చిత్రలేఖనం
From Wikipedia, the free encyclopedia
ఒక ఉపరితలం పై చిత్రాలని గీయటం, ఆ చిత్రాలకి వివిధ రకాలైన రంగులని అద్దటమే చిత్రలేఖనం [1]. దృశ్యపరమైన భాషలో కొలవదగిన ఒక ఉపరితలం పై కొన్ని కళా సౌందర్య ప్రమాణాలను పాటిస్తూ, భావాలను ఆలోచనలను వ్యక్తపరచటమే చిత్రలేఖనం[2]. ఉపరితలం పై రంగుని అద్దటానికి సాధారణంగా కుంచెలని ఉపయోగించిననూ చిత్రలేఖనానికై ప్రత్యేకంగా రూపొందించిన కత్తులు (knives), స్పాంజీ (sponge), రంగుని వెదజల్లే ఎయిర్ బ్రష్ (airbrush) లని కూడా వాడుతారు. ఉపరితలంగా గోడలు, కాగితం, వస్త్రం, కలప, గాజు, బంకమట్టి, పత్రాలు (ఆకులు), రాగి, ఇసుక లేదా కాంక్రీటు మిశ్రమాలని వాడుతారు. చిత్రాలని గీసేవారిని, వాటికి రంగులనద్దేవారిని, చిత్రకారులు అంటారు.
దృశ్యకళ (Visual Arts) లో చిత్రలేఖనానికి తగు ప్రాముఖ్యత ఉంది. చిత్రపటాన్ని గీయటం, కూర్పు లే కాకుండా, సంజ్ఞ, కథనం, నైరూప్యం చిత్రలేఖనంలో కీలక పాత్రలు పోషిస్తాయి. సహజత్వం, ప్రాతినిధ్యం, ఛాయాచిత్రం, నైరూప్యం, కథనం, ప్రతీకాత్మకం, భావోద్రిక్తం లేదా రాజకీయం: చిత్రలేఖనంలో ప్రధాన వర్గాలు.
చిత్రలేఖనం ఊహకి రూపాన్ని ఇచ్చే ఒక చక్కని సాధనం. ఈ కళకు పరిమితులు లేవు. చిత్రలేఖనానికి వివిధ రూపాలు ఉన్నాయి. సహజత్వాన్ని ప్రతిబింబించే చిత్రలేఖనం (painting) ఒక వైపు అయితే కల్పిత లోకాలలో విహరించేది మరొక వైపు. భావ వ్యక్తీకరణ, మానవ చరిత్ర, సంప్రదాయాలు, జీవనశైలి, వ్యవస్థ ఇలా దేనినైనా ఆవిష్కరించగలిగే చిత్రలేఖనం, మానవుని అభివృద్ధిలో కీలకమైన కళ.చిత్రలేఖన చరిత్రలో కొంత భాగాన్ని ఆధ్యాత్మిక భావాలే నడిపించాయని చెప్పవచ్చును. పాశ్చాత్య దేశాలలో క్రైస్తవ ప్రార్థనాలయాల పైకప్పులు క్రీస్తు జీవిత చరిత్రలోని ఘట్టాలతోను, తూర్పు దేశాలలో అనేక చిత్రలేఖనాలు బుద్ధుని చిత్రపటాలతోను చిత్రీకరించారు.