From Wikipedia, the free encyclopedia
రేగు ఒక పండ్ల చెట్టు.[1] ఇది జిజిఫస్ ప్రజాతికి చెందినది. ఇందులో 40 జాతుల పొదలు, చిన్న చెట్లు రామ్నేసి (Rhamnaceae) కుటుంబంలో వర్గీకరించబడ్డాయి. ఇవి ఉష్ణ మండలం అంతటా విస్తరించాయి.
వీని ఆకులు ఆల్టర్నేట్ పద్ధతిలో ఏర్పడి 2–7 cమీ. (0.79–2.76 అం.) పొడవు ఉంటాయి. వీని పుష్పాలు చిన్నవిగా పసుపు-ఆకుపచ్చ రంగులో ఉంటాయి. రేగు పండు 1–5 cమీ. (0.39–1.97 అం.) పొడవుగా ఉండి, డ్రూప్ జాతికి చెందింది. ఇవి పసుపు-కాఫీ రంగు, ఎరుపు లేదా నలుపు రంగులో గుండ్రంగా ఉంటాయి. ఇవి తినడానికి తియ్యగా చిన్న పులుపు రుచితో ఉంటాయి. రేగు పండ్లు వాటి పరిమాణము, రంగు, రుచిని బట్టి సుమారు తొంబై రకాలున్నాయి. సాధారణంగా మనకు కనుపించేవి రెండు రకాలు. ఒకరకం కొంచెం ఎరుపు రంగు కలిగి గుండ్రంగా వుంటాయి. వీటిలో గుజ్జు తక్కువగా వుండి గింజ పెద్దవిగా వుంటాయి. తినడానికి ఇవి కొంత పులుపు దనం తియ్యదనం కలిసి బా వుంటాయి. రెండో రకం కోలగా వుండి పెద్దవిగా వుంటాయి. వీటి రంగు కూడా చిన్న వాటి లాగే వుంటుంది. కండ ఎక్కువగా వుండి కొరికి తినడానికి బాగా వుంటాయి. ఇవి కొంత తీపిదనం కలిగి కమ్మగా చాల బాగా వుంటాయి. వీటినే పెద్ద రేగు లేదా గంగ రేగు అంటారు.
రేగు పండ్లు పుల్లపుల్లగా, తియ్యతియ్యగా వుంటుంది. వీటిని భానుడికి చిహ్నంగా భావిస్తారు. సంక్రాంతి సమయంలో భోగి రోజున పిల్లలు భోగభాగ్యాలతో తులతూగాలని ఈ పండ్లను పోస్తారు. భోగినాడు పోస్తారు కాబట్టి వీటిని భోగిపండ్లు అంటారు. రేగు పళ్లకు రకరకాల పేర్లున్నాయి. వీటిని జిజిఫుస్ మారిటియానా, నార్కెలి కల్, బెర్, బోరీ, బోర్, బెరి అని వివిధ రకాలుగా వివిధ ప్రాంతాలలో పిలుస్తారు. ఈ చెట్లు త్వరగా పెరుగుతాయి. మూడు సంవత్సరాల్లోనే పండ్లనిస్తాయి.
ఎండిన పండ్లను స్నాక్స్లాగా, టీ తాగేప్పుడు తీసుకుంటారు. రేగిపళ్ల గుజ్జుతో టీ కూడా చేస్తారు. రేగు పళ్లతో జ్యూస్, వెనిగార్లను కూడా తయారుచేస్తారు. పశ్చిమ బెంగాల్లో, బంగ్లాదేశ్లో వీటితో పచ్చడి చేసుకుంటారు. చైనీయులు వీటితో వైన్ను కూడా తయారుచేస్తారు. వారు బెరుజు అనే ద్రవంలో వాటిని నిలవ చేస్తారు. అలా అవి మూడు నాలుగు నెలల వరకు తాజాగా ఉంటాయి. రేగు పళ్లను ఎండబెట్టి వాటిలోని విత్తనాలు తీసి చింతకాయలు, ఎర్రని పచ్చి మిరపకాయలు, ఉప్పు, బెల్లం వేసి దంచుతారు. దీన్ని భోజనంతో కలిపి తింటారు. వీటితో వడియాలు కూడా చేస్తారు. రేగుపళ్లలో మంచి పోషకాలే కాక 'సి' విటమిన్ సమృద్ధిగా ఉంటుంది. జామకాయ తరువాత ఎక్కువగా ఇందులోనే ఉంటుంది. మనదేశంలో ఎక్కువగా వీటిని నేరుగా తింటారు. వీటితో రేగు తాండ్ర కూడా చేసుకుంటారు. ఒంటెలు, మేకలు, ఇతర పశువులకు వీటి ఆకులు మంచి పోషకాహారం. ఇండోనేషియన్లు ఆకులతో కూర చేసుకుని తింటారట.
