2009
From Wikipedia, the free encyclopedia
2009 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము. 2009లో స్థానికంగా, జాతీయంగా, అంతర్జాతీయంగా ఎన్నో ముఖ్యమైన పరిణామాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్లో శాసనసభ ఎన్నికలలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారం చేపట్టడం, కొద్దిరోజులకే వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణించడం, రోశయ్య నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగాయి. అక్టోబరు మొదటివారంలో కృష్ణా, తుంగభద్ర వరదల వలన వందలాది గ్రామాలు, మంత్రాలయం, కర్నూలు లాంటి పట్టణాలు నీటమునిగాయి. జాతీయంగా జరిగిన ముఖ్యపరిణామాలలో కేంద్రంలో మళ్ళీ యు.పి.ఏ.అధికారంలో కొనసాగింది. స్వైన్ ఫ్లూ వ్యాధి దేశమంతటా హడలెత్తించింది. మహారాష్ట్ర, హర్యానా, అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో మూడింటిలోనూ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను పొందినది. ప్రత్యేక తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు ఆమరణ దీక్ష చేపట్టడం, కేంద్రం ప్రత్యేక తెలంగాణా ఏర్పాటుకు సుముఖం వ్యక్తం చేయడం, ఆ తరువాత ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో అల్లర్లు, మళ్ళీ కేంద్రం మాటమార్చడంతో తెలంగాణ పోరాటాల అగ్ని గుండంగా మారింది.