మృణాళినీ సారాభాయ్
భారతీయ శాస్త్రీయ నర్తకి, కొరియోగ్రాఫర్ From Wikipedia, the free encyclopedia
మృణాళినీ సారాభాయ్, (జననం: 1918 మే 11 - మరణం: 2016 జనవరి 20) [1] భారతీయ సాంప్రదాయ నృత్యకళాకారిణి, నృత్యదర్శకురాలు, నృత్య గురువు. ఆమె "దర్పణ అకాడమీ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్"కు వ్యవస్థాపకురాలు. ఈ సంస్థలో నృత్య రీతులు, నాటకాలు, సంగీతం, పప్పెట్రీ లపై శిక్షణ నిస్తారు. ఈ సంస్థ అహ్మదాబాదులో ఉంది.[2] ఆమె చేసిన కళా సేవలకు గాను అనేక పురస్కారాలను పొందింది. ఆమె 18,000 మంది శిష్యులకు భరతనాట్యం, కథాకళి లలో శిక్షణ నిచ్చింది.[3]
జీవిత విశేషాలు
బాల్య జీవితం, విద్య
మృణాళిని కేరళ లోని మాజీ పార్లమెంట్ సభ్యులు, సామాజిక కార్యకర్త అమ్ము స్వామినాథన్ కుమార్తె. ఆమె బాల్యం స్విడ్జర్లాండ్ లో గడిచింది. ఆమె "డాల్క్రోజ్" పాఠశాలలో మొదటి పాఠాలుగా పశ్చిమాది నృత్య భంగిమలను చేర్చుకుంది.[4] ఆమె శాంతి నికేతన్లో రవీంధ్ర నాథ్ ఠాగూర్ మార్గదర్సకత్వంలో విద్యాభ్యాసం చేసింది. అచట జీవిత యదార్థాలను గ్రహించింది. తర్వాత ఆమె కొంతకాలం అమెరికా సంయుక్త రాష్ట్రాల కు వెళ్ళి అచట అమెరికన్ అకాడమీ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్స్ లో చేరింది. తర్వాత భారత దేశానికి వచ్చి ఆమె దక్షిణాది సాంప్రదాయక నృత్యం అయిన భరతనాట్యాన్ని "మీనాక్షి సుందరంపిళ్ళై" ద్వారా, కథాకళి నృత్యాన్ని "తకఘి కుంచు కురూప్" ద్వారా శిక్షణ పొందింది.
వివాహం
మృణాళిని భారతీయ భౌతిక శాస్త్రవేత్త విక్రం సారాభాయ్ను వివాహం చేసుకుంది. అతడు భారతీయ అంతరిక్ష కార్యక్రమ పితగా ప్రసిద్ధి చెందాడు. వారికి ఒక కుమారుడు కార్తికేయ సారాభాయ్, ఒక కుమార్తె మల్లికా సారాభాయ్ ఉన్నారు. కుమార్తె మల్లిక నృత్య కళాకారిణియే. మృణాళిని 1948 లో దర్పణ అనే సంస్థను స్థాపించింది. ఒక సంవత్సరం తరువాత పారిస్ లో "థియేటర్ నేషనల్ డి చైల్లోట్" లో ప్రదర్శననిచ్చింది. అక్కడ మంచి గుర్తింపు పొందింది.
విక్రం సారాభాయ్ తన భార్యకు తన కెరీర్ ను పెంపొందించుకొనుటలో సంపూర్ణ స్వాతంత్ర్యం ఇచ్చాడు. వారు సమస్యాత్మకమైన వివాహ బంధాన్ని గడిపారు.[5] జీవిత చరిత్రల రచయిత "అమృతా షా" చెప్పిన ప్రకారం విక్రం సారాభాయ్ వ్యక్తిగత జీవితాన్ని విడిచిపెట్టి విజ్ఞాన శాస్త్ర అభివృద్ధికి పూర్తిగా అంకితమయ్యాడు.
