From Wikipedia, the free encyclopedia
మొదటి ఆంగ్లో-సిక్ఖు యుద్ధం సిక్ఖు సామ్రాజ్యం, ఈస్టిండియా కంపెనీల మధ్య 1845 నుంచి 1846 మధ్యకాలంలో జరిగిన యుద్ధం. బ్రిటీష్ పక్షం విజయం సాధించడంతో పాక్షికంగా సిక్ఖు సామ్రాజ్యం బ్రిటీష్ వారికి లొంగిపోయింది.
First Anglo-Sikh War | |||||||
---|---|---|---|---|---|---|---|
Topographical map of The Punjab The Land of 5 Waters | |||||||
| |||||||
ప్రత్యర్థులు | |||||||
British East India Company Patiala State[1][2] Jind State[3] | Sikh Empire |
19వ శతాబ్దపు తొలి నాళ్లలో భారత ఉపఖండపు వాయువ్యభాగంలో మహారాజా రంజిత్ సింగ్ సిక్ఖు సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ, స్థిరపరుస్తూ ఉన్నకాలానికల్లా తూర్పు భారతం (ప్లాసీ, బక్సర్ యుద్ధాలు), దక్షిణ భారతం (ఆంగ్లో-మైసూరు యుద్ధాలు), మధ్యభారతం (ఆంగ్లో-మరాఠా యుద్ధాలు)పై ఆధిపత్యాన్ని సాధించి పంజాబ్ సరిహద్దుల దాకా తమ పాలనను విస్తరించారు. రంజిత్ సింగ్ జాగ్రత్తతో కూడిన స్నేహాన్ని ఈస్టిండియా కంపెనీతో పాటించాడు. సట్లెజ్ నదికి దక్షిణాన ఉన్న కొన్ని ప్రాంతాలను బ్రిటీష్ వారికి ఇచ్చివేస్తూనే,[4] బ్రిటీష్ వారి దురాక్రమణ ధోరణిని అడ్డుకునేందుకు, ఆఫ్ఘాన్లపై యుద్ధం ప్రారంభించేందుకు కూడా ఉపయోగపడేలా సైనిక శక్తిని నిర్మించడం ప్రారంభించాడు. అమెరికన్, యూరోపియన్ సైనికులను జీతాలకు పెట్టుకుని తమ సైన్యాన్ని ఫిరంగుల వాడకానికి శిక్షణ ఇప్పించుకునేవాడు, అంతేకాక హిందువులు, ముస్లిములను సైన్యభాగాల్లో చేర్చుకున్నాడు.
ఆఫ్ఘాన్లలోని అనైక్యతను ఆధారంగా చేసుకుని సిక్ఖులు పెషావర్, ముల్తాన్ ప్రావిన్సులు, పలు ఆఫ్ఘాన్ నగరాలను గెలిచి తమ పాలనలోని జమ్ము, కాశ్మీర్ రాజ్యాల్లో విలీనం చేశారు. ఆఫ్ఘనిస్తాన్లో రాజ్యవ్యవస్థ పున:స్థాపన జరగగానే, బ్రిటీష్ వారు ఆఫ్ఘాన్ రాజు ఎమిర్ దోస్త్ మొహమ్మద్ ఖాన్, రష్యా సామ్రాజ్యంతో కుమ్మక్కై తమకు వ్యతిరేకంగా కుట్రచేస్తున్నాడన్న ఆలోచనతో ఉక్కిరిబిక్కిరై, అతన్ని తొలగించి షుజా షా దురానీని పాలకుణ్ణి చేసేందుకు మొదటి ఆంగ్లో-ఆఫ్ఘాన్ యుద్ధం ప్రారంభించారు. మొదట్లో బ్రిటీష్ ఆక్రమణ విజయవంతమైనట్టు కనిపించినా, ఎల్ఫిన్ స్టోన్ సైన్యం ఊచకోతతో దారుణమైన మలుపు తీసుకోవడంతో ఆఫ్ఘనిస్తాన్ నుంచి 1842లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి, పెషావర్ నుంచి వెనుదిరిగారు. బ్రిటీష్ సైన్యం, మరీముఖ్యంగా బెంగాల్ సైన్యం ప్రతిష్ఠ ణంగా అడుగంటింది.
