మొదటి ప్రపంచ యుద్ధం
1914-18 మధ్య ఐరోపా కేంద్రంగా జరిగిన ప్రపంచవ్యాప్త యుద్ధం / From Wikipedia, the free encyclopedia
మొదటి ప్రపంచ యుద్ధం, ఐరోపాలో ఉద్భవించిన ప్రపంచ యుద్ధం. ఈ యుద్ధం 1914 జూలై 28 నుండి 1918 నవంబరు 11 వరకు జరిగింది. దీనిని మహా యుద్ధం (గ్రేట్ వార్) అనీ, అన్ని యుద్ధాలనూ ముగించే యుద్ధం (వార్ టు ఎండ్ ఆల్ వార్స్) అని కూడా పిలుస్తారు. ఇది చరిత్రలో జరిగిన అతిపెద్ద యుద్ధాల్లో ఒకటిగా నిలిచింది. 6 కోట్ల మంది ఐరోపాలతో సహా మొత్తం 7 కోట్ల మంది సైనిక సిబ్బంది ఈ యుద్ధంలో పాల్గొన్నారు. 90 లక్షల మంది సైనికులు, 70 లక్షల మంది పౌరులూ మరణించారు.
మొదటి ప్రపంచ యుద్ధం | |||||||
---|---|---|---|---|---|---|---|
పైనుంచి సవ్యదిశలో: పశ్చిమ రంగంలో కందకాలు; కందకాన్ని దాటుతున్న బ్రిటిషు మార్క్-IV ట్యాంకు; రాయల్ నేవీ యుద్ధ నౌక HMS ఇర్రెసిస్టిబుల్ ఒక మందుపాతరను డీకొట్టి మునిగిపోతున్న దృశ్యం; వికర్స్ మషీన్ గన్ సిబ్బంది, గ్యాస్ మాస్కులతో, జర్మను అల్బట్రాస్ బైప్లేన్లు | |||||||
| |||||||
ప్రత్యర్థులు | |||||||
మిత్ర రాజ్యాలు
| కేంద్ర రాజ్యాలు:
| ||||||
సేనాపతులు, నాయకులు | |||||||
|
| ||||||
బలం | |||||||
మొత్తం: 4,29,28,000[1] | మొత్తం: 2,52,48,000[1] | ||||||
6,81,76,000 (అంతా) | |||||||
ప్రాణ నష్టం, నష్టాలు | |||||||
|
|
ఆస్ట్రియాకు చెందిన ఆర్చ్డ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్ హత్య ఈ యుద్ధానికి నాంది పలికింది. ఆస్ట్రియా-హంగరీ సింహాసనానికి వారసుడైన ఆర్చ్డ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్ను 1914 జూన్ 28 న సారయెవో నగరంలో యుగోస్లావ్ జాతీయవాది గవ్రిలో ప్రిన్సిప్ హత్య చేయడంతో జూలై సంక్షోభం తలెత్తింది. ఈ హత్యకు స్పందనగా జూలై 23 న ఆస్ట్రియా-హంగరీ సెర్బియాకు అల్టిమేటం ఇచ్చింది. దానికి సెర్బియా ఇచ్చిన సమాధానం వారిని సంతృప్తిపరచలేదు. రెండు దేశాలూ యుద్ధానికి సిద్ధపడ్డాయి.
ఈ యుద్ధంలో ఐరోపా లోని గొప్ప శక్తులన్నీ రెండు ప్రత్యర్థి కూటములుగా ఏర్పడ్డాయి. అవి: ట్రిపుల్ ఎంటెంట్ (రష్యా సామ్రాజ్యం, ఫ్రాన్సు, గ్రేట్ బ్రిటన్), ట్రిపుల్ అలయన్స్ (జర్మనీ, ఆస్ట్రియా-హంగరీ, ఇటలీ). తదనంతర కాలంలో ట్రిపుల్ ఎంటెంట్ కు మిత్రరాజ్యాలు అని, ట్రిపుల్ అలయన్స్ కు కేంద్ర శక్తులు (సెంట్రల్ పవర్స్) అనీ పేర్లు వచ్చాయి. ట్రిపుల్ అలయన్స్ స్థాపనోద్దేశం ఆత్మ రక్షణే కానీ, దాడి చెయ్యడం కాదు. ఈ కారణం వల్లనే ఇటలీ 1915 ఏప్రిల్ దాకా యుద్ధంలో దిగలేదు. ఆ తరువాత ఆస్ట్రియా-హంగరీతో ఉన్న విభేదాల కారణంగా, అది ట్రిపుల్ అలయన్స్ నిబంధనలకు వ్యతిరేకంగా దాడి మొదలుపెట్టిందని చెబుతూ ఇటలీ, అలయన్స్ నుండి బయటికి వచ్చి మిత్రరాజ్యాల పక్షాన యుద్ధంలో చేరి పోరాడింది. ఈ కూటములు రెండూ తరువాతి కాలంలో మరిన్ని దేశాలు చేరడంతో విస్తరించాయి. ఇటలీ, జపాన్, అమెరికాలు మిత్రరాజ్యాలతో చేరాయి. ఓట్టోమన్ సామ్రాజ్యం, బల్గేరియాలు సెంట్రల్ పవర్స్తో చేతులు కలిపాయి.
