కమలాదేవి ఛటోపాధ్యాయ
స్వాతంత్ర్య సమర యోధురాలు From Wikipedia, the free encyclopedia
కమలాదేవి ఛటోపాధ్యాయ ( 1903 - 1988 ) సంఘసంస్కర్త, స్వాతంత్ర్య సమరయోధురాలు. భారతీయ హస్తకళల అభివృద్ధికి జీవితాంతం కృషిచేసిన మహిళామణి. ఒకప్పుడు దేశ చరిత్రలో వెలిగిన చేనేత వస్త్రాల జిలుగు సొబగులను పరిశోధించి వాటి పెంపుదలకు కృషిచేసిన ఏకైక నారీమణి కమలాదేవి. ఈమె జన్మదినాన్ని పురస్కారించుకొని గూగుల్ ఏప్రిల్ 03, 2018 న తన డూడుల్ ని ఏర్పరచింది
కమలాదేవి ఛటోపాధ్యాయ | |
---|---|
![]() కమలాదేవి ఛటోపాధ్యాయ | |
జననం | కమలాదేవి ఛటోపాధ్యాయ ఏప్రిల్ 3, 1903 మంగళూరు , కర్ణాటక,తమిళనాడు |
మరణం | అక్టోబర్ 29, 1988 |
ప్రసిద్ధి | సంఘసంస్కర్త, స్వాతంత్ర్య సమరయోధురాలు |
భార్య / భర్త | కృష్ణారావు (1917-1919) హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ (1923-?) |
పిల్లలు | రామకృష్ణ ఛటోపాధ్యాయ |
తండ్రి | అనంతయ్య ధారేశ్వర్ |
తల్లి | గిరిజాబాయి |
జీవిత విశేషాలు
కమలాదేవి మంగళూరుకు చెందిన సంపన్న సారస్వత్ బ్రాహ్మణ విద్వాంసుల కుటుంబంలో, అనంతయ్య ధారేశ్వర్, గిరిజాబాయి దంపతుల నాల్గవ కుమార్తెగా ఏప్రిల్ 3, 1903 న జన్మించింది. తండ్రి మంగళూరు జిల్లా కలెక్టరుగా వుండేవారు. తల్లి కర్నాటకలోని ఉన్నత కుటుంబానికి చెందినది. కమలాదేవికి ఏడేళ్ల వయలోనే 1910లో అకస్మాత్తుగా తండ్రి వీలూనామా కూడా వ్రాయకుండా మరణించడంతో, ఆస్తి మొత్తం సవతి సోదరుని పరమై, కుటుంబం కష్టాల పాలయ్యింది.[1] గిరిజాబాయికి ఆస్తి దక్కలేదు. తన బాధ్యతలను వీలైనంత త్వరగా తీర్చుకోవటానికి విధవరాలైన తల్లి కమలాదేవికి 14వ ఏట, 1917లో కృష్ణారావుతో వివాహం జరిపించింది.[2] రెండేళ్లలోనే 1919 లో భర్త మరణించడంతో తనూ విధవరాలైంది. ప్రతిభాశాలి అయిన కమలాదేవి, వితంతువుకు చదువు అనవసరమని అడ్డుకున్నా, నిర్భీకతతో వారిని ధిక్కరించి చెన్నైలోని సెంట్ మేరి పాఠశాలలో చేరి ఉన్నత పాఠశాల చదువు పూర్తిచేసింది. అక్కడున్నపుడే హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయను పెళ్ళాడి, వితంతు వివాహం చెల్లదన్న వాదాన్ని తిప్పికొట్టింది. హరీన్, కమల దంపతులకు రామకృష్ణ ఛటోపాధ్యాయ అనే కొడుకు పుట్టాడు. వివాహం తర్వాత దంపతులు లండన్ చేరారు. కమలా దేవి బెడ్షోర్ కళాశాలలో చదివి, సోషియాలజీలో డిప్లొమా అందుకొన్నది. హరీన్తో ఎక్కువకాలం మనలేదు. కమలాదేవి దిక్కులేని ఒక మహిళను చేరదీసి కొడుకును చూసుకునే పనికి నియమించగా, హరీన్ ఆమెతో వైవాహికేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. అది తెలుసుకొన్న కమలాదేవి వివాహబంధాన్ని తెంపేసింది.[3] వీరిద్దరి విడాకులు భారతదేశంలో చట్టపరంగా విడాకులు మంజూరు చేయబడిన తొలి సంఘటనల్లో ఒకటిగా నమోదయ్యింది.
