From Wikipedia, the free encyclopedia
హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు రాయలసీమ ప్రాంతంలో పొడవైన కాలువ. శ్రీశైలం జలాశయం నుండి వరద నీటిని మళ్ళించి, సాగునీరు, తాగునీటిని అందించడానికి ఈ ప్రాజెక్టును రూపొందించారు.[1][2]
హంద్రీ నీవా సుజల స్రవంతి | |
---|---|
స్థానం | |
దేశం | భారతదేశం |
భౌతిక లక్షణాలు | |
మూలం | శ్రీశైలం జలాశయం |
• స్థానం | 15°54′31″N 78°14′08″E |
• ఎత్తు | 253 మీ. (830 అ.) |
సముద్రాన్ని చేరే ప్రదేశం | మల్యాల |
పొడవు | 569 కి.మీ. (354 మై.) |
ప్రవాహం | |
• స్థానం | అడివిపల్లి |
• సగటు | 164.8 m3/s (5,820 cu ft/s) |
కాలువ మొదటి దశ మల్యాల వద్ద మొదలై, రాయలసీమలోని నాలుగు జిల్లాల్లోనూ పారుతుంది. మొత్తం ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తోంది. రెండవ దశలో చిత్తూరు జిల్లాకు సాగునీటి సౌకర్యాలు తాగునీటిని అందిస్తుంది.[3] ఈ కాలువ రాయలసీమ ప్రాంతం లోని హంద్రీ, పెన్నా, చిత్రావతి, పాపాగ్ని, మాండవ్య, చెయ్యేరు, గార్గేయ, వేదవతి, పాలార్ వంటి అనేక చిన్న నదులను కలుపుతుంది. ఈ కాలువ కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లో పారుతోంది.[1] ఈ కాలువ ఈ ప్రాంతంలోని అనేక జలాశయాలు, చెరువులకు నీరు అందిస్తుంది. ఈ ప్రాంత తాగు, సాగునీటి అవసరాలకు 50 టీఎంసీల కంటే ఎక్కువ నీరు అవసరం.
ఈ ప్రాజెక్టును 19వ శతాబ్దం చివరి లోనే ఆంగ్లేయుడు సర్ ఆర్థర్ కాటన్ రూపొందించాడు.[4] అయితే, 1980లు, 1990లలో ఎన్.టి రామారావు హయాంలో మాత్రమే డిజైన్లను ఖరారు చేసారు.[5] 2004 లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా బడ్జెట్ కేటాయింపులు మొదలయ్యాయి.[6]
ప్రాజెక్టు మొదటి దశ నిర్మాణం 2005 లో మొదలైంది.[7][8] కృష్ణా నది నుండి మిగులు జలాలను ఉపయోగించుకునేలా దీన్ని రూపొందించారు.[1][8] అయితే, ఈ మిగులు జలాలు ఆధరపడదగ్గవి కావు. వీటితో కరువు పీడిత రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు నికరమైన నీటి కేటాయింపును నిర్ధారించలేరు. రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్లు ఓవైపు ఉండగా,[7] కృష్ణా నదీ తీర రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య నదీ జలాల పంపిణీపై వివాదం నెలకొంది.[9]
లిఫ్టు ద్వారా నీటిని పంపిణీ చేసే ఈ కాలువ పొడవు దాదాపు 550 కి.మీ. ఈ కాలువ మల్యాల వద్ద శ్రీశైలం జలాశయం వెనుక జలాల నుండి మొదలై, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లోని అనేక లిఫ్టులు, పంపింగ్ స్టేషన్ల ద్వారా చిత్తూరు జిల్లాలోని ఎత్తైన ప్రాంతాల వరకు వెళ్తుంది.[10] ఈ కాలువ ద్వారా వెళ్ళే నీటితో సాగునీరు, తాగునీరు కోసం అనేక చెరువులు నిండుతాయి. ఈ ప్రాజెక్టు ద్వారా ఏటా దాదాపు 40 టీఎంసీల నీటిని కృష్ణానది నుంచి తీసుకోనున్నారు.
మల్యాల పంప్ హౌస్ కనీస డ్రా డౌన్ స్థాయి, సముద్ర మట్టం నుండి 830 అడుగులు (253 మీ.).[11] కాలువ పైన నిర్మించిన అనేక లిఫ్టులలో, పంపులను నడిపేందుకు అవసరమైన విద్యుత్తు సామర్థ్యం 653 మెగావాట్లు కాగా, వార్షికంగా అయ్యే విద్యుతు వినిమయం 1900 కోట్ల యూనిట్లు. ఈ విద్యుత్తుతో దాదాపు 30 టిఎంసిల నీటిని పంపు చేస్తారు.
