిన ఒక కళా ఉద్యమం. ఈ పదానికి ప్రామాణిక నిర్వచనం లేకున్ననూ ఇది సాధారణంగా యథాతథంగా ఏర్పడే ఛాయాచిత్రాన్ని కేవలం నమోదు చేయటానికి మాత్రమే పరిమితం కాకుండా, ఛాయాగ్రహకుడు ఏదో ఒక విధంగా దానిని మార్చి ఒక భావాత్మకమైన ఛాయాచిత్రాన్ని సృష్టించే శైలిని సూచిస్తుంది. సాధారణంగా ఒక పిక్టోరియల్ ఛాయాచిత్రం స్పష్టత (sharp focus) లోపించినదై బ్లాక్-అండ్-వైట్ కే పరిమితం కాకుండా warm brown లేదా ఊదా రంగులలో ముద్రితమై కుంచెతో అక్కడక్కడా మెరుగులు అద్దబడి, ఏర్పడిన ఛాయాచిత్రం యొక్క అందాన్ని పెంపొందించేవిధంగా ఉంటుంది. ఒక పిక్టోరియలిస్ట్ కళాకారుడి యొక్క ఛాయాచిత్రం ఒక చిత్రపటం వలె భావోద్రేక ఉద్దేశ్యాన్ని కలిగించి వీక్షకుని యొక్క ఊహాలోకాన్ని ప్రభావితం చేసేదిగా ఉంటుంది.
పిక్టోరియలిజం 1885 నుండి 1915 వరకు ఉద్యమంగా వర్థిల్లిననూ 1940 వరకూ ఈ కళని ప్రచారం చేసినవారూ లేకపోలేదు. ఒక ఛాయాచిత్రం కేవలం వాస్తవాన్ని నమోదు చేయుటకు మాత్రమే ఉపయోగపడుతుంది అనే విమర్శనాత్మక ప్రస్తావనను వ్యతిరేకిస్తూ ఉద్భవించిన పిక్టోరియలిజం ఫోటోగ్రఫిని ఒక కళగా గుర్తించి అంతర్జాతీయ ఉద్యమంగా రూపుదిద్దుకొన్నది. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా చిత్రకారులు, ఛాయాచిత్రకారులు, కళావిమర్శకులు వ్యతిరేక అభిప్రాయాలతో చర్చించిన తర్వాత పిక్టోరియల్ ఛాయాచిత్రాలను పలు కళా ప్రదర్శనశాలలు కైవసం చేసుకొన్నాయి (అనగా పిక్టోరియలిజం కళగానే గుర్తించబడినది).
1920 తర్వాత పిక్టోరియలిజం యొక్క ఆదరణ క్రమంగా తగ్గిపోయింది. పూర్తిగా కనుమరగవకున్ననూ రెండవ ప్రపంచ యుద్ధం పిక్టోరియలిజానికి చరమగీతం పాడినది. యుద్ధం తర్వాతి కాలంలో మరింత స్పష్టత కలిగిన (sharp focus) మాడర్నిజం అనే శైలి జనాదరణకి నోచుకొన్నది. 20వ శతాబ్దానికి చెందిన పలు ఛాయాగ్రహకులు మొదట పిక్టోరియలిస్టులుగా వారి ఉద్యోగాలని ప్రారంభించిననూ, కాలానుగుణంగా స్పష్టత గల ఛాయాచిత్రాల వైపు మళ్ళారు