![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/c/c7/MunichAgreement.jpg/640px-MunichAgreement.jpg&w=640&q=50)
మ్యూనిక్ ఒప్పందం
From Wikipedia, the free encyclopedia
మ్యూనిక్ ఒప్పందం జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రెంచి థర్డ్ రిపబ్లిక్, ఇటలీ సామ్రాజ్యాల మధ్య 1938 సెప్టెంబరు 30 న మ్యూనిక్లో కుదిరిన ఒప్పందం. ఈ ఒప్పందం ప్రకారం చెకోస్లోవేకియా లోని సుడేటన్ల్యాండ్ భూభాగం జర్మనీకి ధారాదత్తమైంది. ఫ్రాన్స్, చెకోస్లోవాక్ రిపబ్లిక్ ల మధ్య 1924 నాటి కూటమి ఒప్పందం, 1925 నాటి సైనిక ఒప్పందాలు ఉన్నప్పటికీ, ఫ్రాన్సు ఈ ఒప్పందంపై సంతకం చెయ్యడంతో చెక్ ప్రజలు దీన్ని మ్యూనిక్ ద్రోహం అని నిరసించారు. [1] మ్యూనిక్ ఒప్పందం కుదరడంతో ఐరోపాలో చాలా భాగం సంబరాలు జరుపుకుంది. ఈ ఒప్పందం, ఖండంలో ఒక పెద్ద యుద్ధాన్ని నివారించిందని భావించారు. చెకొస్లవేకియా సరిహద్దు ప్రాంతంలో, 30 లక్షల కంటే ఎక్కువ మంది ప్రజలు - ముఖ్యంగా జర్మన్లు - నివసించే సుడేటన్ల్యాండ్ను జర్మనీ ఆక్రమించేందుకు నాలుగు దేశాలూ అంగీకరించాయి. ఐరోపాలో భూభాగాలపై ఇదే తన చివరి దావా అని హిట్లర్ ప్రకటించాడు.
![]() హిట్లరుతో సమావేశం తరువాత హెస్టన్ విమానాశ్రయంలో బ్రిటిషు ప్రధాని నెవిల్ చాంబర్లేన్ | |
సంతకించిన తేదీ | 1938 సెప్టెంబరు 30 |
---|---|
కక్షిదారులు |
|
1938 సెప్టెంబరు 17 న చెకోస్లోవేకియాపై జర్మనీ స్వల్ప స్థాయి అప్రకటిత యుద్ధాన్ని ప్రారంభించింది. దానికి ప్రతిస్పందనగా సెప్టెంబరు 20 న, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్లు చెకోస్లోవేకియాను తన భూభాగాన్ని జర్మనీకి అప్పగించమని అధికారికంగా కోరాయి. దీని తరువాత, సెప్టెంబరు 21 న పోలండు, సెప్టెంబరు 22 న హంగరీలూ చెక్ భూభాగంపై తమతమ హక్కుల డిమాండ్లను లేవనెత్తాయి. ఇంతలో, జర్మనీ దళాలు చెక్ దేశం లోని చెబ్ జిల్లాను, జెసెనక్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలనూ జయించాయి. కాని డజన్ల కొద్దీ ఇతర సరిహద్దు కౌంటీల నుండి వారికి ప్రతిఘటన ఎదురై, వెనక్కు తగ్గాల్సి వచ్చింది. పోలండ్ తన సైనిక విభాగాలను చెకోస్లోవేకియా సరిహద్దుకు సమీపంలో సమీకరించింది. సెప్టెంబరు 23 న ఒక విఫల కుట్రకు ప్రేరేపించింది. హంగరీ కూడా తన సైనికులను చెకోస్లోవేకియా సరిహద్దు వైపు తరలించింది కానీ దాడి చెయ్యలేదు.
