భారత రాజ్యాంగ నిర్దేశిక సూత్రాలు From Wikipedia, the free encyclopedia
భారత రాజ్యాంగ ఆదేశిక సూత్రాలు, (ఆంగ్లం: Directive Principles). భారతరాజ్యాంగం, పౌరులకు ప్రాథమిక హక్కులను ప్రకటించింది. మరి ప్రభుత్వాలకు ఏవైనా ఆదేశాలిచ్చిందా? అవును ఆ ఆదేశాలనే ఆదేశిక సూత్రాలు అంటారు. భారత రాజ్యాంగం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని మార్గ దర్శకాలు చేసింది. ఈ మార్గదర్శకాలు లేదా ఆదేశాలు, రాజ్యాంగం ప్రకటించిన పౌరుల హక్కులైన ప్రాథమిక హక్కులు కాపాడటానికి, సవ్యంగా అమలుజరుపడానికి. పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడటం ప్రభుత్వ విధి.[1] ఇక్కడ 'ప్రభుత్వ'మనగా భారత అంతర్భాగంలో అధికారాలు గల అన్ని అంగాలు. అనగా భారత ప్రభుత్వము, భారత పార్లమెంటు, రాష్ట్రాల శాసనసభలు, ఇతర అన్ని ప్రాదేశిక ప్రభుత్వాలు. ఉదాహరణ జిల్లా పరిషత్తులు, నగర పాలికలు, పురపాలికలు, పంచాయతీలు, గ్రామ పంచాయతీలు వగైరా. ఈ ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులు, భారతదేశంలో ఆదేశిక సూత్రాలు, భారతదేశంలో ప్రాథమిక విధులు మొదలగు విషయాలతో ప్రేరితమై రూపొందింపబడినవి.
వీటి ముఖ్య ఉద్దేశాలు, సామాజిక, ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని, ప్రజాహిత రాజ్యాన్ని స్థాపించడం.[2]
ఆదేశిక సూత్రాలు, ఐర్లండు రాజ్యాంగం నుండి సంగ్రహించారు. భారత రాజ్యాంగ కర్తలు, ఐరిష్ జాతీయ ఉద్యమంతో ప్రభావితమైనారు. కాన, భారత రాజ్యాంగం ఐరిష్ ఆదేశిక సూత్రాలకు ఆదర్శంగా తీసుకుని, ఆదేశిక సూత్రాలను రచించింది.[3] ఈ పాలసీల ఉపాయం, ఫ్రెంచి విప్లవం, అమెరికన్ కాలనీల స్వాతంత్ర్య ప్రకటనలనుండి పొందారు.[4] ఇంకనూ, భారత రాజ్యాంగం, ఐక్యరాజ్యసమితి యొక్క సార్వత్రిక మానవహక్కుల ప్రకటన నుండి స్ఫూర్తిని పొందింది.
ప్రాథమిక హక్కులు, భారతదేశంలో ఆదేశిక సూత్రాలు, డ్రాఫ్టింగ్ కమిటీ తన మొదటి డ్రాఫ్టులోనూ (ఫిబ్రవరి 1948), రెండవ డ్రాఫ్టులోనూ (17 అక్టోబరు, 1948), మూడవ డ్రాఫ్టులోనూ (26 నవంబరు 1949) పొందు పరచింది.
ఆదేశిక సూత్రాలు, ప్రజాప్రయోజనాలను, పౌరుల సామాజిక ఆర్థిక రంగాల అభివృద్ధిని ధ్యేయంగా పెట్టుకుని తయారుచేయబడినవి. ఆదేశిక సూత్రాలు, పౌరుల సామాజిక, ఆర్థిక అంశాలను ఉద్ధరించడానికి, 'శ్రేయోరాజ్యాన్ని' యేర్పాటు చేయుటకు ఎంతగానో ఉపయోగపడుతాయి. 1971లో భారత రాజ్యాంగ 25వ సవరణ లో, అధికరణ 31-సిను జోడించి, ఆదేశిక సూత్రాలను ఇంకొంచెం విస్తరించారు.[5]
రాజ్యం (ప్రభుత్వం) [1] ప్రజల శ్రేయస్సు కొరకు, సామాజిక అభివృద్ధికి పాటుపడుతూ, సామాజిక న్యాయాన్ని పొందుటకు ఎల్లవేళలా పనిచేస్తుందని పౌరులకు ఈ ఆదేశిక సూత్రాలు భరోసానిస్తాయి.[6]
ఆదేశిక సూత్రాలను అమలు పరచేందుకు, రాజ్యం (ప్రభుత్వం) ఎన్నో ప్రయత్నాలను చేపట్టింది.
ఆదేశిక సూత్రాలను సవరించాలంటే రాజ్యాంగ సవరణ అవసరమౌతుంది. దీనిని పార్లమెంటు లో, బిల్లు ప్రవేశపెట్టి, మూడింట రెండొంతుల మెజారిటీతో చట్టం చేస్తారు.
Seamless Wikipedia browsing. On steroids.