రచయిత From Wikipedia, the free encyclopedia
కొసరాజుగా, తెలుగు సినిమా పాటల రచయితగా పేరుపొందిన కొసరాజు రాఘవయ్య (జూన్ 23, 1905 - అక్టోబరు 27, 1986) సుప్రసిద్ధ కవి, రచయిత.
కొసరాజు రాఘవయ్య | |
---|---|
జననం | కొసరాజు రాఘవయ్య 1905 జూన్ 23 / చింతాయపాలెం గ్రామం కర్లపాలెం మండలం గుంటూరు జిల్లా |
మరణం | 1986 అక్టోబరు 27 81)/ చెన్నై | (వయసు
ఇతర పేర్లు | కొసరాజు |
ప్రసిద్ధి | సుప్రసిద్ధ కవి, రచయిత. |
భార్య / భర్త | సీతారామమ్మ |
తండ్రి | సుబ్బయ్య |
తల్లి | లక్ష్మమ్మ |
1905లో బాపట్ల తాలూకా కర్లపాలెం మండలం చింతాయపాలెంలో లక్ష్మమ్మ, సుబ్బయ్య దంపతులకు జన్మించారు కొసరాజు. జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి సలహా మేరకు మద్రాసు చేరుకొని కమ్మవారి చరిత్ర పరిశోధన చేపట్టారు.యక్షగానాలు, వీధిభాగవతాలు, హరికథలు, జముకుల కథలు, బుర్రకథలు, భజనగీతాలు, పగటివేషగాళ్ళ పాటలు, రజకుల పాటలు, పాములోళ్ళపాటలు, గంగిరెద్దుల గీతాలు ఎన్నో రాశారు. తెలుగువాడిగా పుట్టినందుకు గర్వించారు.
తెలుగు సినిమా పాటల రచయితగా కొసరాజుది ప్రత్యేకపీఠం. ఆ రోజుల్లోని చాలా చిత్రాలు కొసరాజు ముద్రని బాగా వాడుకున్నాయి. వ్యంగ్యం, హాస్యం మిళాయించిన పాట ఒకటి చిత్రంలో వుండాలి, అది రాఘవయ్య చౌదరిగారు రాయాలి - అని అప్పట్లో సినిమా జనాలకు ఒక సూత్రం ఉండేది. ఆ సూత్రానికి తగ్గట్టుగానే కొసరాజు వందలాది గీతాసుమాల్ని గుచ్చి ప్రకాశ పరిమళభరితం చేశారు. జానపదగీతాల్లోని లాలిత్యాన్ని, ఆ పొగరూ వగరూ ఏమాత్రం తగ్గకుండా తెలుగు సినిమాకు అమర్చిపెట్టింది కొసరాజు రాఘవయ్య చౌదరి. ఏరువాక సాగాలోరన్నో… అంటూ సేద్యగాళ్ళకు ఉత్సాహం రేకెత్తేలా ధైర్యం చెప్పినా రామయతండ్రి ఓ రామయ తండ్రి మానోములన్ని పండినాయి రామయ తండ్రీ… అని గుహుడి చేత శ్రీరాముడ్ని ఏరు దాటించినా ఆయాపాటల్లో ఆద్యంతం కొసరాజు ముద్ర ప్రస్ఫుటంగా గోచరిస్తుంది. పనిగట్టుకుని హాస్యాన్ని పాటల్లోకి ప్రవేశపెట్టినవాడు కొసరాజు రాఘవయ్య చౌదరి. అంతే కాకుండా ఆయన హాస్యాన్ని సాంఘిక విమర్శకు కూడా బాగా వాడుకున్నాడు.
"మా సొంత ఊరు అప్పికట్ల. అక్కడ ఒకే వీధిబడి వుండేది. ఆ బడిలో నాలుగోతరగతి తర్వాత ఇంక పై క్లాసులేదు. అంచేత, నేను నాలుగు చదివేసినా, ఊరికే కూచోక, మళ్ళీ నాలుగు చదివాను అని చెప్పాడు కొసరాజు ఒక ఇంటర్వ్యూలో . నాలుగోతరగతి తప్పితే మళ్లీ చదవడం వేరు, పాసై మళ్లీ చదవడం వేరు. అలా, ‘డబల్ ఎమ్.ఏ.’లాగా, ఆయన చిన్నతనంలోనే ‘డబల్ నాలుగు’ డిగ్రీ పొందారు. ఐతే, ఆయన ఊరుకోలేదు. తన తల్లి మేనమామ వెంకటప్పయ్యగారు గొప్ప పండితులు. వంశంలో వున్న ఆ సాహితీరక్తం - రాఘవయ్య లోనూ ప్రవహించి, ఉత్తేజపరిచింది. ఆ ఉత్సాహంతో వీధిబడిలో వుండగానే ఆయన బాలరామాయణం, ఆంధ్రనామసంగ్రహం వంటి గ్రంథాలు క్షుణ్ణంగా చదివాడు. వరుసకు పెదనాన్న అయిన త్రిపురనేని రామస్వామి నుండి అచ్చ తెలుగు నుడికారము, తర్కవితర్కాలు, తెలుగు భాషా సౌందర్యము తెలుసుకున్నాడు.