1914 జూలై 28 న ఆస్ట్రియా-హంగరీ, సెర్బియా రాజధాని బెల్గ్రేడ్పై దాడి చేసాక, రష్యా సెర్బియాకు దన్నుగా నిలవాలని భావించి, సమీకరణ మొదలుపెట్టింది.[2] జూలై 30 న రష్యా సంపూర్ణ సమీకరణ ప్రకటించింది; 31 న ఆస్ట్రియా-హంగరీ, జర్మనీలు కూడా సమీకరణలు ప్రకటించాయి. రష్యా సమీకరణను ఆపాలని, 12 గంటల్లోగా నిస్సమీకరణ చెయ్యాలనీ జర్మనీ డిమాండు చేసింది.[3] రష్యా ఈ డిమాండును తోసిపుచ్చడంతో, ఆగస్టు 1 న జర్మనీ, ఆస్ట్రియా-హంగరీకి మద్దతుగా రష్యాపై యుద్ధం ప్రకటించింది. ఆగస్టు 6 న ఆస్ట్రియా-హంగరీ కూడా రష్యాపై యుద్ధం ప్రకటించింది; ఆగస్టు 3 న రష్యాకు మద్దతుగా ఫ్రాన్సు కూడా సమీకరణ ప్రకటించింది.[4]
ఆగస్టు 3 న జర్మనీ ఫ్రాన్స్పై యుద్ధం ప్రకటించింది; అదే రోజున బెల్జియంలోని ఏ ప్రాంతం నుండైనా తమ సైన్యాన్ని వెళ్ళనివ్వాలనీ దాన్ని అడ్డుకోరాదనీ డిమాండు చేస్తూ బెల్జియం ప్రభుత్వానికి జర్మనీ అల్టిమేటం పంపింది. బెల్జియమ్ దాన్ని నిరాకరించింది. దీంతో ఆగస్టు 4 తెల్లవారుజామున జర్మనీ బెల్జియంపై దాడి చేసింది; 1839 లండన్ ఒప్పందం ప్రకారం బెల్జియం రాజు బ్రిటన్ సహాయం కోరాడు.[5][6] [7] బెల్జియం తటస్థతను జర్మనీ గౌరవించాలని బ్రిటన్ డిమాండ్ చేసింది; జర్మనీ సమాధానం "సంతృప్తికరంగా లేనందున" 1914 ఆగస్టు 4 న బ్రిటన్, జర్మనీపై యుద్ధం ప్రకటించింది.
ఆగస్టు 12 న బ్రిటన్, ఫ్రాన్సులు ఆస్ట్రియా-హంగరీపై యుద్ధం ప్రకటించాయి; ఆగస్టు 23 న జపాన్, బ్రిటన్తో చేయి కలిపి చైనా, పసిఫిక్లలోని జర్మను స్థావరాలను ఆక్రమించుకుంది. 1914 నవంబరులో ఓట్టోమన్ సామ్రాజ్యం సెంట్రల్ పవర్స్ లో చేరింది. ఫ్రాన్స్లోకి జర్మనీ పురోగతి మార్నే యుద్ధంతో ఆగిపోయింది. 1915 లో, ఇటలీ మిత్రరాజ్యాలలో చేరి ఆల్ప్స్లో ఒక ఫ్రంట్ తెరిచింది. బల్గేరియా 1915 లో సెంట్రల్ పవర్స్లో చేరింది. గ్రీస్ 1917 లో మిత్రరాజ్యాలలో చేరి బాల్కన్లో యుద్ధాన్ని విస్తరించింది. అమెరికా మొదట్లో తటస్థంగా ఉన్నప్పటికీ అది మిత్రరాజ్యాలకు యుద్ధ సామగ్రిని అందించే ముఖ్యమైన సరఫరాదారుగా మారింది. చివరికి, జర్మన్ జలాంతర్గాములు అమెరికన్ వర్తక నౌకలను ముంచివేసిన తరువాత, జర్మనీ తన నావికాదళం తటస్థ షిప్పింగ్పై అనియంత్రిత దాడులను తిరిగి ప్రారంభిస్తుందని ప్రకటించడం, అమెరికాపై యుద్ధం చేయడానికి మెక్సికోను జర్మనీ ప్రేరేపించడానికి ప్రయత్నిస్తోందని వెల్లడవడంతో, 1917 ఏప్రిల్ 6 న అమెరికా జర్మనీపై యుద్ధం ప్రకటించింది. శిక్షణ పొందిన అమెరికన్ దళాలు 1918 మధ్యకాలానికి గానీ పెద్ద సంఖ్యలో యుద్ధం లోకి దిగలేదు. కాని చివరికి అమెరికన్ ఎక్స్పెడిషనరీ ఫోర్స్ 20 లక్షల మంది సైనికుల సంఖ్యకు చేరుకుంది.[8]
