ఎల్.విజయలక్ష్మి
సినీ నటి / From Wikipedia, the free encyclopedia
ఎల్.విజయలక్ష్మి 1960వ దశకములోని తెలుగు సినిమా నటి, భరతనాట్య కళాకారిణి. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషలలో వందకు పైగా సినిమాలలో నటించింది.
ఎల్.విజయలక్ష్మి | |
---|---|
![]() పరమానందయ్య శిష్యులకథ చిత్రంలో రాజనర్తకి రంజని పాత్రలో ఎల్.విజయలక్ష్మి | |
జననం | 1943 |
ఇతర పేర్లు | విజయలక్ష్మి దే దత్తా |
వృత్తి | సినిమా నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1961–1969 |
జీవిత భాగస్వామి | సురజిత్ కుమార్ దే దత్తా |
పిల్లలు | రాజ్ దే దత్తా (కొడుకు) |
బంధువులు | సంగీత దే దత్తా (కోడలు) |
ఈమెకు నాట్యం అంటే ఎంతో ఆసక్తి. ఈమె సరైన భరతనాట్యం గురువు కోసమే, వీరి కుటుంబం పూణే నుండి చెన్నై తరలి వచ్చింది. త్వరగా నేర్చుకునే చురుకుదనం ఉన్న విజయలక్ష్మి అనతికాలంలోనే చక్కని నాట్యకళాకారిణిగా తీర్చిదిద్దుకుంది. ఈమె ఆరంగేట్రానికి, తనకు స్ఫూర్తినిచ్చిన నాట్యకళాకారిణి కుమారి కమల కూడా హాజరైంది. ఈమె నాట్యం చూసి ఈమెకు తొలిసారిగా తెలుగు సినిమాలలో నటించే అవకాశం వచ్చింది. ఆ తరువాత తమిళంలో కూడా నటించే అవకాశాలు వచ్చాయి.
1960వ దశకపు చివర్లో వచ్చిన ఈటి వరై ఉరవు ఈమె చివరి చిత్రం. ఆ చిత్ర నిర్మాణ సమయంలో విజయలక్ష్మి సోదరుని స్నేహితుడు, విజయలక్ష్మి ఫోటోను చూసి ఆమెను ప్రేమించాడు. పెళ్ళి ప్రతిపాదన చేశాడు. అందుకు విజయలక్ష్మి తల్లితండ్రులు అంగీకరించడంతో 1969లో మనీలాలో పనిచేస్తున్న వ్యవసాయ శాస్త్రజ్ఞుడు సురజిత్ కుమార్ దే దత్తాను పెళ్ళిచేసుకొని మనీలాలో స్థిరపడింది. మనీలాలో ఖాళీ సమయంలో చేసేదేమి లేక వ్యవసాయశాస్త్రంలో ఉన్నత చదువులు ప్రారంభించింది.[1]
విజయలక్ష్మి 1991లో అమెరికాలో స్థిరపడి, అకౌంటింగ్ విద్యను అభ్యసించి ప్రస్తుతం అమెరికాలోని వర్జీనియా పాలిటెక్నిక్ విశ్వవిద్యాలయంలో బడ్జెటింగ్ అధికారిగా పనిచేస్తున్నది.[2]
తెనాలిలో జరుగుతున్న ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా 2022 అక్టోబరు నెల 30, 31 తేదీల్లో ఎల్.విజయలక్ష్మి పాల్గొన్నారు. ఆమెకు ఎన్టీఆర్ స్మారక పురస్కారం బహుకరించారు.[3]