తెనాలి రామకృష్ణుడు
తెలుగు కవి / From Wikipedia, the free encyclopedia
తెనాలి రామకృష్ణుడు శ్రీ కృష్ణదేవరాయలు ఆస్థానములోని కవీంద్రులు. స్మార్తం శాఖలోని నియోగి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. అష్టదిగ్గజములలో సుప్రసిద్ధులు. ఈయనని తెనాలి రామలింగ కవి అని కూడా అంటారు. అవిభాజ్య విజయనగర సామ్రాజ్య చరిత్రలో ఈయన ప్రముఖులు. తొలుత సాధారణ వ్యక్తి అయిన రామకృష్ణులు, కాళీమాత వర ప్రసాదం చేత కవీశ్వరులయ్యారు. గొప్ప కావ్యాలు విరచించారు. కానీ తెలుగు వారికి ఆయన ఎక్కువగా హాస్య కవిగానే పరిచయం. ఆయనకు వికటకవి అని బిరుదు ఉంది (ఇక్కడ, వికటత్వం అంటే ఉదారత అని అర్ధం కూడా వచ్చును). ఆయనపై ఎన్నో కథలు ఆంధ్ర దేశమంతా ప్రాచుర్యములో ఉన్నాయి.మొదట్లో రామకృష్ణుడి ఇంటి పేరు గార్లపాటి అని, తెనాలి నుండి వచ్చారు కనుక తరువాతి కాలంలో తెనాలి అయినది అని ఒక నానుడి. సత్తెనపల్లి మండలంలోని లక్కరాజుగార్లపాడు గ్రామానికి చెందిన గార్లపాటి రామయ్య, లక్ష్మాంబల సంతానం రామలింగయ్య. ఆయన తాత సుదక్షణా పరిణయం రాసిన అప్పన్న కవి. వీరికి ఇద్దరు సోదరులు వరరాఘవకవి, అన్నయ్య. రామకృష్ణుడి స్వస్థలం తెనాలి. ఇదే గ్రామాన్ని ఆయన అగ్రహారంగా పొందినాడు.[1] రామలింగయ్య తాత, ముత్తాతలు గార్లపాడు లోనే నివసించారు. ప్రస్తుతం గ్రామ బొడ్రాయి ప్రతిష్ఠించిన ప్రాంతంలోనే రామకృష్ణుల వారి ఇల్లు ఉండేదని గ్రామస్తుల నమ్మకం. సా.శ. 1514 నుంచి 1575 వరకు రామలింగయ్య జీవించారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించడంతో మేనమామ తెనాలి అగ్రహారమైన తూములూరుకు తీసుకువెళ్లారు. అక్కడే వారి సంరక్షణలో విద్యాబుద్ధులు నేర్చుకున్నారు.
తెనాలి రామకృష్ణుడు | |
---|---|
జననం | 16వ శతాబ్దం |
మరణం | హంపి |
ఇతర పేర్లు | తెనాలి రామలింగ కవి |
వృత్తి | కవీశ్వరులు |
ప్రసిద్ధి | వికటకవి, అష్టదిగ్గజాలలో ఒకరు |
పదవి పేరు | శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన కవి |
పదవీ కాలం | 15వ శతాబ్దం |
మతం | శ్రౌత శైవం |
తల్లి | లక్ష్మమ్మ |