జరుక్ శాస్త్రి
From Wikipedia, the free encyclopedia
జరుక్ శాస్త్రి గా పేరొందిన జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి 1914, సెప్టెంబర్ 7న బందరులో జన్మించారు.[1] తెలుగు సాహిత్యంలో పేరడీలకు జరుక్ శాస్త్రిని ఆద్యుడిగా భావిస్తారు. అయితే, పేరడీ వంటి కొత్త ప్రక్రియలే కాక సాహిత్యంలోని అన్ని ప్రక్రియలతోనూ ఈయనకి పరిచయం ఉంది. ఈయన కృష్ణా పత్రిక, ఆంధ్రపత్రిక, వాణి - వంటి పత్రికల్లో తరుచుగా వ్యాసాలు వ్రాస్తూ ఉండేవారు. ఆంధ్రపత్రిక, వాణి పత్రికల్లో సంపాదకవర్గ సభ్యులుగా కూడా పనిచేసారు. తెనాలి రామకృష్ణుని తరువాత తెలుగునాట జన్మించిన అంతటి ప్రతిభామూర్తి, వికటకవి - శ్రీ జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి అని అంటారు. ఆయన రచనల్లో కొన్ని - "జరుక్ శాస్త్రి పేరడీలు" పేరుతోనూ, కథలు కొన్ని "శరత్ పూర్ణిమ" పేరుతోనూ నవోదయ పబ్లిషర్స్ వారు సంకలనాలుగా వెలువరించారు. ఆయన 1968లో హృద్రోగంతో కన్నుమూసారు.

జరుక్ శాస్త్రిగా ప్రసిద్ధులైన వీరు చిట్టి గూడురు సంస్కృత కళాశాలలో ఉభయభాషా ప్రవీణులయ్యారు. ఆంధ్రపత్రిక ఉపసంపాదకులుగా కొంతకాలం పనిచేశారు. మదరాసు, విజయవాడ ఆకాశవాణి కేంద్రాలలో స్క్రిప్టు రైటర్ గా పనిచేశారు. నవ్యాంధ్ర సాహిత్యోద్యమంలో ప్రధాన పాత్ర వహించారు. పేరడీ శాస్త్రిగా మంచి పేరు. దేవయ్య స్వీయచరిత్ర (నవల) ప్రచురించారు. ఆనంద వాణిలో ' తనలో తాను ' శీర్షిక నిర్వహించారు. సమకాలీన కవుల రచనలకు పేరడీలు వ్రాసి మెప్పు పొందారు. 1968 జూలై 20న ఉదయం సుమారు 4 గం|| విజయవాడలో పరమపదించారు. వీరి కుమారులు ప్రసాద్ ఆకాశవాణి కర్నూలు కేంద్రంలో అకౌంటెంటు.
రచనలు
- దేవయ్య స్వీయచరిత్ర (నవల)
- శబరి (నాటకం)
- కన్యకాపరమేశ్వరి (నాటకం)
- అక్షింతలు (పేరడీ)
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.