1839లో రంజిత్ సింగ్ మరణించాడు, వెనువెంటనే అతని సామ్రాజ్యం అవ్యవస్థితంగా తయారైంది. రంజిత్ సింగ్ కుమారుడు, అప్రఖ్యాతుడు అయిన ఖరక్ సింగ్ కొద్ది నెలల్లోనే పదవీ చ్యుతుడయ్యాడు, తర్వాత జైలులో అనుమానాస్పదంగా మరణించాడు. అతినికి విషం ఇచ్చి చంపారని అందరూ నమ్మారు.[5] అతనికి విరుద్ధంగగా వ్యవహరించిన, సమర్థుడైన అతని కుమారుడు కున్వర్ నౌ నిహాల్ సింగ్ సింహాసనం ఎక్కాడు. కానీ తన తండ్రి అంత్యక్రియల నుంచి వెనుదిరిగి వస్తూండగా అనుమానాస్పద పరిస్థితుల్లో లాహోరు కోట కమాను ద్వారం నుంచి పడిపోయి గాయాలతో మరణించాడు.[6]
సిక్ఖు సింధన్ వాలియాలు, హిందూ డోగ్రాలు ఆ సమయంలో పంజాబ్ లో అధికారాన్ని స్వంతం చేసుకోవడానికి పోరాడుతూ ఉన్నారు. 1841 జనవరిలో రంజిత్ సింగ్ అక్రమ సంతానమైన పెద్ద కొడుకు షేర్ సింగ్ కి రాజ్యం ఇవ్వడంలో విజయం సాధించారు. అత్యంత ప్రాబల్యమైన సింధన్వాలియా వర్గం బ్రిటీష్ భూభాగంలో రక్షణ కోసం పారిపోయింది, కానీ వీరికి అనుకూలురైనవారు చాలామంది పంజాబ్ సైన్యంలో ఉండేవారు.
రంజిత్ రాజ్ మరణానంతరం, భూస్వాములు సాయుధీకరింపబడుతూ, సైన్యాన్ని పోగుచేస్తూండడంతో 29 వేల (192 తుపాకులతో) నుంచి 80 వేలకు పెరిగిపోయింది.[7] తాము కూడా సిక్ఖు దేశంలోనే భాగమని పేర్కొంటూ వచ్చారు. వాటి స్థానిక పంచాయితీలు రాజ్యంలో సమాంతర అధికార కేంద్రాలుగా ఏర్పడి, గురు గోబింద్ సింగ్ ఆశయమైన సిక్ఖు సమష్టి సంపద అన్నది ఏర్పడిందని చెప్తూ, సిక్ఖులు మొత్తం అన్ని సైనిక, పౌర, కార్యనిర్వాహక అధికారాలను రాజ్యంలో కైవసం చేసుకున్నారు.[8] దీన్ని బ్రిటీష్ వారు ప్రమాదకరమైన సైనిక ప్రజాస్వామ్యంగా అభివర్ణించారు. బ్రిటీష్ ప్రతినిధులు, పర్యాటకులు ఈ ప్రాదేశిక ప్రభుత్వాలు తమ ఏకజాతి అధికారాన్ని నిలబెట్టుకుంటూనే, కేంద్ర దర్బారుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నాయని గమనించారు.
