రాఖీగఢీ
హర్యానా లోని ప్రాచీన మానవ ఆవాస స్థలం / From Wikipedia, the free encyclopedia
రాఖీగఢీ హర్యానా రాష్ట్రపు హిసార్ జిల్లాలోని గ్రామం. ఢిల్లీకి వాయవ్యంగా 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ సింధులోయ నాగరికతకు పూర్వపు కాలానికి (సా.శ.పూ 6500) చెందిన మానవ ఆవాస స్థలం ఉంది. ఇక్కడే ప్రౌఢ సింధు లోయ నాగరికతకు (సా.శ.పూ. 2600-1900) చెందిన ఆవాస స్థలం కూడా ఉంది.[2] ఇది ఘగ్గర్-హక్రా నది పరీవాహక ప్రాంతంలో,[3] ఘగ్గర్ నది నుండి 27 కి.మీ. దూరంలో ఉంది.
ఇతర పేర్లు | రాఖీగఢీ |
---|---|
స్థానం | హర్యానా |
నిర్దేశాంకాలు | 29°17′35″N 76°6′51″E |
రకం | జనావాసం |
వైశాల్యం | 80–105 hectares (0.80–1.05 కి.మీ2; 0.31–0.41 చ. మై.) (Gregory Possehl, Rita P. Wright, Raymond Allchin, Jonathan Mark Kenoyer) 350 hectares (3.5 కి.మీ2; 1.4 చ. మై.)[1] |
చరిత్ర | |
సంస్కృతులు | సింధు లోయ నాగరికత |
స్థల గమనికలు | |
తవకాల తేదీలు | 1963, 1997–2000, 2011-ఇప్పటివరకు |
రాఖీగఢీలో 7 దిబ్బల సముదాయం ఉంది. దాని చుట్టుపక్కల ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఒకే కాలానికి చెందినవి కావు. ఏయే కాలాలకు చెందిన దిబ్బలను కలిపి చూడాలన్నదాన్ని బట్టి రాఖీగఢీ విస్తీర్ణం 80 నుండి 550 హెక్టార్ల వరకూ ఉంటుంది.[4] 2014 జనవరిలో కనుగొన్న కొత్త దిబ్బల తరువాత ఇది సింధులోయ నాగరికత స్థలాలలోకెల్లా అతి పెద్దదిగా అయింది. 350 హెక్టార్లతో ఇది మొహెంజోదారో కంటే దాదాపు 50 హెక్టార్లు పెద్దది.[5]
పరిమాణము, విశిష్టతల కారణంగా రాఖీగఢీ ప్రపంచవ్యాప్తంగా పురాతత్వవేత్తల దృష్టిని ఆకర్షించింది. మిగతా స్థలాల కంటే ఇది ఢిల్లీకి దగ్గరగా ఉండి, ఉత్తర భారతదేశంలో సింధు లోయ నాగరికత వ్యాప్తిని సూచిస్తోంది. ఈ స్థలంలో చాలా వరకూ ఇంకా తవ్వకాలు జరపాల్సి ఉంది, విశేషాలను ప్రచురించాల్సీ ఉంది.: 215 ఈ ప్రాంతంలోని మరో స్థలం మిటాహాలి లో తవ్వకాలు మొదలు పెట్టాల్సి ఉంది.
2012 మే లో గ్లోబల్ హెరిటేజ్ ఫండ్, ఆసియాలో ప్రమాదపు అంచున ఉన్న తొలి 10 ప్రాచీన వారసత్వ స్థలాల్లో ఒకటిగా రాఖీగఢ్ను గుర్తించింది.[6] సండే టైమ్స్ పత్రిక - ఈ స్థలాన్ని సరిగా పట్టించుకోవడం లేదని, చుట్టూ ఉన్న ఇనుప కంచె విరిగి పోయిందని, గ్రామస్థులు అక్కడి పురావస్తువులను తవ్వి అమ్ముకుంటున్నారని, ఇళ్ళ నిర్మాణం కోసం స్థలం ఆక్రమణలకు గురౌతోందనీ రాసింది.[7] 2018 మే 23 న అక్రమంగా నిర్మించిన 24 నిర్మాణాలను ప్రభుత్వం కూల్చివేసింది. ప్రజలు ఇందుకు సహకరించారని అధికారులు తెలిపారు.[8]