కొడముది నరసింహం పంతులుగారని, పండితుడూ, విమర్శకుడూ ఆ గ్రామంలోనే వుండేవారు. కొసరాజుకు కొండముది వారి ప్రోత్సాహం లభించింది. నరసింహంగారు భజనపద్ధతిలో రామాయణం రాసి, ప్రదర్శనలు ఇప్పించేవారు. ఆ బాల ప్రదర్శనలో పాల్గొన్న రాఘవయ్య రాముడి పాత్రధారి. అప్పటికే ఆయన కంఠం లౌడ్ స్పీకర్లా వుండేది. పాటా మాటా నేర్పిన నరసింహంగారే, పొలాల గట్లమీద కొసరాజును కూచోబెట్టి సంస్కృతాంధ్ర భాషలు నేర్పేవారు, సాహిత్య సభలకు తిప్పారు. అది ఎంత దూరం వెళ్లిందంటే, పన్నెండో ఏటికే కొసరాజు అష్టావధానాలు చెయ్యడం ఆరంభించాడు! బాలకవి అని బిరుదు పొందాడు. సినిమాలకి వచ్చిన తర్వాత ‘కొసరాజు’ ఎంత పాప్యులరో, బాల్యదశలో ‘బాలకవి’ అంత పాప్యులర్. పత్రికల్లో కవితలు రాయడానికీ, ‘రైతుపత్రిక’లో సహాయ సంపాదకుడుగా పనిచెయ్యడానికీ స్కూలు, కాలేజీ చదువులు చదవకపోవడం - ఏ మాత్రం అడ్డురాలేదు.
నరసింహం పంతులు వ్రాసిన రామాయణము నాటకములో పాత్రలు ధరించి నాటక రంగానికి పరిచయమయ్యాడు. పిదప కొంత కాలము 'రైతు పత్రిక' కు జర్నలిష్టుగా ఉన్నాడు. ఆ సమయములోనే ప్రముఖ సంగీత దర్శకుడు సముద్రాల రాఘవాచార్యులు, నిర్మాత గూడవల్లి రామబ్రహ్మం గార్లతో పరిచయం ఏర్పడింది.
"చల్లపల్లి రాజావారి వివాహానికి వెళ్తే చెళ్ళపిళ్ళ, వేటూరి వంటి మహాకవులు వచ్చారు. వారి సరసన నన్నూ కూచోబెట్టారు. వధూవరుల మీద నేను రాసిన పద్యాలు చదివితే, 'ఈ పిట్ట కొంచెమే అయిన కూత ఘనంగా వుందే!' అని చెళ్లపిళ్ల వారు నన్ను ప్రశంసించారు, ఆశీర్వదించారు’" అని కొసరాజు చెప్పేవాడు. ఆయన ఇంకో విశేషం చెప్పేవాడు. జమీన్రైతు ఉద్యమం లేచిన తర్వాత, ఆయన రైతుని సమర్థిస్తూ ఎన్నో పాటలూ, పద్యాలూ రాసి సభల్లో పాడేవాడు. అప్పుడే ఆయన ‘కడగండ్లు’ అనే పుస్తకం రాశాడు. ఆ పుస్తకానికి పీఠిక రాయమని కొసరాజు ఎందరో సాహితీ వేత్తలనూ, రాజకీయవేత్తలనూ అర్థించాడట.
ఆ పుస్తకం చదివి, అందరూ 'మనకెందుకులే' అని వెనుకంజ వేశారుట - భయపడి. ఐతే కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారు మాత్రం 'నేను రాస్తాను' అని, ఆ పుస్తకానికి ఉపోద్ఘాతం రాశాడట. అది అచ్చయింది. రైతు మహాసభల్లో ఆయన పాల్గొని, పద్యాలు గొంతెత్తి చదువుతూ వుంటే 'ఆహా' అనే వారందరు. అప్పుడే ఆయనకు కవిరత్న అన్న బిరుదుకూడా ఇచ్చారు. సాహితీపోషకులైన జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి ద్వారా రాఘవయ్య చౌదరికి గూడవల్లి రామబ్రహ్మం, సముద్రాల రాఘవాచార్య లతో ఏర్పడిన పరిచయం ఆయన సినిమాల్లో ప్రవేశించడానికి కారణమైంది.