మహారాజా షేర్సింగ్ ఒకప్రక్క తన సైన్యం కోరుతున్న జీతభత్యాలు ఇవ్వలేకపోతూనే, దురభ్యాసాలకు డబ్బును వృధా ఖర్చు చేయడం కొనసాగించాడు. 1843 సెప్టెంబరులో అతన్ని అతని దాయాది, సైన్యంలో అధికారి అయిన అజిత్ సింగ్ సింధన్వాలియా హత్యచేశాడు. డోగ్రాలు ఇందుకు బాధ్యులైనవారి మీద పగతీర్చుకున్నారు, దాంతో రంజిత్ సింగ్ చిన్న భార్య జింద్ కౌర్ పసిపిల్లాడు దులీప్ సింగ్ని రాజును చేసి, అతనికి రాజప్రతినిధిగా ఆమెను నిలిపారు. వజీర్ హీరా సింగ్ రాజ ఖజానా (తోష్ఖానా) కొల్లగొట్టి, ఆ సొమ్ముతో రాజధాని విడిచి పారిపోతూండగా షామ్ సింగ్ అట్టారివాలియా నాయకత్వంలోని దళాలు చంపేశాయి, తర్వాత జింద్ కౌర్ సోదరుడు జవాహర్ సింగ్ 1844 డిసెంబరులో వజీరు అయ్యాడు.[8] 1845లో దులీప్ సింగ్ స్థానానికి ప్రమాదకరంగా కనిపిస్తూన్న పెషావరా సింగ్ని హత్యచేసేందుకు ఏర్పాటుచేశాడు. ఈ విషయమై అతనిని సైన్యం విచారణ ప్రారంభించింది. సైన్యానికి లంచాలిచ్చి తప్పించుకునే యత్నాలు చేసినా జింద్ కౌర్, దులీప్ సింగ్ల సమక్షంలో దారుణంగా చంపారు.
తన సోదరుడి హత్యకు కాణమైనవారిపై పగతీర్చుకుంటానని బహిరంగంగా జింద్ కౌర్ శపథం చేసింది. లాల్ సింగ్ వజీరుగా, తేజ్ సింగ్ సైన్యాధ్యక్షుడుగా నియమితులయ్యారు. వీరిద్దరూ డోగ్రా కూటమిలో కీలకమైన వ్యక్తులన్న విషయాన్ని సిక్ఖు చరిత్రకారులు నొక్కి చెప్పారు. వీరిద్దరూ మొదట పంజాబ్ ప్రాంతానికి ఆవల హిందూ ఉన్నత కులంలో జన్మించినవారు, 1818లో సిక్ఖు మతం స్వీకరించారు
రంజిత్ సింగ్ మరణించిన వెంటనే బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ బ్రిటీష్ పాలనకు, సిక్ఖు సామ్రాజ్యానికి సరిహద్దుగా ఉన్న సట్లెజ్ నదికి కొన్ని మైళ్ళు మాత్రమే దూరంలో ఉన్న ఫిరోజ్పూర్లో సైనిక కంటోన్మెంటు ఏర్పాటుచేసి ప్రధానంగా పంజాబ్కు సమీపంలోని ప్రాంతాల్లో సైనిక బలాన్ని పెంపొందించుకోవడం ప్రారంభించింది. 1843లో ఒక చర్యలో పంజాబ్ దక్షిణ ప్రాంతంలో ఉన్న సింధ్ ప్రాంతాన్ని గెలుచుకుని, స్వాధీనం చేసుకున్నారు, ఐతే ఈ చర్యను బ్రిటీష్ ప్రజానీకం సైతం క్రూరమైన, మూర్ఖమైన, అల్పమైన చర్యగా పరిగణించారు.[9] ఈ చర్య వల్ల బ్రిటీష్ వారు పంజాబ్లో ఏమాత్రం గౌరవం పొందకపోగా, బ్రిటీష్ చర్యల పట్ల, ఉద్దేశాల పట్ల సందేహాలతో ఉన్న జనం వెనక్కి వెళ్ళిపోతారేమోనని తొలగించారు.