వివిధ రంగాలలో సేవలు
ఆమె సుమారు మూడు వందలకు పైగా నాటకాలకు దర్శకత్వం వహించింది. ఆమె అనేక నవలలు, కవితలు, నాటకాలు, కథలు పిల్లల కోసం వ్రాసింది. ఆమె గుజరాత్ రాష్ట్ర హాండీక్రాప్ట్స్ అండ్ హాండ్ లూం డెవలప్ మెంట్ సంస్థకు చైర్పర్సన్ గా కూడా ఉంది. ఆమె సర్వోదయ ఇంటర్నేషనల్ ట్రస్ట్ కు ఒక ట్రస్టీగా కూడా ఉన్నది. ఈ సంస్థ గాంధీ ఆశయాల ప్రోత్సాహం కోసం ఏర్పడింది. ఆమె నెహ్రూ ఫౌండేషన్ డెవలెప్ మెంట్ Archived 2012-02-23 at the Wayback Machineకు చైర్పర్సన్ గా ఉంది. ఆమె జీవిత చరిత్ర "మృణాళినీ సౌరభాయ్:ది వోయిస్ ఆఫ్ ద హర్ట్" పుస్తకం ద్వారా ప్రచురణ అయింది.
కుటుంబం
ఆమె తండ్రి డా.స్వామినాథన్ మద్రాసు హైకోర్టులో పేరు పొందిన బారిష్టరు. మద్రాసు లా కాలేజీలో ప్రిన్సిపాల్గా ఉండేవాడు. అమె తల్లి అమ్ము స్వామినాథన్ ప్రముఖ స్వాతంత్ర్యసమరయోధురాలు. మృణాళిని సోదరి డా. లక్ష్మీ సెహగల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ లోని "రాణి ఆఫ్ ఝాన్సి రెజిమెంట్" విభాగానికి కమాండర్ గా ఉండేది. ఆమె సోదరుడు "గోవింద స్వామినాథన్" మద్రాసు హైకోర్టులో పేరుమోసిన న్యాయవాది. అతడు మద్రాసు రాష్ట్ర (తమిళనాడు) కు అటార్నీ జనరల్ బాధ్యతలు కూడా నిర్వహించాడు.
అవార్డులు
మృణాళినీ సారాభాయ్ 1992 లో భారతదేశ విశిష్ట పురస్కారం పద్మభూషణ అవార్డును అందుకుంది. 1997 లో యు.కె లోని న్యూయాచ్ కు చెందిన అంగిలియా విశ్వవిద్యాలయం ఆమెకు గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది. ప్రెంచ్ ఆర్చివ్స్ ఇంటర్నేషనలాలిస్ డి లా డాన్సె నుండి డిప్లొమా, మెడల్ అందుకున్న మొదటి వ్యక్తిగా చరిత్రలో నిలిచింది. 1990 లో పారిస్ లోని ఇంటర్నేషనల్ డాన్స్ కౌన్సిల్ లో ఎగ్జిక్యూటివ్ కమిటీలో నామినేట్ చేయబడింది.[2] 1994 లో న్యూఢిల్లీ లో సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని అందుకుంది. మెక్సికో ప్రభుత్వం నుండి బంగారు పతకాన్ని పొందింది.
ఆమె స్థాపించిన దర్పణ అకాడమీ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ సంస్థ 1998 డిసెంబరు 28 న గోల్డెన్ జూబ్లీ వేడుకలను జరుపుకుంది. సాంప్రదాయిక నృత్య రంగంలో "మృణాళినీ సారాభాయ్ అవార్డ్ ఫర్ క్లాసికల్ ఎక్స్లెన్స్" అవార్డును ప్రకటించింది.[3]
మరణం
ఇన్ఫెక్షన్తో బాధ పడుతున్న మృణాళిని అహ్మదాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జనవరి 21 2016న మరణించింది.[6]
ఇవి కూడా చూడండి
ఇతర లింకులు
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.