టైటానిక్ నౌక
1912 లో తయారు చేయబడిన బ్రిటిష్ ప్రయాణిక నౌక / From Wikipedia, the free encyclopedia
టైటానిక్ నౌక, "వైట్ స్టార్ లైన్" అనే సంస్థ కోసం "హర్లాండ్ అండ్ వోల్ఫ్" అనే నౌకా నిర్మాణ సంస్థ తయారు చేసిన మూడు నౌకల్లో ఒకటి. 1912లో దానిని మొదటిసారిగా ప్రవేశ పెట్టినపుడు ప్రపంచంలో కెల్లా అదే అతి పెద్ద ప్రయాణ నౌక. దాని మొదటి ప్రయాణంలోనే ఏప్రిల్ 14, 1912 వ తేదీన ప్రమాదవశాత్తూ ఒక మంచు కొండను ఢీకొని సముద్రంలో మునిగిపోయింది. 1517 మంది ప్రజలు మృత్యువాత పడ్డారు. దీనివలన ఇది అపకీర్తిని మూటగట్టుకోవడమే కాకుండా, చరిత్రలో అత్యంత దురదృష్టకరమైన సంఘటనలలో ఒకటిగా మిగిలిపోయింది.
దీని నిర్మాణంలో అప్పట్లో ఉండే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వలన అది మునిగి పోవడం అసాధ్యం అని జనాలు నమ్మేవారు. కానీ ఎంత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినా, ఎంతమంది అనుభవజ్ఞులైన సిబ్బంది ఉన్నా, అది అలా మునిగిపోయి అపార ప్రాణనష్టాన్ని కలిగించడం చాలామందిని దిగ్భ్రాంతికి గురిచేసింది. టైటానిక్ బాధితుల గురించి మాధ్యమాల ప్రచారం, నౌకలో జరిగినట్లుగా చెబుతున్న ప్రధాన సంఘటనలు, ఈ సంఘటన పర్యవసానంగా కొత్తగా ప్రవేశపెట్టబడిన నౌకాయాన న్యాయ నియమాలు, 1985లో రాబర్ట్ బల్లార్డ్ నేతృత్వంలో కనుగొనబడిన టైటానిక్ అవశేషాలు, ఈ నౌకకు అత్యంత ప్రాముఖ్యతను సంపాదించి పెట్టాయి.