దూకుడు (సినిమా)
2011లో విడుదలైన శ్రీను వైట్ల తెలుగు సినిమా From Wikipedia, the free encyclopedia
దూకుడు 2011 లో నిర్మితమైన తెలుగు చిత్రం. ఘట్టమనేని మహేశ్ బాబు, సమంత ప్రధాన తారాగణం. శ్రీను వైట్ల దర్శకుడు. ఈ చిత్రాన్ని ఆచంట రాం, ఆచంట గోపీచంద్, సుంకర అనిల్ సంయుక్తంగా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మించారు.
దూకుడు | |
---|---|
![]() | |
దర్శకత్వం | శ్రీను వైట్ల |
రచన | శ్రీను వైట్ల గోపీమోహన్ కోన వెంకట్ |
నిర్మాత | రాం ఆచంట గోపీచంద్ ఆచంట అనిల్ సుంకర |
తారాగణం | మహేష్ బాబు సమంత ప్రకాష్ రాజ్ సోనూ సూద్ |
ఛాయాగ్రహణం | కె. వి. గుహన్ ప్రసాద్ మూరెళ్ళ |
కూర్పు | ఎం. ఆర్. వర్మ |
సంగీతం | తమన్ |
నిర్మాణ సంస్థ | 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ |
పంపిణీదార్లు | జిఎంబి ఎంటర్టైన్మెంట్ |
విడుదల తేదీ | 23 సెప్టెంబరు 2011 (India) |
సినిమా నిడివి | 175 ని |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | ₹35 crore[1] |
బాక్సాఫీసు | est. ₹101crore[2] |
కథ
శంకరన్నగా పిలవబడే శంకర్ నారాయణ (ప్రకాష్ రాజ్) సామాజిక సేవ మరియూ మానవతా విలువలనే ఆదర్శంగా తీసుకునే ఒక రాజకీయ నాయకుడు. ప్రజల మనిషి. అతని అనుచరులు అతని తమ్ముడు సత్యం (రాజీవ్ కనకాల), స్నేహితులు మేక నరసింహారావు (షయాజి షిండే), శివయ్య (ఆదిత్య), గణేశ్ (సుప్రీత్ రెడ్డి). శంకరన్న నియోజకవర్గం ప్రజలు అతన్ని నందమూరి తారక రామారావు గారి పాలనా సమయంలో అసెంబ్లీ సభ్యుడిగా ఎన్నుకున్నారు. శంకరన్న స్వతహాగా నందమూరి తారక రామారావు గారి వీరాభిమాని ఐనప్పటికీ పార్టీ హద్దుల వల్ల తన ప్రజలకు న్యాయం చెయ్యలేనేమోనని తెలుగుదేశం పార్టీలో చేరడానికి సున్నితంగా తిరస్కరించారు. తన కొడుకు కూడా తనలాగే ప్రజల మనిషిగా ఎదిగి వారి ఆదరాభిమానాలు పొందాలన్నది శంకరన్న ఆశ. ఐతే ప్రమాదవశాత్తూ శంకరన్న, సత్యం, తన అనుచరులు ఒక పెళ్ళికి వెళ్తుండగా కారు ప్రమాదంలో మరణించారు.
