నెల్సన్ మండేలా
దక్షిణాఫ్రికా అధ్యక్షుడు / From Wikipedia, the free encyclopedia
నెల్సన్ రోలిహ్లాహ్లా మండేలా (18 జూలై, 1918 - డిసెంబరు 5, 2013) దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు. ఆ దేశానికి పూర్తి స్థాయి ప్రజాస్వామ్యంలో ఎన్నికైన మొట్టమొదటి నాయకుడు.
అధ్యక్షుడు కాకముందు ఇతను జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమ కారుడు, ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (African National Congress) కు, దానికి సాయుధ విభాగం అయిన "ఉంకోంటో విసిజ్వే"కు అధ్యక్షుడు. జాతి వివక్షకు వ్యతిరేకంగా జరిపిన పోరాటంలో జరిగిన ఒక మారణకాండకు సంబంధించి 27 సంవత్సరాల పాటు "రోబెన్" అనే ద్వీపంలో కారాగార శిక్షననుభవించాడు. 20వ శతాబ్దపు అత్యంత ప్రసిద్ధులైన ప్రపంచ నాయకులలో ఒకడు. నల్లజాతి సూరీడు అని పలు తెలుగు వ్యాసాలలో ఈయన గురించి వర్ణించారు. జాతి వివక్షకు వ్యతిరేకంగా జరిపే పొరాటాలకు, వర్ణ సమానతకు నెల్సన్ మండేలా సంకేతంగా నిలిచాడు.
1990 ఫిబ్రవరి 11లో కారాగారం నుండి విడుదల అయిన తరువాత నెల్సన్ మండేలా రాజకీయంగా తన లక్ష్యాన్ని సాధించడానికి, దేశంలో నెలకొన్న జాతి వైర్యాన్ని నివారించడానికి, అందరి మధ్య సయోధ్య పెంచడానికి కృషి చేశాడు. తన పూర్వపు ప్రతిస్పర్థుల నుండి కూడా ప్రశంసలు అందుకొన్నాడు. వందకు పైగా పురస్కారాలు, సత్కారాలతో వివిధ దేశాలు, సంస్థలు మండేలాను గౌరవించాయి. వాటిలో 1993లో లభించిన నోబెల్ శాంతి బహుమతి ముఖ్యమైనది. స్వదేశంలో మండేలాను మదిబా అని వారి తెగకు సంబంధించిన గౌరవసూచకంతో మన్నిస్తారు.
మహాత్మా గాంధీ బోధించిన శాంతియుత విధానాలు, అహింస, శత్రువును సంస్కారయుతంగా ఎదుర్కొనే పద్ధతి తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని మండేలా పెక్కుమార్లు చెప్పాడు. భారత దేశం మండేలాను 1990 లో 'భారత రత్న', జవహర్లాల్ నెహ్రూ అంతర్జాతీయ సయోధ్య బహుమతులతో సత్కరించింది. భారత దేశం నుండి మండేలాకు ఎంతో సమర్థన లభించింది. ప్రపంచవ్యాప్తంగా అణచివేతకు వ్యతిరేకంగా పోరాడే కోట్ల మంది ప్రజలకు మండేలా ఒక ప్రతీకగా మారారు. పశ్చిమ దేశాలు కూడా హక్కుల ఉద్యమ కారులైన అబ్రహం లింకన్, మార్టిన్ లూథర్కింగ్లతో సమానంగా ఆయన్ను గౌరవిస్తున్నాయి. హింసా మార్గంలో ప్రారంభించిన ఉద్యమాన్ని గాంధేయ మార్గంలోకి ఆయన మలచుకున్న తీరు ఆయనకు దక్షిణాఫ్రికా గాంధీగా పేరు తెచ్చింది. నోబెల్ శాంతి బహుమతితో అంతర్జాతీయ సమాజం ఆయన్ను గౌరవించుకోగా, 1990లో అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇచ్చి భారతీయ సమాజం గౌరవించింది. మండేలా 2013 డిసెంబరు 5 న మరణించారు. మండేలా మానవతకే స్ఫూర్తి ప్రదాతని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొనియాడారు. దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా మృతికి గౌరవసూచకంగా కేంద్ర ప్రభుత్వం ఐదు రోజుల సంతాపదినాలు ప్రకటించింది.