ఈ పండ్ల తియ్యటి వాసనకు టీనేజ్ వాళ్లు ప్రేమలో పడతారట. అందుకే హిమాలయ, కారకోరమ్ ప్రాంతాలలోని పురుషులు స్త్రీలను ఆకర్షిండానికి పూత ఉన్న రేగు కొమ్మను టోపీల మీద పెట్టుకుంటారు. అంతేకాదు గర్భధారణ శక్తిని పెంచుతుందని చైనీయులు తమ పడకగదిలో రేగు పండ్లను, ఆక్రోటు కాయలను పెట్టుకుంటారు. భూటాన్లో సువాసన కోసం ఇళ్లలో సాహిత్య సంకలనం లాగా ఉపయోగిస్తారు. వాటిని ఇంట్లో పెట్టుకోవడం వల్ల కీటకాలు రావట.
భారతదేశంలో 90 రకాలకు పైగా రేగుపళ్లను సాగుచేస్తున్నారు. ఒక చోట మొలిచిన రేగు పళ్ల చెట్టును ఇంకో చోట నాటితే అవి బతకవు. అందుకే ముందుగా ఎక్కడ వెయ్యదలచుకుంటే అక్కడ విత్తనాలను పెట్టాలి. మనదేశంలో ఈ పండ్లు అక్టోబరు ప్రారంభంలో, ఇతర ప్రాంతాలలో ఫిబ్రవరి, మార్చి నెలల్లో వస్తాయి. మనదేశంలో సంవత్సరానికి ఒక్కో చెట్టు 5,000 నుండి 10,000 పండ్లను ఇస్తుంది. అంటు కట్టిన చెట్లైతే 30,000 వరకూ ఇస్తాయి. ప్రత్యేకంగా సాగు చేస్తే అధిక ఉత్పత్తిని సాధించవచ్చు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాలలో వీటి సాగు చేస్తారు.
ఈ పత్రి రేగు వృక్షానికి చెందినది.దీనిని ‘రేగు’పత్రి అని కూడా పిలుస్తారు. ఇది చిన్న పిల్లలకు సంబంధించిన వ్యాధుల నివారణకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఒకటి లేదా రెండు ఆకులను ప్రతిరోజూ ఒకటి లేదా రెండు పూటలు తినిపిస్తే వ్యాధులు పూర్తిగా నయమవుతాయి. (ఎక్కువగా తింటే కఫం వచ్చే ప్రమాదముంది).వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు ఐదవది. ఈ ఆకు ముదురు పచ్చ రంగులో ఉంటుంది. ఆకారం గుండ్రంగా ఉంటుంది. పరిమాణం చిన్నది. ఈ చెట్టు గుబురుచెట్టుగా పెరుగుతుంది.
రేగు పండు చూడ్డానికి చిన్నగా వుంటుంది.పచ్చిగా వున్నప్పుడు ఆకుపచ్చ రంగులో వున్నా, పక్వానికొచ్చాక రంగు మారుతుంది. పసుపు, ఆ పై ఎరుపు రంగుకు వస్తుంది. మన దేశంలో 90 రకాల రేగుపండ్లను పండిస్తున్నారు. ఇది మంచి ఔషధకారి. రేగు పండులో ఔషధ గుణాలు చాల ఉన్నాయి. వీటిని తింటే కడుపులో మంట తగ్గుతుంది. అజీర్తికి చాల మంచిది. గొంతు నొప్పిని, ఆస్తమాని కండరాల నొప్పిని తగ్గించే గుణం దీనిలో ఉంది. రేగు పండు గింజ చాల గట్టిగా వుంటుంది. వీటిని పొడి చేసి నూనెతో కలిపి రాసు కుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. రేగు చెట్టు బెరడును నీళ్లలో మరిగించి డికాక్షన్ గా తాగితే నీళ్ల విరేచనాలకు భలే బాగ పనిచేస్తుంది.[2] కొన్ని ప్రాంతాలలో రేగు పండ్ల గుజ్జుతో వడియాలు పెట్టుకుంటారు.
ఈ పత్రి ఉల్లేఖన ఆయుర్వేదంలో ఉంది. ఇది రక్తహీనత, నీరసం, గొంతునొప్పి, శ్వాసనాళాల వాపు, విసుగు, హిస్టీరియా రోగాల నివారణకు ఉపయోగపడుతుంది.
100 గ్రాముల తాజా రేగు పండ్లలో
Seamless Wikipedia browsing. On steroids.