14 ఏళ్ళ తర్వాత, శంకరన్న కొడుకు అజయ్ కుమార్ (ఘట్టమనేని మహేశ్ బాబు) దుందుడుకుగా ప్రవర్తించే ఓ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్. మాఫియ డాన్ నాయక్ (సోను సూద్)ని పట్టుకుని అతను నడుపుతున్న డ్రగ్స్, గన్స్, ఇతర ఇల్లీగల్ వ్యాపారాలను ఆపాలనే మిషన్ పై అతనిని నియమిస్తారు. ఆ తర్వాత శంకరన్న చనిపోలేదని, కానీ ప్రమాదం జరిగాక కోమాలోకి వెళ్ళాడని తెలుస్తుంది. ఈ నిజాన్ని శంకరన్న కుటుంబం జనాలకు తెలియనివ్వదు. అజయ్ నాయక్ని పట్టుకోడానికి ఇస్తాంబుల్ వెళ్తాడు. అక్కడ ఓ అండర్-కవర్ ఆపరేషన్లో నాయక్ తమ్ముడు బంటి (ఆజజ్ ఖన్)ని పట్టుకుంటాడు అజయ్. ఆ తర్వాత శంకరన్న దగ్గర విశ్వాశంగా పనిచేసి అతని ప్రమాదం తర్వాత జైలుకెళ్ళిన శివయ్య (ఆదిత్య) ద్వారా నాయక్ స్నేహితుడు, అవినీతిపరుడు, ప్రతిపక్ష నాయకుడు అయిన మల్లేశ్ గౌడ్ (కోట శ్రీనివాసరావు) శంకరన్న చావుకి ప్లాన్ చేసిన వాడని, ఈ ప్లానుకి మేక నరసింహారావు, గణేశ్ సహకరించారని తెలుసుకుంటారు.
ఇస్తాంబుల్లో ఉన్నప్పుడు అజయ్ ప్రశాంతి (సమంత)ని చూసి ప్రేమిస్తాడు. ప్రశాంతి అజయ్ సీనియర్ ఐన మూర్తి (నాజర్) కూతురు. మూర్తి హైదరాబాదు నుంచి పోలీస్ కమిషనర్ (సుమన్ తల్వార్)తో టచ్ లో ఉంటూ ఎప్పటికప్పుడు అజయ్ తో కలిసి వార్తలందిస్తుంటాడు. శంకరన్న కోమా నుంచి బయటికొచ్చాక తనేదైనా బాధాకరమైన, ఆందోళనకరమైన లేక షాక్ కు గురిచేసే వార్తలు గానీ, విషయాలు గానీ తెలుసుకుంటే అతని ప్రాణాలకి ప్రమాదమని డాక్టర్లు అజయ్కి చెప్తారు. తన తండ్రి కారు ప్రమాదానికి సంబంధించిన విషయాలను అజయ్ దాచేస్తాడు. అజయ్ తన తండ్రి ఇదివరకు ఉన్న ఆ పాత బంగళాని మరలా అద్దెకు తీసుకుంటాడు.
సినిమా షూటింగులకు వాడుతున్న ఆ ఇంటిలో ఒక రాజకీయ వాతావరణాన్ని సృష్టిస్తాడు. రియాలిటీ షో పేరుతో నటించాలని ఉన్న అందులో ఎదగలేక పోయిన పద్మశ్రీ (బ్రహ్మానందం) అనే వ్యక్తిని వాడుకుంటారు. వారి బంగళా ప్రస్తుత ఓనరైన అతనితో ఈ షో సినీ నటుడు అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నాడని, నాగార్జునలా ఒకరిచే మాట్లాడించి ఈ షోలో తన నటనకి భారీ రెమ్యూనరేషన్ ఇవ్వాలనుకున్నారని చెప్పించి అతనిని ట్రాప్ చేస్తారు. ఇంకోవైపు మేక నరసింహరావు బావమరిది, పద్మశ్రీలానే నటన పిచ్చి ఉన్న బొక్క (ఎమ్.ఎస్.నారాయణ)ని సినిమా డైరెక్టరునని, నీతో సినిమా తీస్తానని చెప్పి అతనిని కూడా ట్రాప్ చేస్తారు. మల్లేశ్ గౌడ్ తో కూడా ఒక పెద్ద బిజినెస్ డీల్ పేరిట ట్రాప్ చేసి అతని ద్వారా నాయక్ని రప్పించాలని ప్లాన్ చేస్తాడు. ఐతే శంకరన్న ముందు మాత్రం తానో ఎం.ఎల్.ఏ. అని జనం చేత ఆదరించబడుతున్న వాడిలా నటిస్తాడు. తన తండ్రి సంతోషానికి తను ప్రేమించిన ప్రశాంతి ప్రేమను గెలిచి తనని పెళ్ళి చేసుకుంటాడు. అనుకున్న ప్లాన్ ప్రకారం తన స్నేహితులు, శివయ్యతో కలిసి ఎవరికీ అనుమానం రాకుండా నాయక్ తో కలిపి అందరినీ చంపేస్తాడు. కానీ కొన్నాళ్ళకు శంకరన్నకి నిజం తెలిసి అజయ్ని ఎందుకిలా చేశావని అడుగుతాడు. అందుకు అజయ్ నువ్వు నాకు జన్మనిచ్చిన తండ్రివి కాబట్టి అలా చేశానని చెప్తాడు. దానితో శంకరన్న ఆనందానికి హద్దుల్లేకుండా పోతాయి. చివరికి అందరూ సుఖంగా కలిసుండటంతో కథ సుఖాంతమౌతుంది.
