సముద్ర గుప్తుడు
From Wikipedia, the free encyclopedia
సముద్రగుప్తుడు, భారతదేశాన్ని పాలించిన గుప్త వంశపు చక్రవర్తి. ఇతని పాలనా కాలం సుమారు సా.శ. 335 – 380 మధ్య కావచ్చును. భారతదేశ చరిత్రలో అత్యంత సమర్ధులైన యుద్ధనాయుకులలో ఇతనొకడని చరిత్రకారుడు వి.ఎ.స్మిత్ భావించాడు [1] ఇతనిని "భారత దేశపు నెపోలియన్" అని పాశ్చాత్య చరిత్రకారులు వర్ణించారు.
సముద్రగుప్తుడు | |
---|---|
గుప్త సామ్రాట్టు | |
సముద్రగుప్తుని నాణెము - గరుడ స్తంభంతో (బ్రిటిష్ మ్యూజియం). | |
పరిపాలన | c. 350 – 375 |
మకుటాలు | పరాక్రమాంక |
ఇంతకు ముందున్నవారు | 1వ చంద్రగుప్తుడు |
తరువాతి వారు | 2వ చంద్రగుప్తుడు |
రాణి | దత్తదేవి |
వంశము | గుప్తవంశము |
సముద్రగుప్తుని విజయయాత్రల వివరాలు అలహాబాదు ప్రశస్తి అనబడే శాసనంలో ఉన్నాయి. ఇది సముద్రగుప్తుని గురించి, అప్పటి ఇతర రాజ్యాల గురించి తెలిపే ఒక ముఖ్య చారిత్రికాధారం. సముద్రగుప్తుని ఆస్థానంలో కవి అయిన హరిసేనుడు వ్రాసిన ఈ శాసనం 4వ శతాబ్దంలో వివిధ ప్రాంతాలలో రాజుల గురించి ప్రస్తావిస్తున్నది.
రాజ్యాధికారం చేపట్టగానే సముద్రగుప్తుడు పొరుగురాజులైన అచ్యుత (అహిచ్చాత్ర రాజు), నాగసేనులను జయించాడు. తరువాత దక్షిణదేశ దండయాత్రలకు వెళ్ళాడు. ఇప్పటి మధ్య ప్రదేశ్, ఒడిషా, తీరాంధ్రం (కళింగ, వేంగి, వెల్లూరు రాజ్యాలు) జయించి కాంచీపురం వరకు జయించి అక్కడి రాజులను సామంతులుగా చేసుకొన్నాడు. వారి రాజ్యాలను హస్తగతం చేసుకొనలేదు. పశ్చిమ దేశాంతరాలలోని శక, కుషాణు రాజులు కూడా అతని సార్వభౌమత్వాన్ని అంగీకరించారు. సముద్రగుప్తునికి పెద్ద బలమైన సైన్యం, నౌకాదళం కూడా ఉండేవని తెలుస్తున్నది.
సముద్ర గుప్తుడు విడుదల చేసిన నాణేల వలన కొన్ని చారిత్రిక విషయాలు తెలుస్తున్నాయి. మొత్తం 8 రకాల పూర్తి బంగారు నాణేలు విడుదల చేశాడు.అతని కాలంలో హిందూమతం తిరిగి వైభవాన్ని సంతరించుకోసాగింది కాని అతడు అన్యమతస్తులను బాధించిన దాఖలాలు లేవు. సిలోన్ రాజుకు బోధిగయలో బౌద్ధారామం కట్టుకోవడానికి అనుమతి ఇచ్చాడు. సముద్ర గుప్తుని ఆస్తానంలో ఎందరో కవులు, పండితులు ఉండేవారు. సముద్రగుప్తుడు కళా, సాహిత్య పోషకుడు కూడాను. అతను వీణను వాయిస్తున్నట్లుగా కొన్ని నాణేలలో ఉంది.
సముద్రగుప్తుడు సా.శ. 380లో మరణించి ఉండవచ్చును. ఋతని తరువాత కొడుకులు రామగుప్తుడు, 2వ చంద్రగుప్తుడు రాజ్యం చేశారు.[2] [3]