నవాన్షహర్
పంజాబ్ లోని పట్టణం From Wikipedia, the free encyclopedia
నవాన్షహర్ (ਨਵਾਂਸ਼ਹਿਰ) పంజాబ్ రాష్ట్రంలోని పట్టణం. షహీద్ భగత్ సింగ్ నగర్ జిల్లాకు ముఖ్య పట్టణం.ఇది స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ స్వస్థలం.
నవాన్షహర్
షహీద్ భగత్ సింగ్ నగర్ | |
---|---|
పట్టణం | |
Coordinates: 31.1167°N 76.1333°E | |
దేశం | India |
రాష్ట్రం | పంజాబ్ |
జిల్లా | షహీద్ భగత్ సింగ్ నగర్ |
జనాభా (2011) | |
• Total | 46,023 |
భాషలు | |
• అధికారిక | పంజాబీ |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 144514 |
టెలిఫోన్ కోడ్ | 01823 |
Vehicle registration | PB-32 |
చరిత్ర
సట్లెజ్ నదికి పక్కనే ఉన్న రహోన్ అనే నగరం నుండి వలస వచ్చిన ప్రజలు నవాన్షహర్ను స్థాపించారు, సట్లజ్ వరదల నుండి తప్పించుకునేందుకు వాళ్ళు ఇక్కడికి వలస వెళ్ళారు. వాళ్ళు దీనికి నవాన్షహర్ అని పేరు పెట్టారు. నవాన్షహర్ ఘోరేవాహా లోని బలమైన స్థానం. ఇది బంధుత్వ సంబంధాల ద్వారా అక్బరుతో పొత్తు కుదుర్చుకుంది.
ఈ నగరాన్ని లాలా పరమానంద్ భుచార్ (సరీన్) అభివృద్ధి చేశాడు. నగరంలో పెద్దయెత్తున ఇటుక ఆవాలను (ఆవం అంటే ఇటుకలు కాల్చే బట్టీ) స్థాపించినందుకు లాలా పరమానంద్కు కృతజ్ఞతా చిహ్నంగా పాటియాలా మహారాజా సమక్షంలో అతడి కొలువులో ఎలిజబెత్ రాణి పెద్ద ఇటుక మూసను బహూకరించింది. లాలా పరమానంద్ మొట్టమొదట 1920 లో మండీ (ఇప్పుడు పాత డానా మండి అని పిలుస్తారు) నిర్మించాడు. దీని ఇటుకలపై "పిఎన్" అని అతడి పేరు ఉంటుంది. పాత డానా మండి గేట్ వద్ద శంకుస్థాపన రాయి మీద కూడా అతడి పేరు ఉంటుంది. అతను నగరం మధ్యలో ఉన్న లల్లియన్ మొహల్లా (లాల్లియన్ డా మొహల్లా) లో నివసించాడు. మొహల్లాలో 100 కుటుంబాలు నివాసముండే సాధారణ హవేలీతో పాటు అతడి హవేలీ కూడా ఉంది, నానక్షాహీ ఇటుకలతో చేసిన ఈ మొహల్లా నగరంలో ఒక చారిత్రిక మైలురాయి.
మాజీ క్యాబినెట్ మంత్రి, అప్పటి నవాన్షహర్ ఎమ్మెల్యే అయిన దివంగత ఎస్. దిల్బాగ్ సింగ్ బలమైన ప్రయత్నాలతో 1995 లో నవాన్షహర్ జిల్లా ఏర్పడింది. జిల్లా ప్రజలు ఆర్థికంగా పురోగతి సాధించారు.[1] జిల్లా నుండి పెద్ద సంఖ్యలో కుటుంబాలు విదేశాలలో స్థిరపడ్డాయి. పర్యవసానంగా, వాళ్ళు భారీగా పంపిన డబ్బు జిల్లా ఆర్థికాభివృద్ధికి, సంపదకూ దోహదం చేసింది. ఈ ప్రాంతంలో భూమి ధరలు బాగా పెరిగాయి. ఈ విషయంలో లుధియానా, చండీగఢ్ ల తరువాతి స్థానంలో జిల్లా ఉంది. విదేశీ పంజాబీ ప్రజల నుండి వచ్చే కరెన్సీ కారణంగా నవాన్షహర్ ఆర్థిక వ్యవస్థ కూడా మెరుగుపడుతోంది.
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు షహీద్ భగత్ సింగ్ ఈ ప్రాంతానికి చెందినవాడు. అతను బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటంలో ప్రధాన పాత్ర పోషించాడు. ప్రజల స్వేచ్ఛ కోసం పోరాడుతూ అమరవీరుడయ్యాడు.
2008 సెప్టెంబరు 27 న భగత్ సింగ్ 101 వ జయంతిని పురస్కరించుకుని నవాన్షహర్ జిల్లాకు షహీద్ భగత్ సింగ్ నగర్ జిల్లా అని పేరు పెట్టారు.[2]
జనాభా
2001 జనాభా లెక్కల ప్రకారం,[3][4] నవాన్షహర్ జనాభా 5,87,468. ఇందులో 3,06,902 మంది పురుషులు, 2,80,566 మంది మహిళలు ఉన్నారు. ప్రతి 1000 మంది పురుషులకు 913 మంది మహిళలు ఉన్నారు. నవాన్షహర్ అక్షరాస్యత 75% (పురుషుల అక్షరాస్యత 79%, స్త్రీ అక్షరాస్యత 71%). ఇది జాతీయ సగటు 59.5%ను అధిగమించింది. నవాన్షహర్ జనాభాలో 11% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు. జనసాంద్రత 439 మంది/చ.కి.మీ..1991 - 2001 మధ్య, జనాభాలో 10.43% పెరుగుదల ఉంది. పంజాబ్ విధానసభలోని 117 స్థానాల్లో నవాన్షహర్ నియోజకవర్గం ఒకటి, దాని నియోజకవర్గ సంఖ్య 47.
రవాణా
ప్రస్తుతానికి, నవాన్షహర్లో వాణిజ్య విమానాశ్రయం లేదు. సమీప ప్రాంతీయ విమానాశ్రయం లుధియానాలోని 45 కి.మీ. దూరం లోని సహనేవాల్లో ఉంది. అక్కడి నుండి ఢిల్లీ విమానాశ్రయానికి ప్రతిరోజూ ఒక విమానం ఉంది. అమృత్సర్ లోని శ్రీ గురు రామ్ దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీప పూర్తి స్థాయి అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది ఇక్కడికి155 కిలోమీటర్ల దూరంలో ఉంది.
రైలు
నవాన్షహర్లోని ప్రాథమిక రైల్వే స్టేషన్లలో నవాన్షహర్ దోఆబా జంక్షన్ ఒకటి. నవాన్షహర్ దోఆబా జంక్షన్ గుండా సుమారు 6 రైళ్లు వెళుతున్నాయి.
రోడ్డు

నవాన్షహర్ నుండి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు చక్కటి రోడ్డు మార్గాలున్నాయి. పంజాబ్ రోడ్వేస్ సంస్థ ఇక్కడి నుండి అమృత్సర్, ఢిల్లీ, చండీఘర్ వంటి పెద్ద నగరాలకు బస్సులు నడుపుతోంది
పట్టణ ప్రముఖులు
- షహీద్ భగత్ సింగ్, భారత స్వాతంత్ర్య సమరయోధుడు
- మదన్ పూరి, హిందీ, పంజాబీ సినిమా నటుడు
- అమ్రిష్ పూరి, సినిమా నటుడు
- యష్ చోప్రా, హిందీ సినిమా నిర్మాత
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.