మాటలు
- హేయ్! మళ్ళీ ఏసేశాడు!!
- డిపార్ట్మెంట్ మే అపన్ కో సబ్ క్యా బోల్తే మాలూం? బబ్బర్ షేర్!
- దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఎ రికార్డ్. ఇట్ ఈజ్ ఆల్ టైం రికార్డ్
- నన్ను వాడుకోండి సార్! అసలు వాడకమంటే ఏంటో చూపించండి.
- వాడకమంటే ఇదా
నట వర్గం
- ఘట్టమనేని మహేశ్ బాబు
- సమంత
- సోనియా
- వెన్నెల కిశోర్
- బ్రహ్మానందం
- నాజర్
- ప్రకాశ్ రాజ్
- కోట శ్రీనివాసరావు
- సోనూ సూద్
- ఎమ్.ఎస్.నారాయణ
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం
- చంద్రమోహన్
- తనికెళ్ళ భరణి
- సుధ
- సాయాజీ షిండే - మేకా నరసింగరావ్
- మీనాక్షి దీక్షిత్ - "నీ దూకుడు" పాటలో
విడుదల
ఈ సినిమా విడుదలై 10 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా సెప్టెంబరు 24, 2021 న నాడు ఈ సినిమా నిర్మాతల తెలుగు రాష్ట్రాల్లోని 22 ప్రాంతాల్లో ప్రదర్శించారు. అభిమానులు ఈ ప్రదర్శనలు పాల్గొని సందడి చేశారు.[3]
సాంకేతిక వర్గం
పాటలు
పాట | గాయకులు | Duration | Lyrics |
---|---|---|---|
"నీ దూకుడు" | శంకర్ మహదేవన్ | 3:49 | విశ్వ |
"గురువారం మార్చి ఒకటి" | రాహుల్ నంబియార్ | 4:25 | రామజోగయ్య శాస్త్రి |
"చుల్బులి చుల్బులి" | కార్తిక్, రీటా | 4:26 | రామజోగయ్య శాస్త్రి |
"పూవై పూవౌ" | రమ్యా ఎన్ఎస్కె, నవీన్ మాధవ్ | 4:20 | రామజోగయ్య శాస్త్రి |
"దిత్తడి దిత్తడి" | రంజిత్, దివ్య | 4:11 | భాస్కరభట్ల రవికుమార్ |
"అదర అదరగొట్టు" | కార్తిక్, కోటి, రామజోగయ్య శాస్త్రి, వర్ధిని, బృందం | 4:21 | రామజోగయ్య శాస్త్రి |
పురస్కారాలు
సైమా అవార్డులు
2011 సైమా అవార్డులు
- ఉత్తమ చిత్రం
- ఉత్తమ దర్శకుడు
- ఉత్తమ నటుడు
- ఉత్తమ సహాయనటుడు (ప్రకాశ్ రాజ్)
- ఉత్తమ హాస్యనటుడు (బ్రహ్మనందం)
- ఉత్తమ సంగీత దర్శకుడు
- ఉత్తమ గీత రచయిత (రామజోగయ్య శాస్త్రి - గురువారం మార్చ్)
- ఉత్తమ నేపథ్య గాయకుడు (రాహుల్ నంబియార్ -గురువారం మార్చ్)
మూలాలు
బయటి లంకెలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.