శ్రీశైలం నుంచి జీడిపల్లి జలాశయం వరకు కాలువ మొదటి దశ (220 కిలోమీటర్ల పొడవు) పూర్తయింది. ఈ జలాశయం అనంతపురం జిల్లాలోని చిన్నముష్టూరు గ్రామంలో ఉంది. మొదటి దశలో కృష్ణగిరి (కర్నూలు జిల్లా), పత్తికొండ (కర్నూలు జిల్లా), జీడిపల్లి (అనంతపురం జిల్లా) ల వద్ద 3 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను నిర్మించారు.
రెండవ దశ చిత్తూరు జిల్లాలోని అడివిపల్లి జలాశయం వరకు ప్రధాన కాలువ (349 కిలోమీటర్ల పొడవు) 75% పూర్తయింది. పూర్తి సామర్థ్యం వద్ద ఈ కాలువ ద్వారా 404,500 ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. ఈ ప్రాంతంలోని 293 గ్రామాలలో 23 లక్షల మందికి త్రాగునీరు అందిస్తుంది, ఇందుకోసం 26 టీఎంసీల నీటిని మడకశిర, పుంగనూరు, నీవా ఉప కాలువల ద్వారాను, ఆత్మకూరు, తంబళ్లపల్లి, వాయల్పాడు డిస్ట్రిబ్యూటరీల ద్వారానూ మళ్లిస్తారు. రెండవ దశలో ఈ కాలువ ద్వారా అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలలోని ఆరు జలాశయాలు - వెలిగల్లు జలాశయం, గొల్లపల్లి జలాశయం (అనంతపురం), చెర్లోపల్లి జలాశయం (అనంతపురం), మారాల జలాశయం (అనంతపురం), శ్రీనివాసపురం జలాశయం (కడప), అడివిపల్లి జలాశయాలను (చిత్తూరు) నింపుతారు.
హంద్రీ-నీవా గురుత్వాకర్షణ శక్తితో తుంగభద్ర హై లెవల్ కెనాల్, పెన్నా నది పరీవాహక ప్రాంతంలోని అనేక ఇతర మధ్య రకం, చిన్న చెరువులకు తీవ్ర కరువు సమయంలో కూడా త్రాగునీటిని అందించగలదు. ఈ కాలువ భైరివాని తిప్ప జలాశయం, అనంతపురం జిల్లాలోని కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో ఉన్న ఇతర మధ్యస్థ, చిన్న నీటిపారుదల ట్యాంకులకు కూడా నీటిని అందిస్తుంది. ఈ విధంగా, బచావత్ ట్రిబ్యునల్ అవార్డు కేటాయింపుల కింద దాదాపు 45 Tmcft కృష్ణా నీటిని పొందే ప్రధాన, మధ్యస్థ, చిన్న నీటిపారుదల ప్రాజెక్టులకు కృష్ణా నది నీటిని అందించడానికి ఈ కాలువ ప్రత్యామ్నాయ వనరుగా కూడా పనిచేస్తుంది.
శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం కనీస డ్రా డౌన్ లెవల్ కంటే తక్కువగా ఉన్నప్పుడు కూడా తాగునీటి అవసరాలను తీర్చడానికి గాను, సుంకేశుల బ్యారేజీ నుండి కెసి కెనాల్ ద్వారా వచ్చిన నీటిని గ్రావిటీ ద్వారా హంద్రీ నీవా కాలువ పంప్ హౌస్కు అందించవచ్చు.
ముచ్చుమర్రి వద్ద ఉన్న అనుబంధ పంప్ హౌస్కు శ్రీశైలం జలాశయం నుండి 800 అడుగులు (244 మీ.) వద్ద నీటిని తీసుకుంటుంది. పైప్లైన్లు, కాలువలతో కూడిన ఈ పంప్ హౌస్ నుండి వర్షాభావం ఉన్న వానాకాలంలో కూడా డెడ్ స్టోరేజీ నీటి నుండి హంద్రీ నీవా లిఫ్ట్ కాలువకూ, మల్యాల పంప్ హౌస్తో పాటు సమీపంలోని కెసి కెనాల్కూ నీటిని పంపించవచ్చు.[11][12]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.