అప్పటికే రైతు ఉద్యమం మీద పాటలు రాసి, ఒక ఊపు ఊపుతున్న కొసరాజుచేత, రామబ్రహ్మం సినిమాలకు రాయించడం మొదలుపెట్టాడు. తాపీ ధర్మారావు, త్రిపురనేని గోపీచంద్ మాటలు రాస్తే విశ్వనాథ కవిరాజు హాస్య సన్నివేశాలు రాశారు. సముద్రాల, తాపీ, కొసరాజు పాటలు రాశారు. ‘రైతుబిడ్డ’ తర్వాత నేను స్వస్థలం వెళ్లిపోయి వ్యసాయంతోపాటు సాహితీ వ్యవసాయం కూడా చేస్తూ కూచున్నాను. మళ్లీ పదమూడేళ్ల తర్వాత డి.వి. నరసరాజుగారి సూచనతో కె.వి. రెడ్డిగారు ‘పెద్దమనుషులు’ సినిమాకి పిలిచారు. అప్పటుంచి ‘సినిమాకవి’నే అయిపోయాను’ అని గట్టిగా నవ్వుతూ చెప్పేవారాయన.
రాఘవయ్య తొలుత కథానాయకునిగా రైతుబిడ్డ (1939) అనే చిత్రములో నటించాడు. కవిగా రాఘవయ్య ప్రతిభ గుర్తించిన బి. ఎ. సుబ్బారావు, కె. వి. రెడ్డి వారి చిత్రాలకు పాటలు వ్రాయించారు. 1954లో విడుదలైన 'పెద్ద మనుషులు' చిత్రానికి రాఘవయ్య వ్రాసిన పాటలు ఆంధ్రదేశ ప్రెక్షకులను ఉర్రూతలూగించాయి. సుబ్బారావు గారి 'రాజు పేద' చిత్రములోని 'జేబులో బొమ్మ జే జేలబొమ్మ' బహుళ ప్రాచుర్యం చెందింది. రోజులు మారాయి (వహీదా రెహ్మాన్ నాట్యముతో)లో 'ఏరువాక సాగారో', 'ఇల్లరికములో ఉన్న మజా' (), 'అయయో జేబులో డబ్బులు పోయెనే' (), 'ముద్దబంతి పూలు బెట్టి' () మొదలగు పాటలు కోట్లాది తెలుగు ప్రేక్షకుల మనసులలో చిరస్మరణీయముగా మిగిలిపోయాయి. అచ్చతెలుగులోని అందాలు, జానపదుల భాషలోని సొగసులు, పల్లెపట్టున ఉండే వారి భాషలోని చమత్కారాలు, విరుపులు రాఘవయ్య పాటలలో జాలువారతాయి. జేబులో బొమ్మ, కళ్ళు తెరచికనరా, ఏరువాకాసాగారో, జయమ్మునిశ్చయమ్మురా, వినరావినరానరుడా..., సరిగంచు చీరగట్టి... శివగోవింద గోవింద, డబ్బులోనే ఉందిరా, నందామయా గురుడ, శివశివమూర్తివి, తింటానిక్కూడుచాలదే, పల్లెటూరు మన భాగ్యసీమరా, చెంగుచెంగునా గంతులు వేయండి, సరదా సరదా సిగిరెట్టు, ఆడుతుపాడుతూ పనిజేస్తుంటే, ముక్కుచూడు ముక్కందం చూడు... ఇలా మూడున్నర దశాబ్దాల కాలంలో మొత్తము 200 చిత్రాలకు 1000 పాటలు వ్రాశాడు.
కొసరాజుగారు ఫెళ్లుమని నవ్వితే, ఆ నవ్వు ఆయన కంఠాన్ని మించిపోయి వుండేది. నిత్యం రైతువేషమే. తెల్లటి ఖద్దరు, నల్లటి గొడుగుతో సౌమ్యభాషణతో కనిపించేవారు కొసరాజుగారు. ఆయనకు జానపద వరసలు తెలుసుగనక, అలాంటి వరసల్లోనే పాటలు రాసి, తన వరసలోనే పాడితే, కొందరు సంగీతదర్శకులు ఆ వరసల్నే తీసుకుని, మెరుగులు దిద్దడం కూడా వుండేది.
