From Wikipedia, the free encyclopedia
దేవ్ఘర్ జార్ఖండ్ రాష్ట్రం, సంతాల్ పరగణా, దేవ్ఘర్ జిల్లా లోని పట్టణం. ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. ఇది హిందువుల పుణ్యక్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన బైద్యనాథ్ ఆలయం ఇక్కడే ఉంది. నగరంలోని పవిత్ర దేవాలయాల కారణంగా ఇది తీర్థయాత్రా స్థలంగా ప్రసిద్ది గాంచింది.
దేవ్ఘర్ అంటే దేవతల ('దేవ్') నివాసం ('ఘర్'). దేవ్ఘర్ను "బైద్యనాథ్ ధామ్", "బాబా ధామ్", "బి.దేవ్ఘర్" అని కూడా అంటారు. సంస్కృత గ్రంథాలలో దీన్ని హరితకివన్ లేదా కేతకివన్ అని ఉదహరించారు. దేవ్ఘర్ అనే పేరు ఇటీవలి మూలానికి చెందినదిగా కనిపిస్తోంది. బహుశా బైద్యనాథ దేవాలయం నుండి వచ్చి ఉంటుంది. దేవాలయ నిర్మాణకర్త పేరు తెలియనప్పటికీ, ఆలయ ముందు భాగం యొక్క కొన్ని భాగాలను 1596 లో గిద్దూర్ మహారాజా పూర్వీకుడు పూరణ్ మల్ నిర్మించినట్లు చెబుతారు. దేవ్ఘర్ శివుని పూజించే ప్రదేశం. శ్రావణ మాసంలో చాలా మంది భక్తులు సుల్తాన్గంజ్ నుండి దేవ్ఘర్కు పూజ కోసం గంగా జల్ తీసుకెళ్తారు.[2]
దేవ్ఘర్ను బైద్యనాథ ధామ్ అని కూడా పిలుస్తారు, ఇది ఒక ముఖ్యమైన హిందూ యాత్రా స్థలం. ద్వ్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఇదొకటి. శ్రావణమాసంలో జరిగే శ్రావణ మేళాకు ప్రసిద్ధి చెందింది. శ్రీశైలం లాగా, జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలిసి ఉన్న అతికొద్ది ప్రదేశాలలో ఒకటి. ప్రతి సంవత్సరం జూలై ఆగస్టు లలో (శ్రావణ మాసం సందర్భంగా) జరిగే దేవ్ఘర్ యాత్రలో, భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి సుమారు 70 - 80 లక్షల మంది భక్తులు సుల్తాన్గంజ్ వద్ద గంగానది నుండి పవిత్ర జలాన్ని తీసుకువచ్చి దేవ్ఘర్లో శివుడికి అభిషేకం చేస్తారు. ఇది దేవ్ఘర్ నుండి దాదాపు 108 కి.మీ. (67 మై.) దూరంలో ఉంది. ఆ నెలలో, కాషాయ వస్త్రాలు ధరించిన భక్తులతో ఈ 108 కి.మీ. దారి నిండిపోతుంది. ఇది ఆసియాలో పొడవైన మేళా.[2]
దేవ్ఘర్ 24.48°N 86.7°E వద్ద,[3] సముద్రమట్టం నుండి సగటున 255 మీటర్ల ఎత్తున ఉంది. ఇది గోండ్వానాలో భాగం.[4] దేవ్ఘర్ అజయ్ నది ఒడ్డున ఉంది. ఈ నది బీహార్లోని జమూయి జిల్లాలోని బాట్పార్ గ్రామంలో ఉద్భవించింది. నగరం చుట్టూ దిగ్రియా పహాడ్, నందన్ పహాడ్, త్రికూటి పహాడ్, తపోవన్ పహాడ్ వంటి చిన్న చిన్న అవశేష కొండలు ఉన్నాయి . దిగ్రియా పహాడ్ నగరపు పశ్చిమ సరిహద్దున ఉంది. ఈ కొండలపై ఒక జాతీయ ఉద్యానవనాన్ని నిర్మించారు. నందన్ పహాడ్ పిల్లల వినోద ప్రదేశం. నగరంలో ప్రధాన వినోద ప్రదేశాలలో ఒకటి.[5]
2011 భారత జనగణన ప్రకారం, దేవ్ఘర్ జనాభా 2,03,123. ఇందులో 107,997 (53%) పురుషులు, 95,126 (47%) మహిళలు. 0-6 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లల సంఖ్య 2,689 (13%). దేవ్ఘర్లో అక్షరాస్యుల సంఖ్య 1,76,230 (ఆరేళ్ళకు పైబడిన వారిలో అక్షరాస్యత 85.68%).[6]
2001 జనగణన ప్రకారం, దేవ్ఘర్ జనాభా 98,372. జనాభాలో పురుషులు 55%, మహిళలు 45% ఉన్నారు. దేవ్ఘర్ సగటు అక్షరాస్యత 76%. ఇది జాతీయ సగటు 59.5%కంటే ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 82%, స్త్రీల అక్షరాస్యత 69%. దేవ్ఘర్లో, 12% జనాభా 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు.[7]
దేవ్ఘర్ విమానాశ్రయం 2018 నుండి నిర్మాణంలో ఉంది.[8] 2021 నాటికి అక్కడ సేవలు మొదలు కాలేదు.[9]
జసిదిహ్ జంక్షన్ దయోఘర్కు అత్యంత సమీపంలో ఉన్న ప్రధాన రైలు స్టేషను. ఇది ఢిల్లీ-పాట్నా-కోల్కతా రైలు మార్గంలో ఉంది.
దేవ్ఘర్ జంక్షన్ నగరంలో ఉన్న రైల్వే స్టేషన్. ఇది జసిదిహ్-దుమ్కా-రాంపూర్హాట్ & జసిదిహ్-బంకా-భాగల్పూర్ లైన్లో ఉంది. రాంచీ, దుమ్కా, రాంపూర్హాట్, ముంగేర్, భాగల్పూర్, బంకా, అగర్తలా మొదలైన ప్రాంతాలకు రైళ్లు ఉన్నాయి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.