1915 లో సెర్బియా ఓడిపోయినప్పటికీ, రొమేనియా 1916 లో మిత్రరాజ్యాల శక్తులలో చేరింది. 1917 లో ఓడిపోయింది. రష్యాలో 1917 ఫిబ్రవరి విప్లవం తరువాత జారిస్ట్ నిరంకుశత్వాన్ని తొలగించి, తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. కాని యుద్ధ వ్యయం పట్ల నిరంతర అసంతృప్తి అక్టోబర్ విప్లవానికి, సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఏర్పాటుకు, బ్రెస్ట్-లిటోవ్స్క్ ఒప్పందంపై 1918 మార్చిలో కొత్త ప్రభుత్వం సంతకం చేయడానికీ దారి తీసింది. దీంతో యుద్ధంలో రష్యా ప్రమేయం ముగిసింది. తూర్పు నుండి పశ్చిమ రంగానికి పెద్ద సంఖ్యలో జర్మన్ దళాలను బదిలీ చేయడానికి వీలైంది. దీని ఫలితంగా 1918 మార్చిలో జర్మన్ దాడి జరిగింది. ఈ దాడి తొలుత విజయవంతమైంది గానీ, నిర్ణయాత్మక విజయాన్ని సాధించడంలో విఫలమైంది. మిత్రరాజ్యాలు తమ వందరోజుల దాడిలో జర్మనీని వెనక్కి నెట్టాయి.[9] 1918 సెప్టెంబరు 29 న యుద్ధ విరమణపై సంతకం చేసిన మొట్టమొదటి సెంట్రల్ పవర్ బల్గేరియా. అక్టోబరు 30 న, ఉస్మానియా ("ఒట్టోమన్" ఆంగ్లంలో, పాత పేరు "తురుకు" కూడా) సామ్రాజ్యం లొంగిపోయి, ముడ్రోస్ కాల్పుల విరమణపై సంతకం చేసింది.[10] నవంబరు 4 న ఆస్ట్రో-హంగేరియన్ సామ్రాజ్యం, విల్లా గియుస్టి కాల్పుల విరమణకు అంగీకరించింది. జర్మనీ మిత్రదేశాలు ఓడిపోవడం, దేశంలో తిరుగుబాటు, మిలిటరీ ఇకపై పోరాడటానికి ఇష్టపడకపోవడం వగైరాలతో, కైజర్ విల్హెల్మ్ను నవంబరు 9 న పదవీచ్యుతుణ్ణి చేశారు. 1918 నవంబరు 11 న జర్మనీ కాల్పుల విరమణపై సంతకం చేయడంతో, యుద్ధం ముగిసింది.
మొదటి ప్రపంచ యుద్ధం ప్రపంచంలోని రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక వాతావరణంలో ఒక ముఖ్యమైన మలుపు. రెండవ పారిశ్రామిక విప్లవానికి, పాక్స్ బ్రిటానికా ముగింపుకూ గుర్తుగా ఈ యుద్ధాన్ని పరిగణిస్తారు. యుద్ధం దాని తక్షణ పరిణామాలు అనేక విప్లవాలు, తిరుగుబాట్లను లేవనెత్తాయి. బిగ్ ఫోర్ (బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా, ఇటలీ) 1919 పారిస్ శాంతి సదస్సులో అంగీకరించిన వరుస ఒప్పందాల ద్వారా ఓడిపోయిన దేశాలపై తమ నిబంధనలను విధించాయి. వీటిలో ప్రసిద్ధమైనది జర్మనీ ఓటమిని అంగీకరించిన వెర్సైల్లెస్ ఒప్పందం.[11] అంతిమంగా, యుద్ధం ఫలితంగా ఆస్ట్రో-హంగేరియన్, జర్మన్, ఉస్మానియా, రష్యన్ సామ్రాజ్యాలు ఉనికిలో లేకుండా పోయాయి. వాటి అవశేషాల నుండి అనేక కొత్త దేశాలు వెలుగుచూసాయి. అయితే, మిత్రరాజ్యాలు విజయం సాధించినప్పటికీ (భవిష్యత్ యుద్ధాలను నివారించడానికి నానాజాతి సమితిని ఏర్పాటు చేసినప్పటికీ ), కేవలం ఇరవై సంవత్సరాల తరువాత రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది..