చంద్రగుప్త లేదా మౌర్యాభ్యుదయము అనే చారిత్రక నాటకాన్ని ముత్తరాజు సుబ్బరావు రచించారు. అతని మరణానంతరం కుమారుడు ముత్తరాజు సుబ్బరామరావు 1932 సంవత్సరంలో దీనిని ముద్రించారు. దీనికి ఉపోద్ఘాతాన్ని తూములూరు శివరామయ్య గారు రచించారు.
పుస్తకం మొదటి పుటలో గల ముత్తరాజు సుబ్బారావు చిత్రం
చంద్రగుప్తుడు మౌర్య సామ్రాజ్య స్థాపకుడు. తన తల్లి ముర పేరు మీదుగా మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. భారత దేశాన్ని మొత్తం ఒక రాజ్యంగా పరిపాలించడంలో సఫలీకృతుడైనాడు. చంద్ర గుప్తుడు మొట్ట మొదటిసారిగా భారతదేశమంతటినీ ఏకం చేసి నిజమైన చక్రవర్తి అనిపించుకున్నాడు. ఆయన గురువు చాణక్యుని సహకారంతో చంద్రగుప్తుడు ఈ విజయం సాధించారు. ఆ ఇతివృత్తాన్ని ముత్తరాజు సుబ్బరావు నాటకీకరించారు.
పురుషులు
చంద్రగుప్తుడు (మౌర్యుడు, వృషలుడు) - మగధాధీశ్వరుడు, కథానాయకుడు.
చాణక్యుడు (విష్ణుగుప్తుడు, కౌటిల్యుడు) - మగధాధీశ్వరుని గురువు.
రాక్షసుడు - మగధాధీశ్వరుని మంత్రిపుంగవుడు.
మైత్రేయుడు - మగధాధీశ్వరుని వయస్యుడు.
చందనదాసు - మగధాధీశ్వరుని మంత్రి.
శిఖరకుడు - మలయకేతుని సేనాని.
శార్జ్గరవుడు - చాణక్య శిష్యుడు.
చంద్రపాలుడు - కంచుకి ప్రతీహారి.
సెల్యుకేశ్వరుడు - సిరియా దేశాధీశ్వరుడు.
పాత్రకులుడు - సిరియా దేశాధీశ్వరుని సేనాని.
మెగాస్థానీశ్వరుడు - సిరియా దేశాధీశ్వరుని మంత్రి.
హిప్పడు - సిరియా దేశాధీశ్వరుని సైనికుడు.
కైలన్ - సిరియా దేశాధీశ్వరుని సైనికుడు.
స్త్రీలు
హేళిని - సిరియా దేశాధీశ్వరుని పుత్రిక, కథానాయిక
రదనిక - హేళిని చెలికత్తె, హిందూకాంత.
శోణోత్తర - చంద్రగుప్తుని దాసి.
1.1 : చందనదాసుడు వ్యాపారార్ధము బాబిలను నగరమేగి యచ్చట శల్యూకేశ్వరుడు భారతభూమిపై దండయాత్ర వెడలనున్నాడని విని రదనికను భారతమాతృ సేవకు బురికొల్పుట.
1.2 : రదనిక హేళినికి మౌర్యునిపై వలపుగొలిపి తండ్రితోడ హిందూదేశమేగ బ్రోత్సాహ మొనర్చుట.
2.1 : రాక్షస చందనదాసులు సన్యసించిన చాణక్యుని మంత్రి పదము మరల స్వీకరింపుమని వేడుట.
2.2 : శార్జ్నరవుడు మైత్రేయు సాయంబున చాణక్యునకు అమాత్యోచిత వస్త్రంబుల దెచ్చియిచ్చుట.
2.3 : చంద్రగుప్తుడు యవన రాయబారుల రావించి ప్రత్యుత్తర మిచ్చుట.
3.1 : హేళిని మోహము, శిఖరకుని శల్యూకేశ్వరుడు ప్రశ్నించుట. రదనిక శిఖరకుని చంద్రగుప్తుని కడకు పంపుట.
3.2 : శిఖరకుడు చంద్రగుప్తునకు హేళిని మోహ వృత్తాంతము నివేదించుట.
3.3 : హేళిని రదనికకు తన మోహమును దెల్పుట. పాత్రకులుని మోహమును నిరసించుట. చంద్రగుప్తుడు వచ్చి హేళిని నోదార్చుట.
3.4 : పాత్రకులుడు శల్యుకేశ్వరునితో హేళిని మౌర్యుని బిలిపించినదని చెప్పుట.
3.5 : శల్యుకేశ్వరుడు హేళినిని పాత్రకులు బెండ్లాడుమని నిర్బంధించి ప్రయోజనము గానక చెరయందుంచుట.
4.1 : రదనిక హేళిని దుఃఖవార్త దెల్పి మౌర్యుచే నభయహస్తము పడసి పోవుట.
4.2 : చాణక్య రాక్షసులు సంధి విషయము నాలోచించుట. చందనదాసును బాత్రకులుని శిఖాంగుళీకయమునకై పంపుట.
4.3 : చందనదాసు వైద్యవేషమున బాత్రకులుని వంచించి శిఖాంగుళీయకము గొనుట.
4.4 : చంద్రగుప్తుడా శిఖాంగుళీయకము జూపి హేళినీ రదనికల దోడ్కొని వచ్చుట.
5.1 : చాణక్య చందనదాసులు శల్యుకేశ్వరుని సంధి కొడంబడ జేయుట.
5.2 : హేళినీ చంద్రగుప్తుల వివాహము.