స్వాతంత్ర్యోద్యమంలో
ఈమె తల్లిదండ్రులు నాటి జాతీయ నాయకులైన మహదేవ గోవింద రనాడే, గోపాలకృష్ణ గోఖలే, రమాబాయి రనాడే, అనిబీసెంట్ లతో సన్నిహితంగా వుండేవారు. 1923లో మహాత్మా గాంధీ పిలుపు అందుకొని సహాయ నిరాకరణ ఉద్యమం సేనాదళ్ సంస్థలో పనిచేసింది. పెక్కు విదేశాలలో పర్యటించి అక్కడి సంస్కరణలు, మహిళల స్థితి గతులు, విద్యాసంస్థలు మున్నగు వాటిని పరిశీలించింది. 1930లో గాంధీజీ ప్రారంభించిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నది. 1930లో జనవరి 26న భారత జాతీయ పతాకాన్ని, పోలీసులు అడ్డుకొన్నా, ఎగురవేసిన సాహసనారి కమలాబాయి. ఈమె జయప్రకాశ్ నారాయణ్, రాంమనోహర్ లోహియాల సోషలిస్టు భావాల వ్యాప్తికి కృషి చేసింది. దేశ విభజనానంతరం ఢిల్లీ సమీపంలోని ఫరీదాబాద్లో పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన 50వేల మహిళలకు వసతి, ఆరోగ్య సౌకర్యం ఏర్పాటు చేసింది.[4]
సినిమా నటిగా

ఆమె నటనలో కూడా దిట్ట. కమలాదేవి ప్రాచీన సంస్కృతనాటకాలను, పద్మశ్రీ మహామాధవ చాకియర్ వద్ద గురుకుల పద్ధతిలో అభ్యసించింది. నాటకాల్లోనే కాక, వసంత సేన, తాన్సేన్ (కె.ఎల్.సైగల్ సహనటుడు), శంకరపార్వతి (1943), ధన్నాభగత్ (1945) సినిమాల్లో నటించి పేరు గడించింది.
హస్తకళల అభివృద్ధిలో
1939 లో ఇండియన్వుమెన్, జాతీయ నాటకరంగం మున్నగు రచనలు చేసింది. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, సంగీత నాటక అకాడమీ, కేంద్ర కుటీర పరిశ్రమల ప్రదర్శనశాల, క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మున్నగు సంస్థలకు శ్రీకారం చుట్టిన మేధావి కమలాదేవి. హస్తకళల ఆవశ్యకతను, సహకార సంస్థల ద్వారా సామాన్య ప్రజల సాంఘిక, ఆర్థిక ప్రగతి సాధించగలమన్న ఆశయంతో స్వాతంత్ర్యానికి ముందు, స్వాతంత్ర్యం తర్వాత ఈమె విశేష కృషి చేసింది.
సత్కారాలు
భారతదేశ గృహకుటీర పరిశ్రమల సముద్ధరణకు అవిశ్రాంతంగా చేసిన సేవలను గుర్తించి 1955లో పద్మభూషణ్, 1987లో పద్మవిభూషణ్ పురస్కారాలతో ప్రభుత్వం గౌరవించింది. రామన్ మెగసేసే అవార్డు, శాంతినికేతన్ నుంచి 'దేశి కోత్తమ' సత్కారం అందుకొన్నది. కమలాదేవి ఛటోపాధ్యాయ తన 85వ ఏట అక్టోబర్ 29, 1988 న తుది శ్వాస వదిలారు.
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.