1938 సెప్టెంబరు 29-30 న జర్మనీలోని మ్యూనిక్లో ప్రధాన యూరోపియన్ శక్తుల అత్యవసర సమావేశం జరిగింది. ఆ సమయంలో చెకోస్లోవేకియా ప్రతినిధులు పట్టణం లోనే ఉన్నప్పటికీ, వాళ్ళను ఆ సమావేశానికి పిలవలేదు. ఫ్రాన్స్, చెకోస్లోవేకియాల మిత్రదేశమైన సోవియట్ యూనియన్ కూడా ఆ సమావేశంలో లేదు. హిట్లరు, తాను కోరుకున్న విధంగా తయారు చేసిన ఒక ఒప్పంద పత్రంపై జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, ఇటలీ నాయకులు ఆ సమావేశంలో సంతకాలు చేసారు. జర్మనీని ప్రసన్నం చేసుకోవడానికి గాను, దానికి ధారాదత్తం చేసిన చెకోస్లోవాక్ పర్వత సరిహద్దు భూభాగం మధ్యయుగ కాలం నుండి చెక్, జర్మనీల మధ్య సహజమైన సరిహద్దుగా ఉంది. అంతేకాదు, చెక్పై జర్మనీ దాడి చేస్తే, ఇది దానికి సహజమైన అడ్డుగోడగా ఉంటుంది. సరిహద్దు దుర్గాలను నిర్మించి గణనీయంగా బలోపేతం చేసుకున్న సుడేటన్ల్యాండ్ ప్రాంతం చెకోస్లోవేకియాకు వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనది.
జర్మనీ, పోలండు, హంగేరీల సైనిక ఒత్తిడికి, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్సుల దౌత్యపరమైన ఒత్తిడికీ చెకోస్లోవేకియా లొంగిపోయి, మ్యూనిక్ నిబంధనల ప్రకారం జర్మనీకి తన భూభాగాన్ని వదులుకోవడానికి సెప్టెంబరు 30 న అంగీకరించింది. అప్పుడు, అక్టోబరు 1 న, పోలండు చేసిన భూభాగ డిమాండ్లను కూడా చెకోస్లోవేకియా అంగీకరించింది. [2]
మ్యూనిక్ ఒప్పందం కుదిరిన వెనువెంటనే, అక్టోబరు 1-10 మధ్య, సుడేటన్ల్యాండ్ జర్మనీలో కలిసిపోయిది. 1938 నవంబరు 2 న మొదటి వియన్నా అవార్డు ఉనికి లోకి వచ్చింది. దీని ప్రకారం దక్షిణ స్లోవేకియాలో హంగేరియన్లు ఎక్కువగా నివసించే భూభాగాలనూ, దక్షిణ సబ్కార్పాథియన్ రస్నూ చెకోస్లోవేకియా నుండి విభజించారు. చెకోస్లోవేకియా ఉత్తర భూభాగాలను పోలండు స్వాధీనం చేసుకుంది. 1939 మార్చిలో, మొదటి స్లోవాక్ రిపబ్లిక్ స్వాతంత్ర్యం ప్రకటించుకుంది. కొంతకాలం తర్వాత, బోహీమియా మొరావియా ప్రొటెక్టరేట్ను ఏర్పాటు చేయడం ద్వారా, జర్మనీ మిగిలిన చెక్ భూభాగాలపై పూర్తి నియంత్రణ సాధించింది. తద్వారా ముఖ్యమైన సైనిక ఆయుధాగారం కూడా జర్మనీ చేజిక్కింది. తదనంతర కాలంలో పోలండు, ఫ్రాన్సులపై జర్మనీ చేసిన దండయాత్రలలో ఈ ఆయుధ సామాగ్రే ముఖ్యమైన పాత్ర పోషించింది. [3]
నేడు, మ్యూనిక్ ఒప్పందాన్ని ఒక విఫలమైన బుజ్జగింపు చర్యగా పరిగణిస్తారు. ఈ పదం "విస్తరణవాద నిరంకుశ దేశాలను బుజ్జగించడమనే వృథాప్రయాసకు పర్యాయపదం"గా నిలిచింది. [4]