ఈయన సిగరెట్టు మీద రాసిన “సరదా సరదా సిగరెట్టు” అనే పాట ఇలాటి వాటిల్లో ముఖ్యంగా చెప్పుకోదగింది. దాన్లో పొగతాగితే “ఊపిరితిత్తుల కేన్సర్ కిదియే కారణమన్నారు డాక్టర్లు” అని ఒక పాత్ర అంటే రెండో పాత్ర వెంటనే, “కాదన్నారులే పెద్ద యాక్టర్లు” అని అప్పట్లో పెద్దపెద్ద యాక్టర్లు సిగరెట్ల వ్యాపార ప్రకటనలు ఇవ్వటం, సినిమాల్లో సిగరెట్లు తాగటాన్ని గ్లామరైజ్ చెయ్యటం, మీద విసిరిన మంచి చెణుకు. ఆ తర్వాత మళ్ళీ మొదటి పాత్ర “థియేటర్లలో పొగతాగటమే నిషేధించినారందుకే” అంటే రెండో పాత్ర “కలెక్షన్లు లేవందుకే” అని చాలా సునిశితమైన జోక్ వెయ్యటం ఈ పాటకి గొప్ప హంగుని తెచ్చిపెట్టింది.
అలాగే పేకాట గురించిన పాట “అయయో చేతులొ డబ్బులు పోయెనే, అయయో జేబులు ఖాళీ ఆయెనే” అనేది కరుణ, హాస్యం కలగలిసి మెరిసిన పాట. ఆ పాట చివరగా అంతా పోయాక కూడా, “గెలుపూ ఓటమి దైవాధీనం చెయ్యి తిరగవచ్చు, మళ్ళీ ఆడి గెల్వవచ్చు, ఇంకా పెట్టుబడెవడిచ్చు, ఇల్లు కుదువబెట్టవచ్చు, ఛాన్సు తగిలితే ఈ దెబ్బతొ మన కరువు తీరవచ్చు” అంటూ జూదగాళ్ళ సైకాలజీని అద్భుతంగా పట్టుకుంటుంది. అంతటితో ఆక్కుండా, “పోతే?” అనే సందేహం, దానికి “అనుభవమ్ము వచ్చు” అనే తిరుగులేని సమాధానం ఈ పాటలో రక్తినీ సూక్తినీ ముక్తాయించటానికి పనికొచ్చినయ్.
ఇలాటిదే మరో ఇల్లరికం అల్లుడి మీద పాట “భలే ఛాన్సులే భలే ఛాన్సులే ఇల్లరికంలో ఉన్న మజా అది అనుభవించితే తెలియునులే” అనేది. దీన్లో అత్తమామల ఆస్తికోసం ఇల్లరికపు అల్లుళ్ళు ఎలాటివైనా భరిస్తారనే విషయాన్ని కళ్ళక్కట్టినట్టు చూపిస్తూ “జుట్టు పట్టుకుని బైటకీడ్చినా చూరుపట్టుకుని వేలాడి, దూషణభూషణ తిరస్కారములు ఆశీస్సులుగా తలిచేవాడికి భలే ఛాన్సులే” అనటం కూడా చక్కటి ప్రయోగం.
ఈ కోవలోదే మరో పాట “చవటాయను నేను వట్ఠి చవటాయను నేను” అనేది. దీన్లో జనానికి, దేశానికి నష్టం కలిగించే పన్లు చేసేవాళ్ళే నిజమైన చవటలని చూపించటం జరిగింది. ఉదాహరణకి ఒక పాత్ర “బడా బడా టెండర్లను పాడి ప్రాజెక్టులు కట్టించాను, వరద దెబ్బకు కొట్టుకుపోతే మళ్ళీ టెండరు పాడాను, చవటాయను నేను వట్ఠి చవటాయను నేను” అంటుంది.
మొత్తం మీద ఇలాటి పాటల్లో ఒక వంక సున్నితమైన హాస్యాన్ని రుచిచూపిస్తూ మరో వంక దురాచారాల్ని, దురలవాట్లని చమత్కారం, అవహేళన మేళవించి ఎత్తిచూపటం జరిగింది.
రాఘవయ్య 'గండికోట యుద్ధము' అను ద్విపద కావ్యము, 'కడగండ్లు' అను పద్యసంకలనం వ్రాశాడు. 'కొసరాజు విసుర్లు','కొండవీటి చూపు', 'నవభారతం', 'భానుగీత' ఇతని ఇతర రచనలు.
కొసరాజు రాఘవయ్య 1986 అక్టోబరు 27 రాత్రి పది గంటలకు మరణించాడు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.