తెలుగు రచయిత From Wikipedia, the free encyclopedia
శాంతి నారాయణ అనంతపురం జిల్లాకు చెందిన ప్రముఖ రచయిత.
ఇతడు అనంతపురం జిల్లా, బండమీదపల్లె గ్రామంలో కేశమ్మ, వెంకటస్వామి దంపతులకు 1946, జూలై 1న జన్మించాడు.[1] సింగనమలలో హైస్కూలు విద్యాభ్యాసం ముగించాడు. తిరుపతిలోని ఓరియెంటల్ కళాశాలలో విద్వాన్ చదివాడు. తరువాత ఎం.ఎ., పి.హెచ్.డిలు చేశాడు. విద్వాన్ పూర్తి అయిన పిదప తెలుగు పండితుడిగా రాయదుర్గం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పదకొండు సంవత్సరాలు పనిచేసి అదే కళాశాలలో మరో పది సంవత్సరాలు జూనియర్ లెక్చరర్గా పనిచేశాడు. తరువాత పదోన్నతి పొంది అనంతపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1992 నుండి 2001వరకు పనిచేశాడు. 2001లో కొంతకాలం ప్రిన్సిపాల్గా సేవలను అందించాడు. 2001 సెప్టెంబరు నుండి అనంతపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసి 2004 జూన్ 30వ తేదీన పదవీవిరమణ చేశాడు.
ఇతడు విద్వాన్ చదివే సమయంలో పద్యరచనపట్ల ఆకర్షితుడై అవధానాలు చేయడం ప్రారంభించాడు. మొట్టమొదటి అవధానం 1966లో సింగనమలలో చదువుకున్న పాఠశాలలో చేశాడు. తరువాత కణేకల్, బుక్కపట్నం, కనగానపల్లె, అనంతపురం, రాయదుర్గం మొదలైన ప్రాంతాలలో 1978 వరకు సుమారు 12 అష్టావధానాలు చేశాడు. భువనవిజయ సభలలో అయ్యలరాజు రామభద్రకవిగా, పింగళి సూరనగా పాత్రలను పోషించి సభలను రంజింపజేశాడు. ఆశావాది ప్రకాశరావు, షేక్ దరియా హుసేన్లు ఇతనికి సన్నిహిత సాహితీమిత్రులు. సుమారు ఒక దశాబ్దకాలం పద్యకవిసమ్మేళనాలలో పాల్గొనడం, అవధానాలు చేయడం వంటివి చేశాడు. తర్వాత కథాసాహిత్యం వైపు మొగ్గుచూపాడు. ఇతడు అనేక సాహిత్య సభలు, సమావేశాలలో వివిధ విషయాలపై ప్రసంగాలు చేశాడు. ఆకాశవాణి కడప, విశాఖపట్నం, అనంతపురం, తిరుపతి కేంద్రాలనుండి అనేక ప్రసంగాలు, కథానికలు ఇతనివి ప్రసారం అయ్యాయి. అనంతపురం జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శిగా, గౌరవాధ్యక్షుడిగా పనిచేశాడు. జాషువా శతజయంతి కమిటీ, సీమసాహితి, రాయలకళాగోష్ఠి, కథావేదిక, సాహితీకళాసమితి, స్పందన సాహిత్య సమితి, దళిత అధ్యయన వేదిక, అధికార భాషా సంఘం (జిల్లా యూనిట్), జన విజ్ఞానవేదిక (జిల్లా యూనిట్), అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం వంటి అనేక సంఘాలకు ప్రాతినిధ్యం వహించాడు. ఇతని సంపాదకత్వంలో రాయదుర్గం నుండి కొంతకాలం వెలుగు అనే లిఖితమాసపత్రిక వెలువడింది. ఇతని సాహిత్యంపై హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, మధురై కామరాజ్ విశ్వవిద్యాలయం, శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, గుల్బర్గా యూనివర్సిటీ, డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయము లలో 7 ఎం.ఫిల్ పరిశోధనలు, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి పరిశోధన జరిగాయి. ఇతని నవల పెన్నేటి మలుపులు శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎం.ఎ. తరగతులకు పాఠ్యాంశంగా నిర్ణయించబడింది.
ఇతడు వార్త, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, ఇండియా టుడే, ప్రజాసాహితి, ఉపాధ్యాయ, ఆహ్వానం, రచన, నేత్రం, విపుల, ఉదయం, మాభూమి, సీమసాహితి వంటి దిన, వార, మాసపత్రికలలో కథలు, వ్యాసాలు ప్రచురించాడు.
ఇతడు ప్రచురించిన పుస్తకాలు :
ఇతడు 2006లో తన భార్య విమల పేరుమీద తన వంతు సాహిత్య సేవా నిర్వహణ కోసం ఈ ట్రస్టును ప్రారంభించాడు. ఆకస్మికంగా మరణించిన తన రెండవ కుమారుడు రజనీకాంత్ పేరు మీద జాతీయస్థాయిలో తెలుగు భాషలో వెలువడిన ఉత్తమ కథా సంపుటానికి, ఉత్తమ కవితా సంకలనానికి శాంతి రజనీకాంత్ స్మారక పురస్కారాలను ఈ ట్రస్టుద్వారా ప్రతియేటా అందజేస్తున్నాడు.[5] ఈ పురస్కారాలు ఇంతవరకు వి.ఆర్.రాసాని, చల్లపల్లి స్వరూపరాణి, జి.ఆర్.మహర్షి, నేతల ప్రతాప్ కుమార్, కె.వరలక్ష్మి, తుల్లిమల్లి విల్సన్ సుధాకర్, జాతశ్రీ, సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, దర్భశయనం శ్రీనివాసాచార్య, శశిశ్రీ, కాట్రగడ్డ దయానంద్, ఆశారాజు,[6] ఎ.ఎన్.జగన్నాథశర్మ,[6] వేంపల్లె షరీఫ్, మల్లిపురం జగదీష్ తదితరులకు లభించాయి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.