కనకధారా స్తోత్రం
వ్యసవివరణ / From Wikipedia, the free encyclopedia
వికీసోర్స్లో కనకథారా స్తవం పూర్తి పాఠం, అర్ధం చదువవచ్చును.
కనకథారా స్తోత్రం లేదా కనకథారా స్తవం లేదా సువర్ణ ధారా స్తోత్రం, శ్రీ మహాలక్ష్మీ దేవిని కీర్తిస్తూ ఆది శంకరాచార్యులు రచించిన సంస్కృత స్తోత్రం. సకలసంపత్ప్రదాయకమని ఈ స్తోత్రం పారాయణ పట్ల భక్తులకు విశ్వాసం ఉండడం వలన, ఈ స్తోత్రంలోని పద, భావ సౌందర్యం వలన అత్యంత ప్రాచుర్యం కలిగిన లక్ష్మీదేవి ప్రార్థనలలో ఇది ఒకటి. ఈ స్తోత్రం మార్కెట్లో అనేక అడియో సి.డి.లు, క్యాసెట్టులు ద్వారా లభిస్తుంది.
ఈ స్తోత్రం ఆవిర్భావం గురించి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ఒకనాడు శంకరాచార్యుల వారు ఒక ఇంటికి బిక్షకు వెళ్ళారు. భిక్ష వేయడానికి ఆ ఇంట ఏమీ ఆహారపదార్ధాలు లేవు. ఇంటి ఇల్లాలు నిరు పేదరాలు. ఆమెకి కట్టుకోడానికి సరైన వస్త్రాలు కూడా లేవు. ఇల్లంతా వెతికిన ఆమెకి ఎలాగో ఒక ఉసిరికాయ లభించింది. ధర్మపరురాలైన ఆ ఇల్లాలు తలుపు చాటునుండే ఉసిరికాయను శంకరునికి సమర్పించింది. పరిస్థితి గ్రహించిన శంకరుడు లక్ష్మీదేవిని స్తుతిస్తూ కనకథారాస్తవము చెప్పగా ఆ పేదరాలి యింట బంగారు ఉసిరికాయలు వర్షించాయి.
సంప్రదాయం ప్రకారం సాధారణంగా అన్ని ప్రార్థనల, స్తోత్రాలలాగానే ఈ స్తోత్రాన్ని భక్తితో, నియమ నిష్ఠలతో పారాయణం చేయాలి. ఫలితాన్ని ఆశించినవారు సాధారణంగా పెద్దల సలహాను తీసికొని, రోజుకు ఇన్నిమార్లు, ఇన్ని రోజులు అని పారాయణ చేస్తారు. స్తోత్రానికి ముందుగా ప్రార్థన, పూజ వంటి కార్యక్రమాలు, స్తోత్రం అనంతరం నైవేద్యం, హారతి, తీర్ధ ప్రసాద వితరణ వంటి ఉపచారాలు చేస్తారు. దేవాలయాలలో అర్చనలో కూడా ఈ స్తోత్రాన్ని పఠిస్తారు.