ఈ సందర్భంలో గవర్నర్ జనరల్ లార్డ్ ఎలెన్బరో, అతని వారసుడు సర్ హెన్రీ హార్డింగె నేతృత్వంలోని బ్రిటీష్ వారు చేతలు, వైఖరి వివాదాస్పదమైనవి. బ్రిటీష్ వారు రాసిన పలు కథనాల్లో, నియంత్రించడానికి బలమైన నాయకత్వం లేని సిక్ఖు సైన్యం వల్ల సరిహద్దుల వెంబడి కంపెనీ భూభాగాలకు ముప్పు కలగవచ్చన్నది వారి ప్రధానమైన ఆందోళనగా రాసివుంది. సిక్ఖు, భారతీయ చరిత్రకారులు మాత్రం ఈ గవర్నర్ జనరల్స్ చేసిన ప్రయత్నాలు రక్షణ కోసం కావని, దాడి కోసమే ఉద్దేశించినవని బ్రిటీష్ కథనాలను వ్యతిరేకించారు. ఉదాహరణకు బ్రిడ్జింగ్ ట్రైన్లు, కోటల ముట్టడికి వాడే ఫిరంగులు వంటివి ఏర్పరిచారని, వీటిని దాడి కోసమే ఉపయోగిస్తారు తప్ప రక్షణ చర్యలకు వీటిని సిద్ధం చేయడం సాధారణంగా జరగదు.
సరిహద్దు జిల్లాలకు నియమించిన కొత్త రాజకీయ ప్రతినిధి మేజర్ జార్జ్ బ్రాడ్ఫూట్ నివేదికలు బ్రిటీష్ వైఖరిని ప్రభావితం చేశాయి. బ్రాడ్ఫూట్ నివేదికల్లో పంజాబ్లో అవ్యవస్థను నొక్కిచెప్పాడు, రాజ దర్బారులో జరుగుతున్న ప్రతీ అక్రమాన్ని, అవినీతికరమైన వ్యవహారానికి సంబంధించిన కథలను లెక్కకట్టి రాసేవాడు. పంజాబ్ భారతదేశంలో బ్రిటీష్ ప్రభావంలోకి రాకుండా ఇంకా స్వతంత్రంగా ఉన్న ఆఖరి రాజ్యం కావడం, భారతదేశంలో బ్రిటీష్ పట్టును ఎదిరించగల ఏకైక బలవత్తర శక్తిగా ఉండడం చేత కొందరు బ్రిటీష్ అధికారులకు పంజాబ్లోకి బ్రిటీష్ అధికారాన్ని, నియంత్రణను విస్తరించాలని తీవ్రమైన కోరికగా ఉండేది. పంజాబ్ రాజ్యం తన అధీనంలోని సంపదకు చాలా పేరొందింది, దాని ఖజానాలోని అనేక అమూల్యమైన సంపదలో కోహినూర్ వజ్రం ఒకటి. వీటన్నిటి కారణంగానూ బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ వారి దృష్టి పంజాబ్ మీద కేంద్రీకృతమై ఉంది.
సరిహద్దుల్లో బహిరంగంగా, కలహశీలంగా కనిపిస్తూ బ్రిటీష్ సైన్యం పెంపు, సైనిక ఏర్పాట్లు చేయడం పంజాబ్లోనూ, సిక్కు సైన్యంలోనూ ఉద్రిక్తతలు పెంచింది.
సిక్ఖు దర్బారు, ఈస్టిండియా కంపెనీలు పరస్పరం డిమాండ్లు, నిందలు వేసుకోవడం జరిగాకా దౌత్య సంబంధాలు తెగిపోయాయి. అప్పటికే ఒక డివిజన్ సైన్యం ఉన్న ఫిరోజ్పూర్ దిశగా ఈస్టిండియా కంపెనీ సైన్య ప్రయాణం సాగింది. ఈ సైన్యానికి బెంగాల్ సైన్యాధ్యక్షుడు సర్ హూ గౌ నాయకత్వం వహించాడు, వీరితో తనకు తాను సేనా నాయకత్వంలో హూ గౌ కింది స్థానం ఇచ్చుకుని బెంగాల్ గవర్నర్ జనరల్ సర్ హెన్రీ హార్డింగ్ కూడా తరలివచ్చాడు. ప్రతీ మూడు లేక నాలుగు బెంగాల్ కాల్బలాలకు కానీ, బెంగాలీ ఆశ్విక దళాలకు కానీ ఒక బ్రిటీష్ యూనిట్ చొప్పున బెంగాల్ సైన్యం వ్యూహ రూపనిర్మాణం జరిగింది. చాలావరకూ తుపాకీ దళంలో తేలికపాటి తుపాకులతో అశ్వాలపై ఉండే సైనికులతో ఉన్నాయి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.